Terrorist Attack : పెళ్ళైన ఆరు రోజులకే నేవీ ఆఫీసర్ మృతి
Terrorist Attack : ఈ ఘటనలో మరణించినవారిలో 26 ఏళ్ల నేవీ ఆఫీసర్ వినయ్ నర్వాల్ (Lieutenant Vinay Narwal Navy Officer) పేరు అందరినీ కదిలిస్తోంది
- Author : Sudheer
Date : 23-04-2025 - 11:54 IST
Published By : Hashtagu Telugu Desk
జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడి దేశాన్ని ఊపేసింది. ఈ హృదయవిదారక ఘటనలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన వారిలో చాలామంది పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనలో మరణించినవారిలో 26 ఏళ్ల నేవీ ఆఫీసర్ వినయ్ నర్వాల్ (Lieutenant Vinay Narwal Navy Officer) పేరు అందరినీ కదిలిస్తోంది. సరిగ్గా ఆరు రోజుల క్రితమే వివాహం చేసుకున్న ఆయన, పాతికేళ్ల వయస్సులోనే ఉగ్రదాడికి బలైపోవడం తీవ్ర విషాదానికి దారితీసింది.
Rajasthan Match Fixing: ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్పై ఫిక్సింగ్ ఆరోపణలు.. అసలు నిజం ఇదే!
వినయ్ నర్వాల్ కేరళలోని కొచ్చి నేవీ బేస్లో లెఫ్టినెంట్గా పనిచేస్తున్నారు. ఆయన వివాహం ఏప్రిల్ 16న జరిగినా, రిసెప్షన్ మాత్రం ఏప్రిల్ 19న నిర్వహించారు. పెళ్లి వేడుకలు ముగిసిన తర్వాత చిన్న టూర్ కోసం వినయ్ తన స్నేహితులతో కలిసి పహల్గామ్కు వెళ్లారు. అనుకోకుండా వచ్చిన ఉగ్రదాడిలో ముష్కరుల కాల్పులకు గురై ప్రాణాలు కోల్పోయారు. పెళ్లైన ఆరు రోజుల్లోనే మృత్యువును ఎదుర్కోవడం ఆయన కుటుంబాన్ని తీవ్ర శోకంలో ముంచెత్తింది.
పహల్గామ్ లోని బైసరన్ లోయలో ట్రెక్కింగ్ కోసం వెళ్లిన పర్యాటకులపై టెర్రరిస్టులు నిర్దాక్షిణ్యంగా దాడి చేశారు. వారి ఐడీలు చెక్ చేసి, పేర్లు, గుర్తింపు అడిగి, ఓ వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని తుపాకీలతో కాల్పులు జరిపారు. ఈ దాడి పక్కా ప్లాన్తో జరిగిందని, ఏ ఒక్కరూ తప్పించుకోలేకపోయారన్న భావన స్థానికులను, దేశ ప్రజలను కలచివేస్తోంది. వినయ్ నర్వాల్ మరణం ఎంతో మందికి కన్నీటి పర్యంతం చేసింది. భారత సాయుధ దళాల్లో పని చేస్తున్న యౌవనానికి ఇది పెద్ద కోలుకోలేని లోటుగా మారింది.