హోర్ముజ్ జలసంధి నుండి బయటపడిన భారత నౌక!
గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న అస్థిర పరిస్థితుల దృష్ట్యా భారత ప్రభుత్వం, సముద్రయాన అధికారులు హై అలర్ట్గా ఉన్నారు.
- Author : Gopi
Date : 19-04-2026 - 10:30 IST
Published By : Hashtagu Telugu Desk
Strait Of Hormuz: గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ సముద్ర మార్గం నుండి ఒక కీలక వార్త వెలుగులోకి వచ్చింది. హోర్ముజ్ జలసంధిలో ఇరాన్ సైన్యం రెండు నౌకలపై కాల్పులు జరుపుతున్న అత్యంత ప్రమాదకర సమయంలో భారత ముడి చమురు ట్యాంకర్ ‘దేశ్ గరిమ’ సురక్షితంగా ఆ మార్గాన్ని దాటగలిగింది. ఈ నౌకలో 31 మంది భారతీయ సిబ్బంది ఉన్నారు. వీరందరూ సురక్షితంగా ఉన్నట్లు సమాచారం.
పెట్రోలియం- సహజ వాయువు మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఏప్రిల్ 18న ఇరాన్ సైన్యం ఈ సముద్ర మార్గంలో దిగ్బంధం విధించిన సమయంలోనే ‘దేశ్ గరిమ’ అక్కడి నుండి ప్రయాణించింది. ఎటువంటి నష్టం వాటిల్లకుండా ఈ నౌక తన ప్రయాణాన్ని పూర్తి చేసిందని, ఏప్రిల్ 22 నాటికి ఇది ముంబై చేరుకునే అవకాశం ఉందని మంత్రిత్వ శాఖ ధృవీకరించింది.
Also Read: సీజ్ఫైర్పై నీలినీడలు?
మరో రెండు భారతీయ నౌకలపై దాడి
అయితే అదే రోజు పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఇరాన్ సైన్యం మరో రెండు నౌకలైన — ’VLCC సమనార్ హెరాద్’, కార్గో నౌక ’జగ్ అర్నవ్’లపై కాల్పులు జరిపింది. ఈ దాడి నేపథ్యంలో ఆ రెండు నౌకలు వెనక్కి మళ్లి పర్షియన్ గల్ఫ్ వైపు వెళ్లాల్సి వచ్చింది. ఊరట కలిగించే విషయం ఏమిటంటే.. ఈ నౌకల్లోని సిబ్బందిలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. అందరూ సురక్షితంగా ఉన్నారు.
ప్రభుత్వ నిఘా
గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న అస్థిర పరిస్థితుల దృష్ట్యా భారత ప్రభుత్వం, సముద్రయాన అధికారులు హై అలర్ట్గా ఉన్నారు. భారతీయ నావికుల భద్రతను పర్యవేక్షించడానికి, నౌకల ప్రయాణానికి ఎటువంటి ఆటంకాలు కలగకుండా చూడటానికి అధికారులు నిరంతరం సమన్వయం చేసుకుంటున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రస్తుతం భారత పౌరులను, వాణిజ్య ప్రయోజనాలను కాపాడటమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా ఉంది.