Jamili Elections : జమిలి బిల్లు పై ప్రియాంకా గాంధీ విమర్శలు
Jamili Elections : జమిలి ఎన్నికలు కేంద్రం దృష్టికి అనుకూలంగా ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వాల స్వతంత్రతను తగ్గిస్తాయని అన్నారు
- By Sudheer Published Date - 04:04 PM, Tue - 17 December 24

జమిలి ఎన్నికల బిల్లు (Jamili ఎలేచ్షన్స్ Bill) దేశ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ (MP Priyanka Gandhi) విమర్శించారు. లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టిన అనంతరం జరిగిన ఓటింగ్లో అనేక సభ్యులు అనుకూలంగా ఓటు వేసినప్పటికీ, కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ఆమె స్పష్టం చేశారు. బిల్లు వల్ల సమాఖ్య వ్యవస్థ క్షీణించి, రాష్ట్రాలకు ఇచ్చిన హక్కులు నష్టపోతాయని ఆమె అభిప్రాయపడ్డారు. జమిలి ఎన్నికలు కేంద్రం దృష్టికి అనుకూలంగా ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వాల స్వతంత్రతను తగ్గిస్తాయని అన్నారు. దేశం విభిన్న రకాల సమస్యలతో సతమతమవుతున్న వేళ, ఒకే సమయంలో ఎన్నికలు నిర్వహించడం సాధ్యంకాదని, ప్రజల ఓటు హక్కుపై ప్రభావం చూపుతుందని ఆమె ఆరోపించారు.
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాజీవ్ శుక్లా మాట్లాడుతూ.. ఈ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC)కి పంపాలని డిమాండ్ చేశారు. బిల్లులో అనేక లోటుపాట్లు, అస్పష్టతలు ఉన్నాయి. విస్తృత చర్చ ద్వారా వాటిని స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ముందుకు వెళ్లాలని కోరారు. బిల్లు వల్ల రాష్ట్ర ప్రభుత్వాలకు నష్టం జరుగుతుందని, జమిలి ఎన్నికలు ప్రజాస్వామ్యానికి ముప్పు తెచ్చే అవకాశముందని కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రియాంకా గాంధీ మాటలతో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు తగిన ప్రాధాన్యత ఇవ్వకుండా బిల్లు ఆమోదించడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా తప్పుబట్టింది. మొత్తానికి జమిలి ఎన్నికల బిల్లు పట్ల రాజకీయ పార్టీల మధ్య తీవ్ర విభేదాలు ఏర్పడ్డాయి. ఒక వర్గం దీన్ని సమయాన్ని ఆదా చేసే పరిష్కారమని చూస్తుంటే, మరో వర్గం దీన్ని రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని నమ్ముతోంది. ఈ వివాదంపై కేంద్రం, ప్రతిపక్షాలు మరింత స్పష్టతనిచ్చే ప్రయత్నం చేయాల్సిన అవసరం కనిపిస్తోంది.
Read Also : Allu Arjun : అల్లు అర్జున్ ను నిలదీసిన POW సంధ్య