Varanasi Lok Sabha : ప్రధాని మోడీపై పోటీ.. 25వేల ఒక రూపాయి నాణేలతో నామినేషన్
ఆయన దగ్గర ఆస్తిపాస్తులు లేవు. కానీ చిల్లర బాగా ఉంది.
- Author : Pasha
Date : 16-05-2024 - 1:07 IST
Published By : Hashtagu Telugu Desk
Varanasi Lok Sabha : ఆయన దగ్గర ఆస్తిపాస్తులు లేవు. కానీ చిల్లర బాగా ఉంది. ఆ చిల్లర నాణేలతో ఏకంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీపై ఎన్నికల్లో పోటీకి రెడీ అయ్యారు. 25వేల 1 రూపాయి నాణేలను తీసుకొని వెళ్లి ఉత్తరప్రదేశ్లోని వారణాసి లోక్సభ స్థానంలో(Varanasi Lok Sabha) నామినేషన్ దాఖలు చేశారు. ఇంత చొరవ చూపి ఎన్నికల్లో పోటీకి సన్నద్ధమైన ఆ సామాన్యుడి పేరే రామ్కుమార్ వైద్య. వాస్తవానికి ఈయనది మధ్యప్రదేశ్లోని దతియా జిల్లా ఇందర్ఘడ్. రామ్కుమార్ వైద్య చిన్నపాటి కిరాణా దుకాణాన్ని నడుపుకుంటూ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఆయన చురాన్ బుదియా అమ్ముతూ వేలల్లో నాణేలను పోగేసి.. దాదాపు 550 కిలోమీటర్లు ప్రయాణించి వారణాసికి చేరుకున్నారు. మొత్తం రూ.25వేలు ఉన్న 1 రూపాయి నాణేలను ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు ఇచ్చి నామినేషన్ పత్రాలను రామ్కుమార్ వైద్య కొనుగోలు చేశారు.
We’re now on WhatsApp. Click to Join
రామ్కుమార్ వైద్య తీసుకెళ్లిన 1 రూపాయి నాణేల సంచులను చూసి వారణాసి ఎన్నికల రిటర్నింగ్ అధికారులు ఆశ్చర్యపోయారు. వారణాసికి చెందిన కొందరు ఆటోడ్రైవర్లు రామ్కుమార్ నామినేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. ఆయన ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే తొలిసారేం కాదు. ఇప్పటికే కౌన్సిలర్ నుంచి ఎమ్మెల్యే దాకా పలు ఎన్నికల్లో రామ్కుమార్ పోటీ చేశారు. ఈసారి ఏకంగా వారణాసి నుంచి ప్రధాని మోడీపై పోటీకి నామినేషన్ దాఖలు చేసి రామ్కుమార్ అందరినీ ఆశ్చర్యపరిచారు.
Also Read : Phase 5 Polling : మే 20న ఐదో విడత పోలింగ్.. కీలక అభ్యర్థులు, స్థానాలివే
వారణాసి ప్రజల సమస్యలను పార్లమెంటులో లేవనెత్తే లక్ష్యంతోనే తాను ప్రధాని మోడీపై పోటీకి నామినేషన్ దాఖలు చేశానని రామ్కుమార్ తెలిపారు. ఒకవేళ పోటీచేసే అవకాశం లభిస్తే.. ప్రజల్లో ముమ్మరంగా ప్రచారం చేయాలని ఆయన భావించారు. కానీ ఆయన నామినేషన్ బుధవారం రోజు తిరస్కరణకు గురైంది. ప్రముఖ కమేడియన్ శ్యామ్ రంగీలా నామినేషన్ను కూడా ఎన్నికల రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. దీంతో వారణాసిలో ప్రధాని మోడీపై పోటీకి కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్ సహా మొత్తం ఆరుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు.