Bomb Threat : రైల్వే స్టేషన్లకు ‘ఉగ్ర’ వార్నింగ్.. బాంబుదాడులు చేస్తామంటూ జైషే మహ్మద్ లేఖ
జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ జమ్మూకశ్మీర్ ఏరియా కమాండర్ మహ్మద్ సలీం అన్సారీ(Bomb Threat) పేరుతో ఈ లేఖ వచ్చినట్లు గుర్తించారు.
- Author : Pasha
Date : 02-10-2024 - 1:28 IST
Published By : Hashtagu Telugu Desk
Bomb Threat : జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ పేరుతో గుర్తుతెలియని వ్యక్తి పంపిన లేఖ కలకలం రేపింది. ఈ లేఖ రాజస్థాన్లోని హనుమాన్ ఘర్ జంక్షన్లోని స్టేషన్ సూపరింటెండెంట్కు అందింది. రాష్ట్రంలోని శ్రీ గంగానగర్, హనుమాన్ ఘర్, బికనీర్, జోధ్పూర్, కోట, బుందీ, ఉదయర్పూర్, జైపూర్ సహా పలు స్టేషన్లలో ఈనెల 30న బాంబు దాడులు చేస్తామని ఆ లేఖలో వార్నింగ్ ఇచ్చారు. జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ జమ్మూకశ్మీర్ ఏరియా కమాండర్ మహ్మద్ సలీం అన్సారీ(Bomb Threat) పేరుతో ఈ లేఖ వచ్చినట్లు గుర్తించారు. జమ్మూకశ్మీరులో జిహాదీల మరణాలకు ప్రతీకారంగా ఈ దాడులు చేయబోతున్నట్లు అతడు లేఖలో ప్రస్తావించాడు. ఎల్లో కలర్ ఎన్వలప్లో ఈ లేఖ ఉందని పోలీసులు తెలిపారు.
Also Read :Mahatma Gandhi : తెలంగాణలో అమానవీయ పాలనపై ప్రస్తుత గాంధీలు స్పందించాలి : కేటీఆర్
ఈ లేఖ అందిన నేపథ్యంలో ఆయా రైల్వే స్టేషన్లలో బీఎస్ఎఫ్, జీఆర్పీ, ఆర్పీఎఫ్ బలగాలను పెద్దసంఖ్యలో మోహరించారు. ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. అయితే అనుమానాస్పద వస్తువులే లభించలేదు. రైళ్లలోనూ తనిఖీలను ముమ్మరం చేశారు. ఆయా స్టేషన్ల పరిధిలోని రైల్వే ట్రాక్లను కూడా నిశితంగా పరిశీలిస్తున్నారు. దీనిపై విచారణ ప్రారంభించిన హనుమాన్ ఘర్ జంక్షన్ ఏరియా జీఆర్పీ పోలీసులు ఓ వ్యక్తిపై కేసు నమోదు చేశారు.
Also Read :Israel Vs Iran : ప్రతీకారం కోసం రగిలిపోతున్న ఇజ్రాయెల్.. ఇరాన్లో ఏమేం చేయబోతోంది ?
కాగా, మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని మహంకాళి ఆలయంపైనా బాంబు దాడులు చేస్తామని ఈ లేఖలో ఉగ్రవాదులు ప్రస్తావించినట్లు తెలిసింది. దీంతో మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి కూడా సమాచారాన్ని చేరవేశారు.ఈనేపథ్యంలో ఉజ్జయిని మహంకాళి ఆలయం వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సాధారణంగా ప్రతి రోజూ ఈ ఆలయాన్ని భద్రతా సిబ్బంది తనిఖీ చేస్తుంటారు. అయితే ఈ హెచ్చరిక నేపథ్యంలో మరింత ఎక్కువ సంఖ్యలో భద్రతా సిబ్బందిని అక్కడ మోహరించారు.