UP Elections 2022 : ఓవైసీ రూపంలో యూపీలో బీహార్ ఈక్వేషన్
బీహార్ తరహా ఫలితాలను ఉత్తప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఉంటాయని కొందరు అంచనా వేస్తున్నారు.
- By CS Rao Published Date - 04:51 PM, Mon - 7 February 22
బీహార్ తరహా ఫలితాలను ఉత్తప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో (UP Elections 2022 ) ఉంటాయని కొందరు అంచనా వేస్తున్నారు. యోగి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ఓటు బ్యాంకును భారీగా ఎంఐఎం, బీఎస్పీ చీల్చుకునే అవకాశం ఉందని క్షేత్రస్థాయి పరిశీలకుల భావన. పైగా ఏఐఎంఐఎం చీఫ్ అసరుద్దీన్ ఓవైసీ పై జరిగిన హత్యాయత్నం రాజకీయ కోణాన్ని సంతరించుకుంది. పలు నియోజకవర్గాల్లో ముస్లిం ఓటు బ్యాంకు అధికంగా యూపీలో ఉంది. ఆ నియెజకవర్గాల్లో ఎంఐఎం ప్రభావం ఎక్కువగా ఉండే ఛాన్స్ లేకపోలేదు. బీహార్ లో కూడా ఎంఐఎం ముస్లిం ఓట్లను భారీగా చీల్చడం ద్వారా ఆర్జేడీ భారీగా నష్టపోయింది. ఫలితంగా బీజేపీ, జేడీయూ కూటమి అధికారంలోకి వచ్చింది.బీహార్, యూపీ రాష్ట్రాలు 1937లో బ్రిటీష్ ఇండియా (British India) ఆధీనంలో ఉండేవి. ఆ తరువాత రెండింటిలోనూ మొదటి ముఖ్యమంత్రిగా ఒక ముస్లిం ఉన్నాడని చరిత్ర చెబుతోంది. స్వాతంత్ర్యం వచ్చిన తొలి రోజుల్లో బీహార్, యూపీల్లో కాంగ్రెస్ ఆధిపత్యం ఉండేది. తొలిసారిగా 1967లో మొదటిసారిగా కాంగ్రెసేతర ప్రభుత్వంగా ఏర్పడ్డాయి. అయితే, ఆ ప్రభుత్వాలు రెండు రాష్ట్రాల్లోనూ స్వల్పకాలం మాత్రమే కొనసాగాయి. అనతికాలంలోనే తిరిగి కాంగ్రెస్ ఆధిపత్యాన్ని తిరిగి పొందింది. 1977లో బీహార్, యూపీల్లో జనతా ఉద్యమం వచ్చింది. కానీ, కాంగ్రెస్ మళ్లీ పుంజుకుంది. మరో జనతా ఉద్యమం రూపంలో వచ్చిన లాలూ ప్రసాద్ (Lalu Prasad Yadav) ముఖ్యమంత్రిగా 1989లో అయ్యాడు. దీంతో ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ కథ ముగిసింది. ఆ మరుసటి ఏడాది సమాజ్వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ యూపీ సీఎం పీఠాన్ని అధిష్టించాడు.
రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ బలంగా ఆనాడు ఉన్నప్పటికీ ఇటీవల బిజెపి ఎదుగుదల ఆ పార్టీ ఉనికికే ప్రమాదం ఏర్పడింది. అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) 2015 అసెంబ్లీ ఎన్నికల నుంచి బీహార్ ఓటర్లను ప్రభావితం చేయడం ప్రారంభించాడు. ఫలితంగా రాష్ట్రీయ జనతాదళ్-కాంగ్రెస్-లెఫ్ట్ కూటమి నష్టపోవడంతో బీజేపీ బలపడింది. ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాద్-ఉల్-ముస్లిమీన్ (AIMIM) బీహార్లో ఉప ఎన్నికలో విజయం సాధించింది. 2020 బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో పశ్చిమ బెంగాల్ సరిహద్దులో ఉన్న సీమాంచల్ అని పిలువబడే తూర్పు బీహార్లో (East Bihar) గణనీయమైన మార్పుకు కారణం అయింది. ఆ ప్రాంతంలోని మెజారిటీ ముస్లిం జనాభా ఉన్న జిల్లాల పరిధిలోని నియోజకవర్గాలపై ఒవైసీ దృష్టి సారించాడు. వీటిలో దాదాపు 70 శాతం ముస్లిం ఓటర్లు ఉన్న కిషన్గంజ్లోని నియోజకవర్గాలు, అరారియా 45 శాతం, కతిహార్ 40 శాతం మరియు పూర్నియా 30 శాతం ఉన్నాయి.సీమాంచల్లోని 24 అసెంబ్లీ స్థానాల్లో ఒవైసీ పార్టీ 14 స్థానాల్లో పోటీ చేసి ఐదు స్థానాల్లో విజయం సాధించింది. అక్కడే బిజెపి-జెడియు(BJP-JDU) కూటమి వర్సెస్ ఆర్జెడి నేతృత్వంలోని సంకీర్ణం మధ్య గట్టి పోటీ జరిగింది. ఆ ఎన్నికల్లో ఆర్జేడీకి అప్పటి వరకు ఉన్న ముస్లిం మద్థతును ఓవైసీ కొల్లగొట్టాడు. ఫలితంగా బిజెపి-జెడియుకు స్వల్ప తేడాతో మెజారిటీ సాధించి గెలుపొందడం జరిగింది. ఇలాంటి భయమే ఇప్పుడు ఉత్తరప్రదేశ్లోని విపక్ష కూటమిలను వెంటాడుతోంది. అందుకే, బీజేపీకి బీ టీమ్ గా ఒవైసీ ఫోకస్ చేస్తూ సమాజ్వాదీ పార్టీ , కాంగ్రెస్ హైలెట్ చేస్తున్నారు. గత ఎన్నికల్లో యూపీ నుంచి AIMIM 2017 లో 38 స్థానాల్లో పోటీ చేసి అరంగేట్రం చేసింది. ఎక్కడ విజయం సాధించకపోయినప్పటికీ గెలిచిన అభ్యర్థికి అత్యంత సన్నిహితంగా సంభాల్లో దగ్గరగా ఎంఐఎం అభ్యర్థి ఉన్నాడు. ఈసారి ఒవైసీ ప్రచార సభలకు బీహార్లోని సీమాంచల్ మాదిరిగానే జనం పోటెత్తారు. ఆయనపై ఇటీవల జరిగిన తుపాకీ దాడి యూపీలో ఏఐఎంఐఎం చర్చను ప్రేరేపించింది. కాల్పుల ఘటన ఎన్నికల అంశంగా మారింది. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఒవైసీకి Z-కేటగిరీ భద్రతను ఇచ్చింది. ఒవైసీ తిరస్కరించారు. ఒవైసీపై కాల్పులు జరిపిన వారిని వెంటనే అరెస్టు చేశారు. బీజేపీతో వారి సంబంధాలు ఏర్పడ్డాయి. ఇదే విషయాన్ని తెలియచేస్తూ కాంగ్రెస్,ఎస్పీ ప్రచారం చేస్తున్నాయి.
ఫిబ్రవరి 10న ప్రారంభం కానున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 403 సీట్లలో 100 సీట్లపై ఒవైసీ పార్టీ కన్నేసింది. వీటిలో ఎక్కువ స్థానాలు ముస్లింలు 20-70 శాతం ఓటర్లు ఉన్న నియోజకవర్గాలే ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో ముస్లింలు మొత్తం 19-20 శాతం ఓటర్లు ఉన్నారు. బీహార్లో 17-18 శాతం ఉన్నారు. సంభాల్ (75 శాతానికి పైగా ముస్లిం జనాభా), రాంపూర్ (50 శాతానికి పైగా), మొరాదాబాద్ (సుమారు 50 శాతం) వంటి ముస్లిం ప్రాబల్యం ఉన్న లోక్సభ నియోజకవర్గాలు సమాజ్వాదీ పార్టీకి బలమైన కోటలు. అయితే ఈ ప్రాంతాల్లో ఒవైసీ ప్రవేశం అఖిలేష్ యాదవ్ రచన చేసిన ముస్లిం-యాదవ్ సోషల్ ఇంజినీరింగ్కు ముప్పు కలిగిస్తుంది. ఉత్తరప్రదేశ్ ఎన్నికల కోసం ఒవైసీ ప్రకటించిన 65 మంది అభ్యర్థుల్లో ఎనిమిది మంది హిందూ అభ్యర్థులు. దళిత హిందూ ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు ఒవైసీ ప్రయత్నిస్తున్నారు. ఇది మళ్లీ బీజేపీ ప్రత్యర్థులకు సమస్యాత్మక ప్రాంతం కావడం గమనార్హం.
