ముగ్గురు అక్కాచెల్లెళ్ల ప్రాణాలను బలి తీసుకున్న లవ్ గేమ్ !!
16, 14, 12 ఏళ్ల వయసున్న నిషిక, ప్రచి, పఖి అనే ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఒకేసారి అపార్ట్మెంట్ 9వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. నిండు నూరేళ్ల భవిష్యత్తు ఉన్న ఈ చిన్నారులు, అర్థరాత్రి అందరూ నిద్రపోయాక ఈ ఘాతుకానికి ఒడిగట్టడం వెనుక ప్రాణాంతకమైన 'ఆన్లైన్ గేమింగ్' వ్యసనం ఉందనే అనుమానాలు కలచివేస్తున్నాయి
- Author : Sudheer
Date : 04-02-2026 - 1:15 IST
Published By : Hashtagu Telugu Desk
Three Sisters Die by Jumping from 9th Floor in Ghaziabad : ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో చోటుచేసుకున్న విషాద ఘటన డిజిటల్ యుగంలో పొంచి ఉన్న ప్రమాదాలకు అద్దం పడుతోంది. 16, 14, 12 ఏళ్ల వయసున్న నిషిక, ప్రచి, పఖి అనే ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఒకేసారి అపార్ట్మెంట్ 9వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. నిండు నూరేళ్ల భవిష్యత్తు ఉన్న ఈ చిన్నారులు, అర్థరాత్రి అందరూ నిద్రపోయాక ఈ ఘాతుకానికి ఒడిగట్టడం వెనుక ప్రాణాంతకమైన ‘ఆన్లైన్ గేమింగ్’ వ్యసనం ఉందనే అనుమానాలు కలచివేస్తున్నాయి. చనిపోయే ముందు వారు రాసిన క్షమాపణ లేఖ వారి మానసిక స్థితిని, ఆ సమయంలో వారు అనుభవించిన ఒత్తిడిని సూచిస్తోంది.
పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైన వివరాలు పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు వహించాల్సిన జాగ్రత్తలపై చర్చను రేపుతున్నాయి. ఈ బాలికలు ఒక కొరియన్ ‘లవ్ గేమ్’కు తీవ్రంగా బానిసలయ్యారని, ఆ ప్రభావంతో తమ పేర్లను కూడా కొరియన్ పేర్లుగా మార్చుకున్నారని తెలుస్తోంది. కేవలం ఆటగానే కాకుండా, ఆ గేమ్లోని పాత్రలతోనూ, సంస్కృతితోనూ వారు ఎంతలా మమేకమయ్యారంటే.. రెండేళ్లుగా పాఠశాలకు కూడా వెళ్లకుండా ఫోన్లకే పరిమితమయ్యారు. సాధారణంగా ఇటువంటి ప్రమాదకరమైన గేమ్లు వినియోగదారులను మానసికంగా లోబర్చుకుని, క్రమంగా కఠినమైన టాస్క్ల వైపు మళ్లిస్తూ, చివరకు ఆత్మహత్యే అంతిమ పరిష్కారమనేలా ప్రేరేపిస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రస్తుతం పోలీసులు ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. కేవలం గేమ్ మాత్రమే కారణమా లేక ఇతర బాహ్య ఒత్తిళ్లు ఏవైనా ఉన్నాయా అన్నది తేలాల్సి ఉంది. బాలికలు వాడిన స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లను సైబర్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ ‘సూసైడ్ గేమ్’ లింకులు ఎక్కడి నుంచి వచ్చాయి? వీరిని ఎవరైనా కావాలనే ఆ దిశగా నడిపించారా? అన్నది ఇప్పుడు మిస్టరీగా మారింది. టెక్నాలజీ ప్రపంచంలో పిల్లలు ఏం చూస్తున్నారు, దేనికి ఆకర్షితులవుతున్నారు అన్నది గమనించకపోతే ఎంతటి ఘోరాలు జరుగుతాయో చెప్పడానికి ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్ల మరణం ఒక హెచ్చరికగా మిగిలిపోయింది.