Kejriwals Bail : కేజ్రీవాల్కు చుక్కెదురు.. ‘బెయిల్ స్టే ఆర్డర్’పై విచారణ ఈనెల 26కు వాయిదా
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తిహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మరో షాక్ తగిలింది.
- Author : Pasha
Date : 24-06-2024 - 1:35 IST
Published By : Hashtagu Telugu Desk
Kejriwals Bail : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తిహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మరో షాక్ తగిలింది. రౌస్ అవెన్యూ కోర్టు తనకు మంజూరు చేసిన మధ్యంతర బెయిల్పై ఢిల్లీ హైకోర్టు స్టే విధించడాన్ని సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు ఈనెల 26వ తేదీకి వాయిదా వేసింది. అంటే బుధవారం వరకు కేజ్రీవాల్ తిహార్ జైలులోనే ఉండాలి. ఆయనకు వచ్చిన మధ్యంతర బెయిల్పై స్టే ఉంటుందా ? తొలగుతుందా ? అనే దానిపై 26వ తేదీనే సుప్రీంకోర్టు వేదికగా క్లారిటీ వస్తుంది.
We’re now on WhatsApp. Click to Join
కేజ్రీవాల్కు లభించిన బెయిల్పై ఢిల్లీ హైకోర్టు విధించిన స్టే ఆర్డర్ను సమర్ధిస్తూ ఇవాళ సుప్రీంకోర్టులో ఈడీ కూడా వాదనలు వినిపించింది. ఈడీ తరపున ఏఎస్జీ ఎస్వీ రాజు వాదనలు వినిపిస్తూ.. బెయిల్పై(Kejriwals Bail) ఢిల్లీ హైకోర్టు విధించిన స్టేను తొలగించాలంటూ సీఎం కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ను వ్యతిరేకించారు. కేసు విచారణ కీలక దశలో ఉన్న తరుణంలో ఆప్ చీఫ్ కేజ్రీవాల్కు బెయిల్ ఇవ్వడం సరికాదన్నారు. కేజ్రీవాల్కు మంజూరైన బెయిల్పై స్టే విధించిన ఢిల్లీ హైకోర్టు ఇంకా తుది ఆదేశాలు వెలువరించాల్సి ఉందని ఈడీ న్యాయవాది ఎస్వీ రాజు తెలిపారు. కేజ్రీవాల్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదిస్తూ.. బెయిల్ ఆర్డర్పై మధ్యంతర స్టేను తొలగించాలని కోరారు. ఈ అంశంపై హైకోర్టు తుది ఉత్తర్వులు వెలువడే వరకు వేచి చూడాలని న్యాయమూర్తులు మనోజ్ మిశ్రా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టిలతో కూడిన సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ పేర్కొంది. ఈ పిటిషన్పై విచారణను జూన్ 26వ తేదీకి వాయిదా వేసింది.