Terrorists Encounter in Kashmir : కశ్మీర్లో ఎన్కౌంటర్.. చొరబాటుకు యత్నించిన ఇద్దరు ఉగ్రవాదులు హతం
రాజౌరీ జిల్లాలోని నౌషెరా సెక్టార్లో సోమవారం తెల్లవారుజామున ఈ ఆపరేషన్(Terrorists Encounter in Kashmir) జరిగింది.
- Author : Pasha
Date : 09-09-2024 - 9:44 IST
Published By : Hashtagu Telugu Desk
Terrorists Encounter in Kashmir : జమ్మూకశ్మీర్లోని రాజౌరీ జిల్లాలో ఉన్న భారత్-పాకిస్తాన్ బార్డర్ దగ్గర చొరబాటుకు యత్నించిన ఇద్దరు ఉగ్రవాదులను భారత భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. రాజౌరీ జిల్లాలోని నౌషెరా సెక్టార్లో సోమవారం తెల్లవారుజామున ఈ ఆపరేషన్(Terrorists Encounter in Kashmir) జరిగింది. చనిపోయిన ఉగ్రవాదుల నుంచి ఏకే-47 రైఫిల్స్ సహా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఏరియాలో ఇంకా ఎన్కౌంటర్ కొనసాగుతున్నట్లు తెలిసింది. నిఘాను మరింత కట్టుదిట్టం చేశామని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి.
Also Read :Fuel Tanker Collides With Truck : 48 మంది సజీవ దహనం.. ట్రక్కు, ఆయిల్ ట్యాంకర్ ఢీ
జమ్మూకశ్మీర్లో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో ఆర్మీ, భద్రతా బలగాలు, పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఉగ్రవాదుల చొరబాటుకు అవకాశమున్న ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్లు, కూంబింగ్ ఆపరేషన్లు పెద్దఎత్తు నిర్వహిస్తున్నారు. మరోవైపు విలేజ్ గార్డుల పేరిట స్థానిక కశ్మీరీ యువతకు ఆయుధాల వినియోగంపై ఆర్మీ ట్రైనింగ్ ఇస్తోంది. ఉగ్రవాదులకు ఎక్కడా అవకాశం ఇవ్వకుండా వ్యవహరించాలనే వ్యూహంతో కేంద్ర ప్రభుత్వం ఉంది. సెప్టెంబర్ 18, సెప్టెంబర్ 25, అక్టోబర్ 1 తేదీల్లో మూడు దశల్లో జరగనున్న కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఎలాంటి దుర్ఘటనలు జరగకుండా చర్యలు చేపడుతున్నారు. అక్టోబర్ 4వ తేదీన కశ్మీర్ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
Also Read :US Trip Purely Personal, DK Shivakumar: బరాక్ ఒబామా, కమలా హారిస్లతో డీకే శివకుమార్ భేటీ ?
ఈసారి కశ్మీర్ ఎన్నికల కోసం కాంగ్రెస్- నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. బీజేపీ, పీడీపీలు వేటికవిగా ఒంటరిగానే పోటీ చేస్తున్నాయి. గతంలో ఈ రెండు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన చరిత్ర ఉంది. అందుకే ఈసారి కూడా అవి చేతులు కలుపుతాయనే అంచనాలు వెలువడుతున్నాయి. ప్రస్తుతానికి ఈవిషయాన్ని అంగీకరించేందుకు పీడీపీ నిరాకరిస్తోంది. బీజేపీ మాత్రం దీని గురించి మాట్లాడటం లేదు. అయితే బీజేపీ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ – నేషనల్ కాన్ఫరెన్స్ కూటమిని ప్రధాన టార్గెట్గా చేసుకుంటోంది. అంటే పీడీపీతో ఆ పార్టీ సఖ్యతను కోరుకుంటోందని స్పష్టమవుతోంది.