Haryana Crisis : సీఎం ఖట్టర్ రాజీనామా.. బీజేపీకి జేజేపీ గుడ్బై.. ఎందుకు ?
Haryana Crisis : త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న వేళ హర్యానాలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
- Author : Pasha
Date : 12-03-2024 - 12:23 IST
Published By : Hashtagu Telugu Desk
Haryana Crisis : త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న వేళ హర్యానాలో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ సీనియర్ నేత, హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. మనోహర్ లాల్ ఖట్టర్ రాజ్భవన్కు వెళ్లిన గవర్నర్ బండారు దత్తాత్రేయకు రాజీనామా పత్రాన్ని సమర్పించారు. సీఎంతో పాటు ఆయన మంత్రివర్గ సహచరులు అందరూ రాజీనామాలు చేశారు. రాజీనామాలకు గవర్నర్ ఆమోదం కూడా తెలిపారు. అయితే మనోహర్ లాల్ ఖట్టర్ లోక్సభకు పోటీ చేయనున్నట్లు సమాచారం. బీజేపీ అధిష్ఠానం సూచనతో కొత్త నేత ముఖ్యమంత్రిగా కాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. తదుపరిగా సీఎం పోస్టు కోసం నయాబ్ సైనీ, సంజయ్ భాటియా పేర్లను బీజేపీ పెద్దలు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
We’re now on WhatsApp. Click to Join
2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీ, దుష్యంత్ చౌతాలాకు చెందిన జననాయక్ జనతా పార్టీ(జేజేపీ) చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. సీఎంగా బీజేపీ నేత మనోహర్ లాల్ ఖట్టర్, ఉప ముఖ్యమంత్రి జేజేపీ చీఫ్ దుష్యంత్ చౌతాలా అయ్యారు. లోక్సభ సీట్ల సర్దుబాటు విషయంలో ఇటీవల ఈ రెండు పార్టీల మధ్య గ్యాప్(Haryana Crisis) ఏర్పడింది. ఈనేపథ్యంలో ఇవాళ ఢిల్లీ వేదికగా దుష్యంత్ చౌతాలా జననాయక్ జనతా పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. జేజేపీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు ఈ మీటింగ్కు డుమ్మా కొట్టారని తెలుస్తోంది. చౌతాలా మీటింగ్కు హాజరుకాని దాదాపు నలుగురు జేజేపీ ఎమ్మెల్యేలంతా బీజేపీతో టచ్లో ఉన్నారని సమాచారం. ఒకవేళ అదే జరిగితే.. హర్యానా అసెంబ్లీలో లెక్కలు మారే అవకాశం ఉంటుంది. అసెంబ్లీలో మొత్తం 90 సీట్లు ఉండగా.. వాటిలో 40 చోట్ల బీజేపీ గెలవగా, 10 చోట్ల జేజేపీ గెలిచింది. రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 46 మంది ఎమ్మెల్యేలు. నలుగురు జేజేపీ నుంచి బీజేపీలోకి జంప్ అయితే.. కమలదళం బలం 44కు పెరుగుతుంది. రాష్ట్రంలో ఏడుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిలో కొంతమంది బీజేపీకి మద్దతు తెలిసినా ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయిపోతుంది.
Also Read :RGIA : ‘ASQ బెస్ట్ ఎయిర్పోర్ట్ అవార్డు 2023’ గెలుచుకున్న RGIA
హర్యానాలోని లోక్సభ సీట్ల సర్దుబాటుపై ఇటీవల జననాయక్ జనతా పార్టీ(జేజేపీ) చీఫ్ దుష్యంత్ చౌతాలా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా భేటీ అయి చర్చించారు. 2019 ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం 10 లోక్సభ సీట్లన్నీ బీజేపీయే గెల్చుకుంది. ఈనేపథ్యంలో ఈ దఫా కనీసం ఒక్క లోక్సభ సీటు కూడా జేజేపీకి ఇచ్చేది లేదని జేపీ నడ్డా తేల్చి చెప్పారు. దీంతో దుష్యంత్ చౌతాలా బీజేపీకి గుడ్ బై చెప్పాలని నిర్ణయించారు. ఆయన తదుపరిగా కాంగ్రెస్ తో చేతులు కలుపుతారా ? ఆప్తో జట్టు కడతారా ? అనేది ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్, ఆప్, జేజేపీ జట్టుకట్టినా ఆశ్చర్యపోనవసరం లేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.