Tremors In Delhi: పాక్లో భూకంపం.. భారత్లోని ఆరు రాష్ట్రాల్లో ప్రకంపనలు
పాకిస్తాన్లోని ఇస్లామాబాద్ నగరానికి నైరుతి దిక్కున 359 కి.మీ దూరంలో, 33 కి.మీ లోతులో భూకంప కేంద్రం(Tremors In Delhi) ఉందని తెలిపింది.
- By Pasha Published Date - 02:06 PM, Wed - 11 September 24
Tremors In Delhi: పాకిస్తాన్లోని ఇస్లామాబాద్, పంజాబ్, ఖైబర్ పంఖ్తూన్ఖ్వా ప్రావిన్స్ల పరిధిలో బుధవారం మధ్యాహ్నం భూకంపం సంభవించింది. దాని ప్రభావం మన దేశంలోనూ కనిపించింది. రాజధాని ఢిల్లీతో పాటు చండీగఢ్లోని పలు ఏరియాల్లోనూ ప్రజలు భూప్రకంపనలను ఫీలయ్యారు. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, పంజాబ్, జమ్మూకశ్మీర్లలోనూ భూప్రకంపనలు వచ్చాయని తెలుస్తోంది. పాకిస్తాన్లో సంభవించిన భూకంపం ఎఫెక్టును ఆప్ఘనిస్తాన్ సరిహద్దు ప్రాంతాల ప్రజల కూడా ఫీలైనట్లు సమాచారం. ఈవివరాలను నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ వెల్లడించింది. పాకిస్తాన్లోని ఇస్లామాబాద్ నగరానికి నైరుతి దిక్కున 359 కి.మీ దూరంలో, 33 కి.మీ లోతులో భూకంప కేంద్రం(Tremors In Delhi) ఉందని తెలిపింది. రిక్టరు స్కేలుపై భూకంప తీవ్రత 5.8గా నమోదైంది. ఈ భూకంపం వల్ల పాకిస్తాన్లో ఏదైనా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించిందా ? లేదా ? అనేది ఇంకా తెలియరాలేదు.
Also Read :Malaika Arora : అనుమానాస్పద స్థితిలో మలైకా అరోరా తండ్రి సూసైడ్
గతంలో ఆగస్టు 29న ఆఫ్ఘనిస్తాన్లో భూకంపం సంభవించిన టైంలో కూడా ఢిల్లీ ప్రజలు ప్రకంపనలను ఫీలయ్యారు. అప్పట్లో రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.7గా నమోదైంది. ఆ సమయంలో ఆఫ్ఘనిస్తాన్లో సంభవించిన భూకంపం వల్ల పాకిస్తాన్లోని ఇస్లామాబాద్, పంజాబ్, ఖైబర్ పంఖ్తూన్ఖ్వా ప్రావిన్స్లలో కూడా ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. కాగా, హిమాలయాలకు సమీపంలోని సీస్మిక్ జోన్లో ఢిల్లీ ఉంది.అందుకే దీనికి భూకంపాల ముప్పు ఎక్కువగా ఉంది. భారతదేశాన్ని ప్రధానంగా నాలుగు సీస్మిక్ జోన్లుగా వర్గీకరిస్తారు. ఢిల్లీ అనేది నాలుగో సీస్మిక్ జోన్ పరిధిలో ఉంది. ఢిల్లీ, ఉత్తరాఖండ్, జమ్మూకశ్మీర్లకు భూకంపాల రిస్క్ ఎక్కువగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. గతంలో కూడా ఆయా చోట్ల భారీ భూకంపాల వల్ల తీవ్ర ప్రాణనష్టం చోటుచేసుకున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఒకవేళ భూకంపాలు చోటుచేసుకున్నా భారీ ప్రాణనష్టం జరగకుండా సురక్షితమైన మోడలింగ్లో భవనాల నిర్మాణాలు ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.