Urine On Bus Passenger: మహిళ ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన.. ఈసారి విమానంలో కాదు.. బస్సులో..!
ఇటీవల విమానంలో ఓ వ్యక్తి మూత్ర విసర్జన సంఘటన మరువకముందే మరో చోట ఇలాంటి సంఘటనే జరిగింది. కాకపోతే అది విమానంలో కాదు.. ఆర్టీసీ బస్సులో జరగడం గమనార్హం. మహిళా ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన (Peeing)కు పాల్పడిన వ్యక్తి ఇంజనీర్ కావడం విశేషం.
- Author : Gopi
Date : 23-02-2023 - 9:27 IST
Published By : Hashtagu Telugu Desk
ఇటీవల విమానంలో ఓ వ్యక్తి మూత్ర విసర్జన సంఘటన మరువకముందే మరో చోట ఇలాంటి సంఘటనే జరిగింది. కాకపోతే అది విమానంలో కాదు.. ఆర్టీసీ బస్సులో జరగడం గమనార్హం. మహిళా ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన (Peeing)కు పాల్పడిన వ్యక్తి ఇంజనీర్ కావడం విశేషం. ఆ విద్యార్థిని తోటి ప్రయాణికులు దేహశుద్ధి చేసి బస్సులో నుంచి నెట్టివేసిన సంఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. విజయపుర నుంచి మంగళూరుకు వెళ్తున్న కేఎస్ఆర్టీసీ బస్సును ఇంజనీరింగ్ విద్యార్థి రామప్ప (25) ఎక్కాడు. అయితే అప్పటికే అతడు మద్యం మత్తులో ఉన్నాడు.
ఆ బస్సు హుబ్బళి సమీపంలోని కిరేసూరులోని ఓ దాబా వద్ద మంగళవారం అర్ధరాత్రి కొద్దిసేపు ఆగింది. ప్రయాణికుల్లో కొందరు కాలకృత్యాలు తీర్చుకునేందుకు కిందకు దిగారు. టీ తాగేందుకు కొందరు కిందకు దిగగా.. మరికొందరు బస్సులోనే నిద్రిస్తున్నారు. 28వ సీటులో నుంచి నిద్రలేచిన రామప్ప కిందకు దిగకుండా ముందు వరుసలో నిద్రిస్తున్న మహిళా ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేశాడు. మేలుకున్న ఆమె కేకలు వేసింది. అతడి దుశ్చర్యకు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏం జరిగిందోనని తోటి ప్రయాణికులు, బస్సు డ్రైవర్ లోపలకి చేరుకున్నారు.
Also Read: Belagavi Express: బెలగావి ఎక్స్ప్రెస్కు బాంబు బెదిరింపు.. క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులు
ఆ దుండగుడి చర్యపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ దాడికి పాల్పడ్డారు. అతడి సామగ్రిని ఇచ్చేసి అతడిని బస్సు నుంచి దింపేశారు. అయితే ఈ సంఘటనపై మహిళా ప్రయాణికురాలు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రాలేదు. ఆమె వినతి మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదని కండక్టర్ తెలిపాడు. ఈ చర్యకు పాల్పడిన వ్యక్తి వివరాలు తెలుసుకుని అతడిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది.