Pannun Vs Nikhil : పన్నూ హత్యకు కుట్ర కేసు.. సుప్రీంకోర్టుకు నిఖిల్ ఫ్యామిలీ.. ఎవరీ నిఖిల్ ?
Pannun Vs Nikhil : అమెరికాలో ఉంటున్న ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర కేసులో భారత్కు చెందిన 52 ఏళ్ల నిఖిల్ గుప్తాను అరెస్టు చేసి చెక్ రిపబ్లిక్ జైలులో ఉంచారు.
- Author : Pasha
Date : 15-12-2023 - 1:30 IST
Published By : Hashtagu Telugu Desk
Pannun Vs Nikhil : అమెరికాలో ఉంటున్న ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర కేసులో భారత్కు చెందిన 52 ఏళ్ల నిఖిల్ గుప్తాను అరెస్టు చేసి చెక్ రిపబ్లిక్ జైలులో ఉంచారు. ఈ ఏడాది జూన్ నుంచి చెక్ రిపబ్లిక్ దేశంలోని ప్రేగ్ జైలులోనే నిఖిల్ ఉన్నారు. దీంతో నిఖిల్ తరఫున అతడి కుటుంబం భారత్లో న్యాయపోరాటానికి దిగింది. నిఖిల్ అప్పగింత కోసం అమెరికా ప్రారంభించిన చర్యలలో భారత ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరుతూ నిఖిల్ కుటుంబం భారత సుప్రీంకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ను దాఖలు చేసింది. రాజకీయ కుట్రలకు నిఖిల్ బాధితుడిగా మారాడని.. అతడి ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని పేర్కొంది. ఈ కేసులో తమకు న్యాయ సహాయం చేసేలా భారత హోం, విదేశాంగ శాఖలను ఆదేశించాలని నిఖిల్ కుటుంబం సుప్రీంకోర్టును కోరింది. దీనిపై భారత సుప్రీంకోర్టు ఇవాళ విచారణ చేపట్టే అవకాశాలు ఉన్నాయి.
We’re now on WhatsApp. Click to Join.
ఇంతకీ ఎవరీ నిఖిల్ ? ఏ పనిచేస్తాడు ? ఎందుకు అరెస్టు చేశారు ? అనే ప్రశ్నలు ఇప్పుడు ఉదయిస్తున్నాయి. వీటికి కచ్చితమైన సమాధానం ఫ్యూచరే చెబుతుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. అమెరికాలో ఉంటున్న ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు నిఖిల్ కుట్ర చేశాడని అమెరికా నిఘా సంస్థ సీఐఏతో పాటు అమెరికా అటార్నీ కార్యాలయం ఆరోపిస్తున్నాయి. పన్నూ హత్యకు ప్లాన్ చేయాలంటూ భారత ప్రభుత్వంలోని ఓ కీలక విభాగానికి చెందిన అత్యున్నత అధికారి నుంచి నిఖిల్కు ఆర్డర్స్ అందాయని సీఐఏ చెబుతోంది.
Also Read: UIIC – 300 Jobs : డిగ్రీ అర్హతతో 300 జాబ్స్.. తెలుగు రాష్ట్రాల్లోనూ పోస్టులు
దీనిపై విచారణ చేసేందుకు ఈ ఏడాది ఆగస్టులో స్వయంగా అమెరికా నిఘా విభాగం సీఐఏ చీఫ్ ఇండియాలో పర్యటించారు. భారత నిఘా సంస్థ రా సహా వివిధ సంస్థల ఉన్నతాధికారులతో వివిధ అంశాలపై ఆరా తీశారు. అయితే ఈ ఆరోపణలను భారత్ తీవ్రంగా పరిగణించింది. స్వయంగా అమెరికా సీఐఏ రంగంలోకి దిగడంతో అలర్ట్ అయిన భారత్.. ఈ వ్యవహారంపై దర్యాప్తునకు అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. చెక్ రిపబ్లిక్ జైలులో ఉన్న నిఖిల్ గుప్తాను తమకు అప్పగించాలంటూ ఆ దేశంపై అమెరికా ఒత్తిడి చేస్తోంది. నిఖిల్ గుప్తాపై(Pannun Vs Nikhil) అమెరికాలో హత్యకు కుట్ర కేసు నమోదైంది. ఈ కేసులో అతడు దోషిగా తేలితే గరిష్ఠంగా 20 ఏళ్ల జైలు శిక్ష పడనుంది.