Modi : మోడీ చేతిలో రామాస్త్రం
- By Sudheer Published Date - 10:31 AM, Thu - 11 January 24
డా.ప్రసాదమూర్తి
అయోధ్యలో రామ మందిర నిర్మాణం ఇంకా పూర్తికాలేదు. మరి పూర్తి కాని మందిరానికి పూజలు దేనికి అనే ప్రశ్న, మనం కాదు, సాక్షాత్తు పూరీ జగద్గురువు శంకరాచార్యుడే వేశారు. దీనికి నవనిర్మాణ రామ మందిరంలో తల మునకలైపోయిన బిజెపి నాయకత్వానికి గాని, ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్ తదితర హిందూ సంస్థల అధినాయకులకు గాని సమాధానం చెప్పే తీరుబడి లేదు. తీరుబడి ఉన్నా జవాబు చెప్పాలన్న ఉద్దేశమూ లేదు. ఇక అంతా రామమయమే. చూస్తూ చూస్తుండగానే జనవరి 22వ తేదీ అత్యంత వేగంగా దూసుకు వస్తోంది. అంతకు మించిన వేగంగా రామ మందిరం ప్రారంభోత్సవానికి, మందిరంలో రామ విగ్రహ ప్రాణ ప్రతిష్టాపనకు ప్రయత్నాలు సాగిపోతున్నాయి. దేశంలో అత్యధిక శాతం హిందువులే. వారంతా రామ భక్తులే. అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరగడం రామ భక్తులందరికీ పండగే. కానీ ఈ రామ మందిర నిర్మాణ నేపథ్యం, మందిర శంకుస్థాపన, సగం సగం పూర్తయిన మందిర ఉద్ఘాటన మొదలైన అంశాలను అల్లుకొని ఉన్న రాజకీయాలను చూస్తే రామ భక్తులు కూడా రామ రామా అని ముక్కు మీద వేలేసుకునే పరిస్థితులు తలెత్తాయి.
రామ మందిరం ప్రారంభోత్సవానికి అనేకమంది రాజకీయ నాయకులకు ఆహ్వానం అందింది. విపక్షాలకు చెందిన పలువురు నాయకులు ఈ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరు కావచ్చు. మరికొందరు ఇది రామ మందిరం కాదు రాజకీయ మందిరం అని నిర్ధారించుకొని రాముడి పేరు మీద సాగుతున్న రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. వారిలో సిపిఎం నాయకులు సీతారాం ఏచూరి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తాము హాజరు కావడం లేదని తమ నిర్ణయాన్ని ప్రకటించారు. రామ మందిరం ప్రారంభోత్సవానికి ప్రతిపక్షాలను ఆహ్వానించడంలోనే గొప్ప రాజకీయం చోటుచేసుకుంది. రామ మందిరం నిర్మాణం తమ ఘనతేనని కోట్లాది భారతీయులకు చాటి చెప్పుకొని, తద్వారా వారి సానుభూతిని పొంది, ఆ సానుభూతిని ఓట్ల రూపంలో తర్జుమా చేసుకుని మూడోసారి కేంద్రంలో అధికారంలోకి రావాలని బిజెపి నాయకత్వం భావిస్తోంది. ఈ విషయం అర్థమైన ప్రతిపక్షాలు ఈ మందిర ప్రారంభోత్సవానికి వెళ్లాలా లేదా అన్న డోలాయమాన స్థితిలో పడిపోయాయి. ప్రతిపక్షాలను ఇరకాటంలో పెట్టడానికి బిజెపి వారు చూస్తున్నారు. ప్రారంభోత్సవానికి వస్తే తాము రామ మందిర నిర్మాణ క్రెడిట్ ను పొందడంలో తమకు ప్రతిపక్షాల మద్దతు ఉన్నట్టు లెక్క. రాకపోతే వారు రామవిరోధులని, హిందూ విరోధులని ముద్ర వేసి తద్వారా రాజకీయ లబ్ధి పొందవచ్చు. రామ మందిరం అనే అడకత్తెరలో ప్రతిపక్షాలను పోక చెక్కలా ఇరికించడానికి బిజెపి వారు పన్నిన వ్యూహాన్ని పసిగట్టిన వారు ఆహ్వానాన్ని తిరస్కరిస్తున్నారు. దాన్ని పసిగట్టి కూడా హిందువులకు ఎక్కడ దూరమవుతామో అని కొందరు హాజరవడానికి సిద్ధమవుతున్నారు. ఇది ఇప్పుడు మనం చూడబోతున్న, చూస్తున్న రామ మందిర రాజకీయ చోద్యం.
