Ketan Agarwal: పూణే హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. అది నచ్చక సియా అగర్వాల్ చంపేసిందట
- Author : Vamsi Chowdary Korata
Date : 27-06-2026 - 10:28 IST
Published By : Hashtagu Telugu Desk
రియల్టర్ కేతన్ అగర్వాల్ హత్య కేసు విచారణలో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న సియా గోయల్, చేతన్ చౌదరి మధ్య కేవలం సాధారణ పరిచయమే కాకుండా చాలా లోతైన వ్యక్తిగత సంబంధం ఉందని పోలీసులు గుర్తించారు. వీరిద్దరి మధ్య గత కొన్ని నెలల్లో వేలసార్లు ఫోన్ కాల్స్ జరగడం, హత్యకు ముందు రోజు ప్రత్యేకంగా సమావేశం కావడం వంటి అంశాలు ఇప్పుడు దర్యాప్తును కొత్త కోణంలోకి తీసుకెళుతున్నాయి.
క్రికెట్ ద్వారా పరిచయం.. దీపావళి పార్టీతో బలపడిన బంధం
పోలీసుల కథనం ప్రకారం.. నిందితుడు చేతన్ చౌదరి, సియా గోయల్ అన్న సాహిల్ గోయల్కు క్రికెట్ ద్వారా మిత్రుడు. సాహిల్తో కలిసి చేతన్ క్రికెట్ మ్యాచ్లు ఆడేవాడు. ఆ సమయంలో సియా తరచుగా తన సోదరుడితో పాటు మ్యాచ్లకు వెళ్లేది. అప్పుడే వారిద్దరి మధ్య తొలి పరిచయం ఏర్పడిందని పోలీసులు భావిస్తున్నారు. ఆ తర్వాత 2024 దీపావళి సందర్భంగా ఒక కామన్ ఫ్రెండ్ ఇచ్చిన పార్టీలో వీరిద్దరూ మళ్లీ కలుసుకున్నారు. అప్పటి నుంచి వీరి మధ్య సంభాషణలు, రాకపోకలు బాగా పెరిగాయి.
విచారణలో భాగంగా పరిశీలించిన కాల్ డేటా రికార్డులు (సీడీఆర్) విస్తుపోయే నిజాలను బయటపెట్టాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు సియా, చేతన్ మధ్య ఏకంగా 2,004 ఫోన్ కాల్స్ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కాల్స్ మొత్తం వ్యవధి దాదాపు 238 గంటలు ఉండటం వారి మధ్య ఉన్న బలమైన సంబంధాన్ని సూచిస్తోంది. ఈ నేపథ్యంలోనే నిన్న సియా సోదరుడు సాహిల్ గోయల్ను పోలీసులు దాదాపు 10 గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు. అనంతరం అతడిని ఇంటికి పంపించారు. “సాహిల్కు చేతన్ తెలుసు కాబట్టి, కొన్ని విషయాలను అతనితో క్రాస్-చెక్ చేశాం” అని ఒక పోలీసు అధికారి పీటీఐకి తెలిపారు. సియా కుటుంబంలోని ఇతర సభ్యుల వాంగ్మూలాలను కూడా నమోదు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.
డిజిటల్ ఆధారాల ధ్వంసం.. ఫోరెన్సిక్ విశ్లేషణ
ఈ కేసులో డిజిటల్ ఆధారాలు అత్యంత కీలకంగా మారాయి. నిందితులిద్దరూ తమ ఫోన్లలోని వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ చాట్లతో పాటు ఇతర ఆన్లైన్ కార్యకలాపాలకు సంబంధించిన డేటాను ఉద్దేశపూర్వకంగా డిలీట్ చేసినట్లు పోలీసులు కనుగొన్నారు. లోహగఢ్ సంఘటనకు ముందు, ఆ తర్వాత కూడా ఈ సంభాషణలను తొలగించారని అధికారులు అనుమానిస్తున్నారు. కేవలం మెసేజ్లు డిలీట్ చేయడమే కాకుండా, రీసైకిల్ బిన్లను కూడా ఖాళీ చేయడంతో, డిలీట్ అయిన డేటాను రికవరీ చేసేందుకు ఫోరెన్సిక్ నిపుణుల సహాయం తీసుకుంటున్నారు.
హత్యకు ముందు రోజు కేఫేలో భేటీ
దర్యాప్తులో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. కేతన్ అగర్వాల్ హత్య జరగడానికి ఒక రోజు ముందు, అంటే జూన్ 17న, సియా, చేతన్ పూణెలోని లుల్లానగర్ ప్రాంతంలో ఉన్న ఒక కేఫేలో సమావేశమైనట్లు పోలీసులు గుర్తించారు. సాయంత్రం 4:30 గంటల నుంచి 5:30 గంటల వరకు దాదాపు గంట పాటు వీరిద్దరూ అక్కడే గడిపారు. ఈ సమావేశంలోనే హత్యకు సంబంధించిన కుట్ర జరిగిందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ భేటీ వివరాలు, డిజిటల్ ఆధారాల విశ్లేషణతో కేసులో మరిన్ని నిజాలు బయటపడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.