PM Modi : ప్రధాని మోడీ ‘‘కామ్ కీ బాత్’’ చేయడం లేదు : రాహుల్గాంధీ
ప్రధానమంత్రి నరేంద్రమోడీపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ (PM Modi) విరుచుకుపడ్డారు.
- Author : Pasha
Date : 23-09-2024 - 4:42 IST
Published By : Hashtagu Telugu Desk
PM Modi : ప్రధానమంత్రి నరేంద్రమోడీపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ (PM Modi) విరుచుకుపడ్డారు. ప్రధాని మోడీ దేశంలోని ముఖ్యమైన సమస్యలను పరిష్కరించే ‘‘కామ్ కీ బాత్’’ చేయకుండా.. ఎవరికీ పనికిరాని “మన్ కీ బాత్” చెప్పుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారని ఆయన విమర్శించారు. ఉద్యోగాలు కల్పించడం, పెరుగుతున్న ధరలను నియంత్రించడం వంటి ‘కామ్ కీ బాత్’ గురించి మాట్లాడాలని ప్రధాని మోడీకి సూచించారు. ఇవాళ జమ్మూకశ్మీరులోని శ్రీనగర్లో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో రాహుల్ గాంధీ ప్రసంగించారు.
Also Read :Onion Prices : ఉల్లి ధరలను కంట్రోల్ చేసేందుకు కేంద్రం కీలక నిర్ణయం
బీజేపీ, ఆర్ఎస్ఎస్లు దేశంలో ద్వేషాన్ని వ్యాపింపజేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. ‘‘బీజేపీ బహుజన వ్యతిరేకి. దేశంలో రిజర్వేషన్లను కాపాడే బాధ్యత మాదే. కుల గణన పేరు చెప్పడానికే ప్రధాని మోడీ భయపడుతున్నారు. బహుజనులు హక్కులను పొందడం బహుశా వారికి ఇష్టం లేదు’’ అని కాంగ్రెస్ అగ్రనేత ఆరోపించారు. ‘‘దేశంలో రిజర్వేషన్లను 50 శాతం దాటించాలి. దీనివల్ల చాలా వర్గాల వారికి ప్రయోజనం చేకూరుతుంది. సమాజంలోని ప్రతి ఒక్కరికి న్యాయమైన వాటా దక్కాలి’’ అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో ఆదివాసీలు, దళితులు, ఓబీసీలకు సరైన ప్రాధాన్యం దక్కడం లేదన్నారు. దీనివల్ల వారు అభివృద్ధిలో భాగస్వామ్యం పొందలేకపోతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.
Also Read :UPI Transaction Fees : ఛార్జీలు విధిస్తే యూపీఐ లావాదేవీలు చేయబోం.. సర్వేలో సంచలన విషయాలు
‘‘బీజేపీ, ఆర్ఎస్ఎస్లు దేశంలో చిచ్చుపెడుతున్నాయి. దేశంలోని వివిధ వర్గాల మధ్య తగాదాలు పెట్టిస్తున్నాయి. అన్నదమ్ములు ఒకరితో ఒకరు పొట్లాడుకునేలా చేస్తున్నాయి’’ అని రాహుల్ మండిపడ్డారు. విద్యావంతులకు ఉద్యోగ అవకాశాలను కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు మొదటి దశ ఓటింగ్ సెప్టెంబర్ 18న జరిగింది. ఇక రెండో దశ ఓటింగ్ సెప్టెంబర్ 25న, మూడో దశ అక్టోబర్ 1న జరగబోతోంది. ఓట్ల లెక్కింపు అక్టోబర్ 8న జరుగుతుంది.