Lawrence Bishnoi : జైలులో లారెన్స్ బిష్ణోయ్.. సంవత్సరానికి రూ.40 లక్షల ఖర్చులు
జైలు బ్యారక్లలోకి అక్రమంగా వచ్చే సెల్ఫోన్ల ద్వారా లారెన్స్ బిష్ణోయ్(Lawrence Bishnoi) అనుచరులతో నిత్యం టచ్లో ఉంటాడని చెబుతుంటారు.
- Author : Pasha
Date : 20-10-2024 - 12:48 IST
Published By : Hashtagu Telugu Desk
Lawrence Bishnoi : మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్య జరిగినప్పటి నుంచి దేశమంతటా గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గురించే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం అతగాడు గుజరాత్లోని సబర్మతీ జైలులో ఉన్నాడు. జైలులోనే ఉన్నా.. లారెన్స్ అవసరాల కోసం సంవత్సరానికి రూ.40 లక్షలకుపైనే ఖర్చు చేస్తున్నారట. ఈవిషయాన్ని స్వయంగా లారెన్స్ బిష్ణోయ్ బంధువు 50 ఏళ్ల రమేష్ బిష్ణోయ్ మీడియాకు వెల్లడించాడు. పంజాబ్ యూనివర్సిటీలో లా చేసిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్స్టర్ అవుతాడని తాను కలలో కూడా ఊహించలేదన్నాడు. లారెన్స్ వాళ్లది చాలా సంపన్న కుటుంబమని రమేష్ బిష్ణోయ్ చెప్పారు. వారికి సొంతూరిలో (పంజాబ్లోని ధత్తరన్వాలీ) 110 ఎకరాల భూమి ఉండేదన్నారు. లారెన్స్ తండ్రి హర్యానాలో పోలీసు కానిస్టేబుల్గా పని చేసేవాడని తెలిపారు. లారెన్స్ మొదటి నుంచీ లగ్జరీ లైఫ్ గడిపేవాడని.. దుస్తుల దగ్గరి నుంచి కాస్మొటిక్స్ దాకా అన్నీ టాప్ క్లాస్వి వినియోగించే వాడని రమేష్ బిష్ణోయ్ పేర్కొన్నారు. లారెన్స్ బిష్ణోయ్ అసలు పేరు బాల్కరణ్ బ్రార్ అని.. స్కూల్ డేస్లోనే పేరును మార్చుకున్నాడన్నారు.
Also Read :Delhi Explosion : ఢిల్లీలో భారీ పేలుడు.. రంగంలోకి ఫోరెన్సిక్ టీమ్
జైలు బ్యారక్లలోకి అక్రమంగా వచ్చే సెల్ఫోన్ల ద్వారా లారెన్స్ బిష్ణోయ్(Lawrence Bishnoi) అనుచరులతో నిత్యం టచ్లో ఉంటాడని చెబుతుంటారు. లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు, అనుచరుడు కెనడా నుంచి గ్యాంగ్ను నడిపిస్తుంటారనే ప్రచారం ఉంది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో లారెన్స్ గ్యాంగ్కు దాదాపు 700 మంది షూటర్లు ఉన్నారని అంటారు. సిద్ధూ మూసేవాలా, బాబా సిద్ధిఖీపై దాడులు లారెన్స్ గ్యాంగ్ షూటర్ల పనే అని చెబుతారు. సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు కూడా ఈ ముఠా పనే అని ప్రచారం జరుగుతోంది. 2018లో తన అనుచరుడు సంపత్ నెహ్రాతో కలిసి సినీ స్టార్ సల్మాన్ఖాన్ హత్యకు కుట్రపన్నడంతో లారెన్స్ ముఠా జాతీయ స్థాయిలో వార్తలకు ఎక్కింది.