PM Modi Katora Deeksha : ప్రాణ ప్రతిష్ట అనంతరం దీక్ష విరమించిన ప్రధాని మోడీ..
- Author : Sudheer
Date : 22-01-2024 - 2:43 IST
Published By : Hashtagu Telugu Desk
భారత దేశ చరిత్రలో అత్యంత అద్వితీయమైన, అద్భుతమైన, చిరస్మరణీయమైన ఘట్టం ముగిసింది. కోట్ల మంది ఆరాధించే అయోధ్య రామాలయంలో ప్రధానమంత్రి మోడీ.. బాల రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేశారు. బాల రాముడు.. అయోధ్యలో కొలువుదీరాడు. ప్రాణప్రతిష్ఠ క్రతువు ముగిసిన తర్వాత మోడీ తన ఉపవాస దీక్షను విరమించారు. ఈ సందర్భంగా ఓ సాధువు మోడీ కి తీర్థం అందించి దీక్ష విరమింపజేశారు. అనంతరం ఆయన ఆశీర్వాదాన్ని మోడీ తీసుకున్నారు. అయోధ్య రాముడు గర్భ గుడిలో కొలువు దీరేంత వరకూ అత్యంత నిష్ఠగా దీక్ష చేస్తానని మోడీ జనవరి 12వ తేదీన ప్రకటించారు. అప్పటి నుంచి అదే నిష్ఠను కొనసాగిస్తున్నారు. ఈరోజు (జనవరి 22) ప్రాణ ప్రతిష్ఠ ముగియడం తో తన దీక్షను విరమించారు.
We’re now on WhatsApp. Click to Join.
నేటితో 500 ఏళ్ల ఎదురు చూపులకు తెరపడింది. హిందువులు ఎంతో ఉద్విగ్నంగా నిరీక్షించిన అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ వేడుక అంగరంగ వైభవంగా పూర్తైంది. సరిగ్గా మధ్యాహ్నం 12:29:08 నుంచి 12:30:32 మధ్య కాలంలో ఈ క్రతువు నిర్వహించారు. వేదమంత్రోఛ్చారణల మధ్య ఈ ఘట్టం ముగిసింది. ఆలయం వెలుపల ఏర్పాటు చేసిన స్క్రీన్స్లో ప్రాణ ప్రతిష్ఠ తంతుని ప్రత్యక్ష ప్రసారం చేశారు. ప్రధానితో పాటు 14 జంటలు ఈ క్రతువులో పాల్గొన్నాయి. ఈ ముహూర్తాన ఆలయ ప్రాంగణంతో పాటు అయోధ్య అంతా జైశ్రీరామ్ నినాదాలతో మారుమోగిపోయింది. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో ప్రధాని మోడీ తో పాటు RSS చీఫ్ మోహన్ భగవత్, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు బాలరాముని దర్శనం కేవలం ప్రముఖులకు మాత్రమే..రేపటి నుంచి సామాన్య భక్తులు దర్శనం చేసుకునే సదుపాయం కల్పించనున్నట్లు సమాచారం.
Read Also : Samantha: సల్మాన్ ఖాన్తో కలిసి నటించేందుకు సమంత ప్లాన్ చేస్తుందా?