Trainee SIs Arrested : 15 మంది ట్రెయినీ ఎస్సైలు అరెస్ట్
Trainee SIs Arrested : పోలీసు నియామక పరీక్షల్లో అక్రమాలు జరిగాయి.
- Author : Pasha
Date : 05-03-2024 - 8:29 IST
Published By : Hashtagu Telugu Desk
Trainee SIs Arrested : పోలీసు నియామక పరీక్షల్లో అక్రమాలు జరిగాయి. ఏకంగా ఓ యువకుడు ఎస్సై పరీక్షలో టాపర్గా నిలిచాడు. చీటింగ్ మాఫియా అండదండలతో ఈ మ్యాజిక్ జరిగింది. రాజస్థాన్ పోలీసు శాఖలో జరిగిన ఈ తతంగంపై నిర్వహించిన విచారణలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. ఎస్సై పరీక్షలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై 15 మంది అభ్యర్థులను పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈ 15 మంది ట్రైనీ ఎస్సైలుగా ఉన్నారు. వీరిలో ఎస్సై బ్యాచ్ టాపర్ కూడా ఉన్నాడని తేలింది.
We’re now on WhatsApp. Click to Join
మూడేళ్ల క్రితం 700 ఎస్సై పోస్టుల భర్తీకి రాజస్థాన్ పోలీస్ విభాగం నోటిఫికేషన్ ఇచ్చింది. 2021-2022 సంవత్సరంలో రాత పరీక్షను నిర్వహించారు. రిజల్ట్ వచ్చాక.. ఎంపికైన వారికి రాజస్థాన్ పోలీసు అకాడమీలో ట్రైనింగ్ ప్రారంభించారు. అనూహ్యంగా ఫిబ్రవరి 29న పోలీస్ ఎగ్జామ్ చీటింగ్ మాఫియా బండారం బట్టబయలైంది. చీటింగ్ మాఫియా వెనుకున్న వ్యక్తిని పట్టుకున్నారు. జగదీశ్ బిష్ణోయ్ అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు పోలీసు పరీక్షల మాఫియాను నిర్వహిస్తున్నట్లు వెల్లడైంది. అసలు అభ్యర్థుల స్థానంలో నకిలీలతో అతడు పరీక్ష రాయించేవాడు. పేపర్ లీక్ చేసేవాడు. ఆధునిక సాంకేతికత సహాయంతో పరీక్షల్లో చీటింగ్కు పాల్పడేందుకు సహకరించేవాడు. జగదీశ్ బిష్ణోయ్ అందించిన సమాచారం ఆధారంగా.. రాజస్థాన్ పోలీసు అకాడమీలోని 12 మంది ట్రైనీ ఎస్సైలతో(Trainee SIs Arrested) పాటు ముగ్గురు ఎస్వోజీ పోలీసులను అదుపులోకి తీసుకున్నారు.పోలీసుల అదుపులో ఉన్న 15 మంది ట్రైనీ ఎస్సైలను విచారిస్తే మరిన్ని విషయాలు బయటకు వచ్చే ఛాన్స్ ఉంది.
Also Read : Phone Tapping : సీఎం రేవంత్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ! ఆ అధికారిపై వేటు
‘మరింత దర్యాప్తు చేస్తే పూర్తి వాస్తవాలు వెలుగులోకి వస్తాయి.. ఛీటింగ్ మాఫియాలో ఇంకా ఎవరు ఉన్నారనేది బయటపడుతుంది.. ట్రైనింగ్లో ఉన్న 15 మంది ఎస్సైలను అరెస్ట్ చేయడం పెద్ద మలుపు’ అని పేపర్ లీక్ వ్యవహారంపై సిట్కు నేతృత్వం వహిస్తున్న అడిషినల్ డీజీపీ వీకే సింగ్ తెలిపారు. గతంలోనూ ఇలాంటి అక్రమాలు జరిగాయా అనేది ఈ దర్యాప్తులో తెలుసుకుంటామని ఆయన పేర్కొన్నారు.