Narendra Modi: 98 ఏళ్ల వృద్ధుడి పాదాభివందనం చేస్తున్న మోదీ
- Author : Vamsi Chowdary Korata
Date : 09-05-2026 - 12:36 IST
Published By : Hashtagu Telugu Desk
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార వేడుకలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రదర్శించిన వినమ్రత అందరినీ ఆకట్టుకుంది. కోల్కతాలో జరిగిన ఈ కార్యక్రమంలో 98 ఏళ్ల వయసున్న బీజేపీ సీనియర్ కార్యకర్త మఖన్ లాల్ సర్కార్ పాదాలకు మోదీ నమస్కరించి, ఆయన్ను ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. ఈ భావోద్వేగ దృశ్యానికి అక్కడున్న వేలాది మంది కార్యకర్తలు, మద్దతుదారులు హర్షధ్వానాలు చేశారు.
మఖన్ లాల్ సర్కార్కు పార్టీలో ప్రత్యేక గుర్తింపు ఉంది. 1953లో భారత త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసే ఉద్యమంలో భాగంగా శ్యామా ప్రసాద్ ముఖర్జీతో కలిసి కశ్మీర్లో ఆయన అరెస్టయ్యారు. అలాంటి సీనియర్ నేత వేదిక వద్దకు వచ్చి పలకరించగానే, ప్రధాని మోదీ ఆయన కాళ్లకు నమస్కరించి గౌరవం చాటారు.
పశ్చిమ బెంగాల్లో 15 ఏళ్ల తృణమూల్ కాంగ్రెస్ పాలనకు ముగింపు పలుకుతూ, బీజేపీ తొలిసారిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నూతన ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేసే ఈ చారిత్రక ఘట్టానికి హాజరయ్యేందుకు ప్రధాని మోదీ కోల్కతా వచ్చారు. బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్కు చేరుకున్న ఆయనకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య, ముఖ్యమంత్రిగా నియమితులైన సువేందు అధికారి ఘనస్వాగతం పలికారు. ‘జై శ్రీరామ్’ నినాదాలతో మైదానం మారుమోగింది. అంతకుముందు ఓపెన్ టాప్ వాహనంలో ప్రధాని అభివాదం చేస్తూ వేదిక వద్దకు చేరుకున్నారు.