Kawad Yatra : కావడి యాత్ర..యూపీ, ఉత్తరాఖండ్ ప్రభుత్వ ఆదేశాలపై సుప్రీం స్టే
దుకాణాలపై దుకాణదారులు పేర్లు, గుర్తింపులను వెల్లడించాల్సిన అవసరం లేదని కోర్టు పేర్కొంది.
- By Latha Suma Published Date - 03:42 PM, Mon - 22 July 24

Kawad Yatra: నేడు సుప్రీంకోర్టు(Supreme Court)లో కవాడి యాత్ర- నేమ్ ప్లేట్ వివాదం కేసు(Name plate dispute case)లో విచారణ జరిగింది. ఈ కేసులో ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) సహ మరో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయంపై కోర్టు మధ్యంతర స్టే విధించింది. దుకాణాలపై దుకాణదారులు పేర్లు, గుర్తింపులను వెల్లడించాల్సిన అవసరం లేదని కోర్టు పేర్కొంది. హోటళ్ల నిర్వాహకులు నేమ్ ప్లేట్లు ప్రదర్శించాలనే నిబంధనపై స్టే విధించిన సుప్రీంకోర్టు.. యాజమానులు, విక్రయదారుల పేర్లను వెల్లడించమని బలవంతం చేయొద్దని ప్రభుత్వాలకు కోర్టు సూచించింది.
We’re now on WhatsApp. Click to Join.
మరోవైపు పిటిషనర్లు తమ వాదనలు వినిపిస్తూ.. మనం ఎక్కడైనా బయట భోజనం చేయడానికి వెళితే.. ఏం తినాలనుకుంటున్నామో దానికి సంబంధించిన వివరాలనే కోరుకుంటామని, ఎవరు మనకు వడ్డిస్తున్నారో తెలుసుకోవాలని ఎవరూ అనుకోరని తెలిపారు. వ్యక్తుల గుర్తింపును బట్టి వారిని దూరం పెట్టే ఉద్దేశంతోనే ఈ ఆదేశాలు ఇచ్చినట్టు స్పష్టమవుతోందని పిటిషనర్లు కోర్టుకు వివరించారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్ల తరఫున వాదనలు వినిపించి సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ స్పష్టం చేశారు. ఇలాంటి ఆదేశాలకు చట్టబద్ధత ఉండదని, ఇటువంటి ఆదేశాలు జారీ చేయాలని ఏ చట్టం చెబుతోందని మరో న్యాయవాది ప్రశ్నించారు. ఇరువైపులా వాదనలు విన్న సుప్రీంకోర్టు ..ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలు ఇచ్చిన ఆదేశాలపై స్టే విధించింది. ఎక్కడైనా గానీ హోటళ్ల వద్ద ఆహార పదార్థాల వివరాలను మాత్రమే ప్రదర్శిస్తారని, యజమానుల పేర్లు కూడా ప్రదర్శించాల్సిన అవసరం ఏముందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అనంతరం తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.
కాగా, ప్రతి ఏడాది శివ భక్తులు పవిత్ర గంగా నదీ జలాలను కావిళ్లపై మోసుకంటూ స్వస్థలాలకు తీసుకెళుతుంటారు. ఈ కావడి యాత్రను శ్రావణ మాసంలో చేపడుతుంటారు. అయితే ఈ కవాడి యాత్ర సాగే మార్గంలో రోడ్డు పక్కన ఉండే హోటళ్లు, ధాబాలు, తోపుడు బళ్ల ముందు వాటి యజమానుల పేర్లు, వ్యక్తిగత వివరాలతో కూడిన బోర్డులను ఏర్పాటు చేయాలంటూ యూపీ, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి.