CWC Meeting : సోనియాగాంధీకి అస్వస్థత.. సీడబ్ల్యూసీ భేటీకి దూరం
సోనియా గాంధీ ఆరోగ్యం మెరుగుపడితే ప్రియాంక గాంధీ సమావేశానికి హాజరవుతారని, లేదంటే ఆమె కూడా తల్లి దగ్గరే ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.
- Author : Latha Suma
Date : 26-12-2024 - 4:29 IST
Published By : Hashtagu Telugu Desk
CWC Meeting : కాంగ్రెస్ అగ్రనేత, రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ అస్వస్థతకు గురవడంతో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. కర్ణాటకలోని బెలగావిలో గురువారం మరియు శుక్రవారం జరగనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశాలకు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ హాజరుకావాల్సి ఉంది. సోనియా గాంధీ వెంట కూతురు ప్రియాంక గాంధీ ఉన్నారు. ప్రస్తుతం రాహుల్ గాంధీ మాత్రమే ఈ సమావేశానికి హాజరయ్యారు. సోనియా గాంధీ ఆరోగ్యం మెరుగుపడితే ప్రియాంక గాంధీ సమావేశానికి హాజరవుతారని, లేదంటే ఆమె కూడా తల్లి దగ్గరే ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఈ సమావేశానికి సీడబ్ల్యూసీ సభ్యులు, శాశ్వత ఆహ్వానితులు, ప్రత్యేక ఆహ్వానితులు, పీసీసీలు, సీఎల్పీ నేతలు, పార్లమెంటరీ పార్టీ కార్యదర్శులు, మాజీ ముఖ్యమంత్రులు వంటి ప్రముఖులు హాజరుకానున్నారు. మొత్తం మీద 200 మంది కీలక నాయకులు ఈ భేటీలో పాల్గొననున్నారని ఏఐసీసీ ప్రకటించింది. బెలగావిలో జరగనున్న ఈ సీడబ్ల్యూసీ సమావేశాలకు “నవ సత్యాగ్రహ భైఠక్” అని పేరు పెట్టారు.
ఈ సమావేశంలో రెండు కీలక తీర్మానాలను ఆమోదించడంతో పాటు, వచ్చే ఏడాదిలో పార్టీ అనుసరించాల్సిన కార్యాచరణపై చర్చ జరుగుతుంది. గురువారం మధ్యాహ్నం మహాత్మాగాంధీ నగర్లో సీడబ్ల్యూసీ సమావేశం ప్రారంభమైంది. డిసెంబర్ 27న ఉదయం 11:30 గంటలకు ఏఐసీసీ సభ్యులు, పార్టీ కార్యకర్తలతో కలిసి “జై బాపు, జై భీమ్, జై సంవిధాన్” ర్యాలీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక.. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యల గురించి కూడా సమీక్ష జరుగనుంది.
Read Also: Bal Puraskars : ఏపీ బాలిక జెస్సీకి రాష్ట్రీయ బాల పురస్కార్.. మరో 16 మందికి కూడా..