ఇప్పటికే రామమందిరం ప్రారంభోత్సవానికి దేశంలోని రకరకాల ప్రముఖులను పిలవడమే కాకుండా కోట్లాది రామ భక్తులను కూడా పరోక్షంగా ఆహ్వానిస్తున్నట్టు హంగామా కొనసాగుతోంది. ప్రజలు ఆరోజున అయోధ్యనే కాకుండా మొత్తం ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్నే ముంచెత్తే అవకాశం కనిపిస్తోంది. అంతేకాదు బిజెపి అనుకూల గోదీ మీడియా రోజు రోజూ క్షణక్షణం వింత వింత రామ మందిర ఉద్ఘాటన అప్డేట్స్ తో దేశమంతా ఊదరగొడుతోంది. అంతేకాదు రామ మందిర నమూనాతో చేసిన చిత్రపటాలు, చిన్న చిన్న విగ్రహాలు కోట్లాదిగా నిర్మితమయ్యాయి. వాటికోసం దేశంలో ప్రజలంతా ఆన్లైన్లో ఆర్డర్లు పెట్టుకుంటున్నారు. ఇక దేశమంతా రామ భక్తుల, హిందువుల ప్రతి ఇంటా అయోధ్య రామ మందిరం నమూనా తో ఉన్న చిన్నపాటి మందిరం ఉంటుంది. ఇదంతా ఒక ఎత్తు. రామమందిర ప్రారంభోత్సవ సమయంలో రాముడు విగ్రహం పక్కన నిలబడి నరేంద్ర మోడీ గారు విగ్రహం పైన ఉన్న తెరను తొలగించినప్పుడు దేశం మొత్తానికి కెమెరాల ఫస్ట్ క్లిక్ లో కనిపిస్తారు. అంటే రాముడి ప్రాణప్రతిష్ట జరిగిన వెంటనే రాముడి మొదటి చూపు మోడీ పైన, మోడీ మొదటి చూపు రాముడిపైన పడుతుంది. దీన్ని హిందూ పీఠాధిపతులు అనేకమంది వ్యతిరేకిస్తున్నారు. పూరీ జగద్గురు శంకరాచార్యులు ప్రాణ ప్రతిష్ట చేయడానికి మోడీ గారు ఉంటే ఇక అక్కడ తాము ఏం చేస్తామని, చప్పట్లు కొట్టడానికి వెళ్లాలా అని వ్యాఖ్యానించి తమ అభ్యంతరాన్ని తెలియజేశారు. ఆ ప్రారంభోత్సవ కార్యక్రమానికి పలువురు సాధుసంతులు శంకరాచార్యులు వెళ్లడం లేదు. దీనికి కారణంగా వారు ఒకటే చెప్తున్నారు. రాముడి పేరు మీద మందిర నిర్మాణం జరిగింది గాని, ఆ మందిర నిర్మాణం రాముడి కోసం కాదని, రాజకీయం కోసం అని వారు గమనించారు.
నిజానికి రామ మందిర నిర్మాణ వ్యవహారం చుట్టూ రాజకీయాలు లేకపోతే ఆ ప్రారంభోత్సవ ప్రచార వాహనాలు, ఆ ప్రారంభోత్సవానికి బయలుదేరిన వాహనాలు కేవలం రాముడి చిత్రపటాన్ని మాత్రమే ప్రదర్శించాలి. కానీ రాముని పటం ఒకపక్క, అంతకుమించిన సైజులో నరేంద్ర మోడీ చిత్రం మరొక పక్క పెద్ద ఎత్తున కనిపిస్తుంది. ఇదంతా చూస్తుంటే ఈ కోలాహలం ఈ హంగామా ఏమిటని హిందూ సాధువులు, సంతులు, శంకరాచార్యులు ప్రశ్నిస్తున్నారు. అసలు శాస్త్రం ప్రకారం పూర్తికాని మందిరానికి ఆరంభోత్సవాలు గానీ, ఆ మందిరంలో విగ్రహ ప్రతిష్టాపన గాని జరగకూడదు. అదే వారి వాదన. వాస్తవానికి శాస్త్రం కోసం, మతం కోసం, రాముడి కోసం జరుగుతున్న కార్యక్రమం కాదు కదా ఇది, తమ కోసం తాము జరుపుకుంటున్న కార్యక్రమం కదా! ఇది పూర్తిగా తేటతెల్లమైన విషయమే కదా. అందుకే ఆ పీఠాధిపతుల మాటలు ఎవరూ లెక్క చేయడం లేదు. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ అధినాయకులు తాము ఈ కార్యక్రమానికి హాజరు కావడం లేదని తీసుకున్న నిర్ణయం సముచితమా అనుచితమా అనేది వారు దీన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లే శక్తి సామర్థ్యాల మీద ఆధారపడి ఉంటుంది. అతి సున్నితమైన విషయం, మతంతో ముడిపెట్టబడిన విషయం కనుక ఎంత సమర్థంగా ఈ మత రాజకీయాలను ప్రతిపక్షాలు ఎదుర్కొంటాయో చూడాలి.
Read Also : Director Sukumar Birthday Special : లెక్కల మాస్టారు..లెక్క తప్పేదెలా..
Tags
Related News
TS : కాంగ్రెస్లో బీఆర్ఎస్ విలీనం ఖాయం..లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు
Lakshman: బీజేపీ(BJP) రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ కాంగ్రెస్(Congress), బీఆర్ఎస్(BRS)పై విమర్శలు గుప్పించారు. రాబోయే రోజులో బీఆర్ఎస్ కాంగ్రెస్లో విలీనం కావడం ఖాయం అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అన్ని పార్టీల కంటే ఎక్కువ సీట్లు బీజేపీ గెలుస్తుందన్నారు. .ప్రజలు మోడీ(Modi)ని గెలిపించాలన పట్టుదలతో పార్టీలను కాదని మోడీ వైపు మొగ్గుచూపారన్నారు. We’re now on WhatsApp. Click to Join. కాంగ్రెస్ కి ప్రతిపక్ష హోదా దక్క