Election Code : ‘ఎన్నికల కోడ్’తో ఆటంకమా ? ‘జమిలి’ బిల్లులోని ప్రతిపాదనపై ఈసీ ఫైర్
ఒకవేళ ఎవరైనా నేతలు, కార్యకర్తలు ఎన్నికల కోడ్ ప్రకారం నడుచుకోకుంటే.. ఎన్నికల చట్టాల(Election Code) ప్రకారం చర్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
- By Pasha Published Date - 05:27 PM, Sun - 12 January 25

Election Code : ఎన్నికల కోడ్.. ఈ మాట వినగానే ఎన్నికల టైంలో రాజకీయ పార్టీలన్నీ అలర్ట్ అవుతాయి. ఎన్నికల కోడ్ ప్రకారం తు.చ తప్పకుండా నడుచుకుంటాయి. ఒకవేళ ఎవరైనా నేతలు, కార్యకర్తలు ఎన్నికల కోడ్ ప్రకారం నడుచుకోకుంటే.. ఎన్నికల చట్టాల(Election Code) ప్రకారం చర్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంతటి ప్రాధాన్యం కలిగిన ఎన్నికల కోడ్ గురించి జమిలి ఎన్నికలకు సంబంధించిన ఒక రాజ్యాంగ సవరణ బిల్లులో అభ్యంతరకర అంశాలను ప్రస్తావించారు. దానివల్ల ప్రభుత్వ పాలనా విధానాల అమలుకు ఆటంకం కలుగుతుందని బిల్లులో పొందుపర్చారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం 2023 మార్చిలోనే ఘాటుగా స్పందించింది. నేరుగా లా కమిషన్కు, మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సారథ్యంలోని జమిలి ఎన్నికల కమిటీకి తమ అభిప్రాయాలతో నివేదికను అందజేసింది. ఇంతకీ ఈసీ ఏం రిప్లై ఇచ్చిందో చూద్దాం..
Also Read :Worlds Smartest Pen : న్యూవా పెన్.. పెన్నులో కూడా ఇన్ని ఫీచర్లా ?!
‘‘ఎన్నికల కోడ్పై అభ్యంతరం తెలుపుతూ జమిలి ఎన్నికల రాజ్యాంగ సవరణ బిల్లులో చేసిన పలు ప్రతిపాదనలను అభ్యంతరకరంగా ఉన్నాయి. ఎన్నికల కోడ్ అమలైతేనే స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికల నియమావళి వల్ల ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ప్రభుత్వ పాలనాపరమైన స్తబ్దత ఏర్పడుతుందనే అంశాన్ని జమిలి ఎన్నికల రాజ్యాంగ సవరణ బిల్లులో ప్రతిపాదించడం సరికాదు. అన్ని రాజకీయ పార్టీలను సంప్రదించిన తర్వాతే మేం ఎన్నికల కోడ్ను అమలు చేస్తాం. ఆయా పార్టీల సమన్వయంతోనే దాని అమలు జరుగుతుంది. ఎన్నికల కోడ్ అమలుతో రాజకీయ పార్టీలు, ప్రజలకు ఎన్నికల ప్రక్రియపై విశ్వాసం పెరుగుతుంది. సాధ్యమైనంత తక్కువ కాలం పాటే ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తేదీకి, పోలింగ్ తేదీలకు పెద్దగా గ్యాప్ ఉండదు. దానిపై రాద్ధాంతం, తప్పుడు కోణంలో చూడటం సరికాదు’’ అని లా కమిషన్కు ఈసీ రిప్లై ఇచ్చిందంటూ జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. మొత్తం మీద లా కమిషన్కు కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన సమాధానంలో నిజాయితీ, ధైర్యం స్పష్టంగా కనిపిస్తున్నాయి. దేశ ప్రజలంతా విశ్వసించే కేంద్ర ఎన్నికల సంఘం ఈవిధంగా సాహసోపేతంగా పనిచేసే వాతావరణం ఉంటేనే మంచిది.
Also Read :Sukesh Income : నా ఆదాయం రూ.7,640 కోట్లు.. పన్ను చెల్లిస్తా తీసుకోండి.. సుకేశ్ సంచలన లేఖ
జమిలి ఎన్నికలకు సంబంధించిన రెండు రాజ్యాంగ సవరణ బిల్లులను ఇటీవలే లోక్సభలో ప్రవేశపెట్టారు. అయితే వాటికి లోక్సభలో తగినంత మెజారిటీ లభించలేదు. దీంతో ఆ బిల్లుల సమగ్ర పరిశీలన, అధ్యయనం కోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 39 మంది సభ్యులతో కూడిన జేపీసీ ప్రస్తుతం ఈ రెండు బిల్లులను అధ్యయనం చేస్తోంది. ఈ తరుణంలో జమిలి ఎన్నికలకు సంబంధించిన ఒక రాజ్యాంగ సవరణ బిల్లులో ఎన్నికల కోడ్పై అభ్యంతరకరంగా ఉన్న ప్రతిపాదనల అంశం తెరపైకి వచ్చింది. దానిపై 2023 మార్చిలో కేంద్ర ఎన్నికల సంఘం తెలిపిన స్పందన వివరాలు బయటికి వచ్చి చర్చనీయాంశంగా మారాయి.