Shooters Arrested : మర్డర్ చేసి మనాలీకి వెళ్లారు.. కర్ణి సేన చీఫ్ హంతకులు దొరికారు
Shooters Arrested : ఈనెల 5న రాజస్థాన్కు చెందిన రాష్ట్రీయ రాజ్పుత్ కర్ణి సేన అధినేత సుఖ్దేవ్ సింగ్ గోగమేడి హత్య కేసులో ఇద్దరు కీలక నిందితులు దొరికారు.
- Author : Pasha
Date : 10-12-2023 - 8:22 IST
Published By : Hashtagu Telugu Desk
Shooters Arrested : ఈనెల 5న రాజస్థాన్కు చెందిన రాష్ట్రీయ రాజ్పుత్ కర్ణి సేన అధినేత సుఖ్దేవ్ సింగ్ గోగమేడి హత్య కేసులో ఇద్దరు కీలక నిందితులు దొరికారు. ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్, చండీగఢ్ పోలీసుల జాయింట్ ఆపరేషన్లో వారిని శనివారం అర్ధరాత్రి చండీగఢ్లో అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో ఇద్దరు షూటర్లు రోహిత్ రాథోడ్, నితిన్ ఫౌజీ ఉన్నారు. వారిద్దరిని జైపూర్కు తీసుకొస్తామని జైపూర్ పోలీసు కమిషనర్ బిజు జార్జ్ జోసెఫ్ వెల్లడించారు. కాల్పుల్లో వారికి సాయం చేసిన ఉధమ్ అనే వ్యక్తి ఇప్పటికే జైపూర్లో తమ అదుపులో ఉన్నాడని తెలిపారు.
We’re now on WhatsApp. Click to Join.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుఖ్దేవ్ సింగ్ గోగమేడిని మర్డర్ చేసిన తర్వాత షూటర్లు రోహిత్ రాథోడ్, నితిన్ ఫౌజీ తమ ఆయుధాలను దాచిపెట్టి రాజస్థాన్ నుంచి హర్యానాలోని హిసార్కు వెళ్లారు. అనంతరం హిమాచల్ ప్రదేశ్లోని మనాలీకి వెళ్లారు. అక్కడి నుంచి మళ్లీ చండీగఢ్కు చేరుకున్నారు. మొబైల్ ఫోన్ లొకేషన్ సమాచారం ఆధారంగా ఆ ఇద్దరిని పోలీసులు ట్రాక్ చేశారు. చివరకు శనివారం అర్ధరాత్రి ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్, చండీగఢ్ పోలీసుల జాయింట్ టీమ్ చండీగఢ్లోని సెక్టార్ 22లో ఉన్న నిర్దిష్ట లొకేషన్లో వారిని చుట్టుముట్టి అరెస్టు(Shooters Arrested) చేసిింది. సోమవారం వీరిని కోర్టు ఎదుట హాజరుపరుస్తామని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) అధిపతి దినేష్ వెల్లడించారు.
Also Read: New Ration Cards : కొత్త రేషన్ కార్డులకు వేళైంది..!!
ఆ ఇద్దరు షూటర్లు జరిపిన కాల్పుల్లో గోగమేడి, నవీన్ సింగ్ షెకావత్ మృతి చెందారు. గోగమేడి ప్రైవేట్ సెక్యూరిటీ గార్డు అజిత్ సింగ్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. సుఖ్దేవ్ సింగ్ గోగమేడి శరీరంలోకి తొమ్మిది బుల్లెట్లు చొచ్చుకెళ్లాయి. నవీన్సింగ్ షెకావత్కు ఏడు బుల్లెట్లు తగిలాయి. నిందితులను పట్టుకునేందుకు రాజస్థాన్ పోలీసు బృందాలు రాజస్థాన్, ఢిల్లీ, హర్యానా, పంజాబ్ తదితర ప్రాంతాల్లో దాడులు నిర్వహించాయి. చివరకు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్, చండీగఢ్ పోలీసుల జాయింట్ ఆపరేషన్లో పట్టుకున్నారు.