Mumbai: త్వరలో ముంబై ట్రాక్లపై నాన్-ఏసీ క్లోజ్డ్ డోర్ లోకల్ రైలు
- Author : Vamsi Chowdary Korata
Date : 15-04-2026 - 12:45 IST
Published By : Hashtagu Telugu Desk
Chennai ICF దేశ ఆర్థిక రాజధాని ముంబై లోకల్ రైళ్లలో ప్రయాణించే లక్షలాది మందికి భారతీయ రైల్వే శుభవార్త అందించింది. దేశంలోనే మొట్టమొదటిసారిగా నాన్-ఏసీ, ఆటోమేటిక్ డోర్లు మూసుకునే సదుపాయం ఉన్న లోకల్ రైలును ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. రద్దీగా ఉండే రైళ్ల నుంచి ప్రయాణికులు జారిపడి జరిగే ప్రమాదాలను నివారించడంతో పాటు తీవ్రమైన వేడి నుంచి ఉపశమనం కల్పించడం ఈ కొత్త రైలు రూపకల్పన వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం.
ప్రస్తుతం ముంబైలో కేవలం ఖరీదైన ఏసీ లోకల్ రైళ్లకు మాత్రమే ఆటోమేటిక్ క్లోజ్డ్ డోర్ వ్యవస్థ ఉంది. అయితే, సాధారణ తరగతి ప్రయాణికులకు కూడా ఏసీ రైళ్ల తరహా భద్రతను తక్కువ ధరకే అందించాలనే లక్ష్యంతో ఈ వినూత్న రైలును రూపొందించారు. ఇందులో ఏసీ లేనప్పటికీ, ప్రయాణికులకు సౌకర్యంగా ఉండేలా ‘ఫోర్స్డ్ వెంటిలేషన్ సిస్టమ్’ అనే అధునాతన సాంకేతికతను అమర్చారు. ఈ వ్యవస్థ రైలు డోర్లు మూసి ఉన్నా కూడా కోచ్లలోకి నిరంతరం స్వచ్ఛమైన గాలిని పంపింగ్ చేస్తుంది. తద్వారా సాధారణ రైళ్ల కంటే ఎక్కువ గాలి ప్రసరణ జరిగి, లోపల వాతావరణం చల్లగా ఉంటుంది.
ఈ సరికొత్త రైలు రేక్ను చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్)లో తయారు చేశారు. త్వరలోనే ముంబై సబర్బన్ ట్రాక్లపై దీని ట్రయల్స్ ప్రారంభం కానున్నాయి. ప్రయాణికుల భద్రత, సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఇందులో మరిన్ని ఆధునిక సదుపాయాలు కల్పించారు. అత్యవసర పరిస్థితుల్లో గార్డు లేదా మోటార్మ్యాన్తో మాట్లాడేందుకు ‘టాక్-బ్యాక్’ సిస్టమ్, మెరుగైన సీటింగ్ అమరిక, ఎల్ఈడీ లైటింగ్, రాబోయే స్టేషన్ల వివరాలను ప్రదర్శించే జీపీఎస్ ఆధారిత ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ వంటివి ఇందులో ఉన్నాయి.
ఈ రైలు టికెట్ ధరలపై ఇంకా అధికారిక ప్రకటన రానప్పటికీ, ఏసీ లోకల్ రైలు ఛార్జీల కంటే గణనీయంగా తక్కువగా, సాధారణ ఫస్ట్ క్లాస్ లేదా సెకండ్ క్లాస్ ధరలకు దగ్గరగా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ ట్రయల్స్ విజయవంతమైతే, ముంబై రైల్వే నెట్వర్క్ను ఆధునికీకరించే ప్రణాళికలో భాగంగా ఇలాంటి మరిన్ని రైళ్లను ప్రవేశపెట్టాలని రైల్వే బోర్డు యోచిస్తోంది.