2024 : కొత్త ఏడాదిలో వచ్చిన కొత్త రూల్స్..
- By Sudheer Published Date - 01:46 PM, Mon - 1 January 24
దేశ వ్యాప్తంగా 2023 కు బై బై చెప్పి..2024 లో గ్రాండ్ గా అడుగుపెట్టారు. గత ఏడాదిలో జరిగిన జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ..కొత్త ఏడాదికి స్వాగతం పలికారు. ఈఏడాది అంత శుభం కలగాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఇక కొత్త ఏడాది లో కొత్త రూల్స్ తో పాటు పలు మార్పులు చేసింది కేంద్ర ప్రభుత్వం. మరి ఆ రూల్స్ ఏంటి..? మార్పులు ఏంటి అనేవి చూద్దాం.
కొత్త సిమ్ కార్డుకు కొత్త రూల్..
సిమ్ కార్డుల జారీకి డిజిటల్ వెరిఫికేషన్ విధానం అమలులోకి వచ్చింది. టెలికాం కంపెనీలు పూర్తిగా మొబైల్ ద్వారానే వెరిఫికేషన్ చేస్తాయి. సిమ్ కార్డుల ద్వారా జరిగే మోసాలను అరికట్టేందుకు కేంద్రం ఈ విధానాన్ని తీసుకొచ్చింది. ఇప్పటి వరకు అనుసరించిన పేపర్ ఆధారిత కేవైసీ వెరిఫికేషన్ విధానానికి స్వస్తి పలికింది.
పొదుపు పథకాల వడ్డీ పెంపు..
ఆర్థికపరమైన మార్పుల విషయానికి వస్తే పొదుపు పథకాలకు చెల్లించే వడ్డీ రేట్లను కేంద్రం పెంచింది. జనవరి – మార్చి త్రైమాసికానికి సంబంధించి వడ్డీ రేటు పెరిగింది. ప్రస్తుతం 8 శాతం వడ్డీ చెల్లిస్తున్న సుకన్య సమృద్ధి పథకానికి 20 బేసిస్ పాయింట్లను పెంచింది. అంటే, వచ్చే మూడు నెలల పాటు ఈ పథకం లబ్దిదారులకు 8.2 శాతం వడ్డీ చెల్లిస్తుందన్నమాట. మూడేళ్ల టైమ్ డిపాజిట్పై 7 శాతంగా ఉన్న వడ్డీ రేటును 7.1 శాతానికి పెంచింది.
నిలిచిపోనున్న యూపీఐ ఖాతాలు
ఏడాదికి పైగా ఉపయోగించని యూపీఐ ఖాతాలు నేటి నుంచి డీయాక్టివేట్ అవుతాయి. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం తదితర యూపీఐలలో నిరుపయోగంగా ఉన్న ఖాతాలను తొలగించనున్నట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గతేడాది నవంబర్ 7 న ప్రకటించింది.
హెల్త్ ఇన్సూరెన్స్ రూల్స్..
హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలకు సంబంధించిన ప్రాథమిక సమాచారం ఇకపై సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఇందుకోసం బీమా కంపెనీలు ‘కస్టమర్ ఇన్ఫర్మేషన్ షీట్ (సీఐఎస్)’ లను విడుదల చేయనున్నాయి. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ (ఐఆర్డీఏ) ఆదేశాల మేరకు కంపెనీలు ఈ చర్యలు చేపట్టాయి.
పెరగనున్న కార్ల ధరలు..
జనవరి నుంచి తమ వాహనాల ధరలు పెంచుతున్నట్లు టాటా మోటార్స్, ఆడి, మారుతీ సుజుకీ, మెర్సిడెస్ బెంజ్ కంపెనీలు గతంలోనే ప్రకటించాయి. ముడి సరుకుల ధరలు పెరగడంతో ఉత్పత్తి వ్యయం పెరిగిందని, దీంతో వాహనాల ధరలను 2 శాతం నుంచి 3 శాతం పెంచక తప్పడంలేదని తెలిపాయి.
కొత్త పన్ను విధానంలో అనేక మార్పులు
బడ్జెట్ 2020లో మొదటిసారిగా కొత్త పన్ను విధానం ప్రకటించింది. ప్రభుత్వం మార్చి 2023లో ఈ డిఫాల్ట్ పన్ను విధానాన్ని రూపొందించింది. పన్ను చెల్లింపుదారుడు తనంతట తానుగా ఏదైనా పన్ను విధానాన్ని ఎంచుకోకపోతే అటువంటి పరిస్థితిలో మొదటి పన్ను విధానం ప్రకారం TDS కట్ అవుతుందని ఆర్థిక మంత్రి ప్రకటించారు. మీరు పాత పన్ను విధానాన్ని ఎంచుకుంటే మాత్రమే మీ పన్ను ఆ విధానం ప్రకారం లెక్కించబడుతుంది.
ఈ ఏడాది కొత్త పన్ను విధానంలో కొన్ని మార్పులు చేశారు. దీని తర్వాత ప్రాథమిక మినహాయింపు పరిమితి రూ.2.5 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెరిగింది. పన్ను మినహాయింపు పరిమితి ఇప్పుడు రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెరిగింది. ప్రామాణిక పన్ను మినహాయింపు పరిమితి రూ. 50,000. ఈ సందర్భంలో మీరు కొత్త పన్ను విధానంలో మొత్తం రూ.7.5 లక్షల రాయితీని పొందుతారు.
ఆస్తి అమ్మకంపై మూలధన లాభాలు
కేంద్ర ప్రభుత్వం ఆస్తుల విక్రయం ద్వారా వచ్చే ఆదాయంపై మినహాయింపు పరిమితిని రూ.10 కోట్లుగా నిర్ణయించింది. అటువంటి పరిస్థితిలో పన్ను చెల్లింపుదారులు ఆదాయపు పన్ను సెక్షన్లు 54, 54F కింద రెసిడెన్షియల్ ప్రాపర్టీ నుండి వచ్చే ఆదాయంపై రూ. 10 కోట్ల వరకు ఆదాయాన్ని క్లెయిమ్ చేయవచ్చు.
పాత ఐటీ రిటర్న్లను తొలగించవచ్చు
ఆదాయపు పన్ను శాఖ పన్ను చెల్లింపుదారులకు పాత సంవత్సరాల వెరిఫై చేయని ఐటీ రిటర్న్లను తొలగించే సదుపాయాన్ని అందిస్తుంది. అటువంటి పరిస్థితిలో, ధృవీకరణ పూర్తికాని మునుపటి సంవత్సరాల IT రిటర్న్లను మీరు సులభంగా తొలగించవచ్చు.
ఆన్లైన్ గేమింగ్పై 30 శాతం పన్ను
ఈ ఏడాది ఆన్లైన్ గేమింగ్ ద్వారా వచ్చే ఆదాయాలపై 30 శాతం పన్ను విధించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిబంధన మార్చి 31, 2023 నుండి అమలులోకి వచ్చింది. గతంలో రూ.10,000 కంటే ఎక్కువ వార్షికాదాయంపై టీడీఎస్ విధించగా, ఇప్పుడు దాన్ని 30 శాతానికి పెంచారు.
Read Also :
Related News
Lok Sabha Elections : తెలంగాణ లో లోక్ సభ ఎన్నికలను పట్టించుకోని ఓటర్లు..
రాష్ట్రంలో ఎక్కడ కూడా ఓట్ల సందడి కనిపించడం లేదు. అసలు రేపు ఎన్నికలు అనే సంగతి కూడా చాలామందికి తెలియని పరిస్థితి నెలకొంది.