సహజంగా యూపీ ఓటర్లు తొలి ప్రాధాన్యం ములాయం సింగ్ యాదవ్కు ఆ తర్వాత అఖిలేష్ యాదవ్కు ఇస్తుంటారు. యూపీ రాజకీయాలు పెచ్చుమీరిన క్రమంలో మైనారిటీ ఓటర్లు యాదవుల అధీనంలోనే ఉన్నారని ఎస్పీ భావిస్తోంది. ముస్లింల స్వతంత్ర నాయకత్వంను. ఎస్పీ కోరుకోవడం లేదని ఓవైసీ విమర్శ ఎక్కుపెట్టాడు. ముజఫర్ నగర్ అల్లర్ల వ్యవహారం అఖిలేష్ కు పెద్ద మైనస్. ఆ సంఘటనకు సంబంధించి ముస్లింలపై ఉన్న 77 కేసులను యోగి ఉపసంహరించాడు. ఇలాంటి పరిణామాల క్రమంలో సమాజ్వాదీ పార్టీ నేతృత్వంలోని కూటమి ఓట్లు కోల్పోయే ప్రమాదం ఎక్కువగా ఉంది.
మాయావతి సహాయ హస్తం అందిస్తున్నారా?
బహుజన్ సమాజ్ పార్టీ (BSP) చీఫ్ కొత్త సోషల్ ఇంజినీరింగ్తో ప్రయోగాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. యూపీ ఎన్నికల కోసం ఆమె డాలీ-ముస్లిం ఫార్ములాపై కసరత్తు చేస్తున్నారు. గత వారం వరకు తాను ప్రకటించిన తొలి 220 మంది అభ్యర్థుల్లో 85 మంది ముస్లిం అభ్యర్థులను మాయావతి ప్రకటించారు. ఇది 2015 నుండి అసదుద్దీన్ ఒవైసీ లేవనెత్తుతున్న ‘జై భీమ్ జై మీమ్’ నినాదాన్ని పోలి ఉంటుంది. ఒవైసీ మరియు మాయావతి వేర్వేరుగా యుపి ఎన్నికల పోరులో ఉన్నారు. అయితే వారు కలిసి అధికార బిజెపి కంటే సమాజ్వాదీ పార్టీ నేతృత్వంలోని కూటమికి పెద్ద సవాలుగా నిలిచారు.ఒవైసీ, మాయావతి వేర్వేరుగా యుపి ఎన్నికల పోటీలో ఉన్నారు. అయితే వారు కలిసి అధికార బిజెపి కంటే సమాజ్వాదీ పార్టీ నేతృత్వంలోని కూటమికి పెద్ద సవాలుగా ఉన్నారు. యూపీ ఎన్నికల్లో ఎక్కువ మంది ముస్లిం అభ్యర్థులు ఉండడంతో సమాజ్ వాదీ పార్టీ ముస్లిం ఓట్ల విభజనపై ఆందోళన చెందుతున్నట్లు కనిపిస్తోంది. బిజెపికి వ్యతిరేకంగా జరిగే ఎన్నికల పోరులో తనతో చేతులు కలపాలని అఖిలేష్ యాదవ్ అంబేద్కరిస్టులకు విజ్ఞప్తి చేయడానికి ఇది కారణం కావచ్చు. మొత్తం మీద యూపీ ఎన్నికల్లో బీజేపీ బీ టీమ్ గా ఎంఐఎం , సీ టీమ్ గా బీఎస్పీని ఫోకస్ చేసే పనిలో అఖిలేష్ ఉన్నాడు. సోషల్ ఇంజనీరింగ్ లెక్కలు వేస్తోన్న వాళ్లు మాత్రం ఓవైసీ, మాయావతి కారణంగా బీహార్ తరహాలోనే యూపీలోనూ బీజేపీ ఆ రెండు పార్టీలతో లాభపడుతుందని అంచనా వేస్తున్నారు. సో..బీహార్ తరహా ఫలితాలను యూపీలోనూ క్షేత్రస్థాయి పరిశీలకులు ఊహిస్తున్నారు.
Related News
Asaduddin Owaisi : ఓటర్లకు చేరువయ్యేందుకు తెలుగు పాటలను విడుదల చేసిన ఓవైసీ
హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గంలోని తెలుగు మాట్లాడే ఓటర్లను చేరువ చేసేందుకు ఆల్ ఇండియా మజ్లిస్-ఈ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) తెలుగులో పాటతో ముందుకు వచ్చింది.