Odisha: ఒడిశాలో నిత్యపెళ్లికొడుకు.. ఏడు రాష్ట్రాల్లో 14 మంది మహిళలతో!
ఒడిశాలో ఓ నిత్యపెళ్లికొడుకు భాగోతం బయటపడింది. ఏడు రాష్ట్రాల్లో 14 మంది మహిళలను పెళ్లి చేసుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ వ్యక్తిని సోమవారం భువనేశ్వర్లో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
- By Balu J Published Date - 11:41 AM, Tue - 15 February 22

ఒడిశాలో ఓ నిత్యపెళ్లికొడుకు భాగోతం బయటపడింది. ఏడు రాష్ట్రాల్లో 14 మంది మహిళలను పెళ్లి చేసుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ వ్యక్తిని సోమవారం భువనేశ్వర్లో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఒడిశాలోని కేంద్రపారా జిల్లాలోని పట్కురా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామానికి చెందిన వ్యక్తి పారిపోయే ముందు ఈ మహిళల నుండి డబ్బు తీసుకున్నట్లు కూడా ఆరోపణలు వచ్చాయి. అయితే అరెస్టయిన వ్యక్తి ఈ ఆరోపణలను ఖండించాడు. నిందితుడు 1982లో మొదటిసారి పెళ్లి చేసుకున్నాడని, 2002లో రెండో భార్యను తీసుకున్నాడని.. ఈ రెండు పెళ్లిళ్లలో ఐదుగురు పిల్లలకు తండ్రయ్యాడని భువనేశ్వర్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఉమాశంకర్ దాష్ తెలిపారు. 2002 నుంచి 2020 మధ్య, అతను మ్యాట్రిమోనియల్ వెబ్సైట్ల ద్వారా ఇతర మహిళలతో స్నేహం చేసాడని.. ఒకరికి తెలియకుండా మరొకరిని వివాహం చేసుకున్నాడని ఆయన తెలిపారు.
ఆ వ్యక్తి ఢిల్లీలో స్కూల్ టీచర్గా పనిచేస్తున్న తన చివరి భార్యతో ఒడిశా రాజధానిలో ఉంటున్నాడు. అతడికి ఇంతకుముందు వివాహాలు జరిగినట్లు తెలుసుకుని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతను ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకున్నాడని. వారిని మభ్యపెట్టి పెళ్లి చేసుకునేవాడని పోలీస్ అధికారి తెలిపారు. ఆ తరువాత అతను వారిని విడిచిపెట్టే ముందు వారి వద్ద నుంచి డబ్బును డిమాండ్ చేసేవాడని తెలిపారు. . అతను తనను తాను డాక్టర్గా గుర్తించుకుని.. న్యాయవాదులు, వైద్యులు, ఉన్నత విద్యావంతులైన మహిళలను వివాహం చేసుకున్నాడు. ఆమె బాధితుల్లో పారా మిలటరీ దళంలో పనిచేస్తున్న మహిళ కూడా ఉందని పోలీసులు తెలిపారు. ఢిల్లీ, పంజాబ్, అస్సాం, జార్ఖండ్, ఒడిశా సహా ఏడు రాష్ట్రాల్లో మహిళలను మోసం చేశాడు. అతని మొదటి ఇద్దరు భార్యలు ఒడిశాకు చెందినవారని పోలీసుల విచారణలో తేలింది.
నిందితుడు తనను 2018లో న్యూఢిల్లీలో పెళ్లి చేసుకుని భువనేశ్వర్కు తీసుకెళ్లారని గతేడాది జూలైలో పాఠశాల ఉపాధ్యాయురాలు మహిళా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చిందని డీసీపీ తెలిపారు. అతడి వివాహాల భాగోతం గురించి తెలుసుకున్న పోలీసులు ఆమె ఫిర్యాదు మేరకు అతడిని అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి 11 ఏటీఎం కార్డులు, నాలుగు ఆధార్ కార్డులు, ఇతర పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ఈ నిందితుడు హైదరాబాద్, ఎర్నాకులంలో నిరుద్యోగ యువకులను మోసం చేయడం, రుణం మోసం చేయడం వంటి నేరాలకు సంబంధించి గతంలో రెండుసార్లు అరెస్టయ్యాడని పోలీసులు తెలిపారు.