Mudra Loan : సొంతంగా బిజినెస్ చేయాలనుకునేవారికి కేంద్రం గుడ్ న్యూస్
Mudra Loan : 2015లో ప్రారంభమైన ఈ పథకం ద్వారా వ్యవసాయేతర రంగాల్లో వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారికి ఎలాంటి హామీ లేకుండా రూ.50,000 నుండి రూ.20 లక్షల వరకు రుణం లభిస్తుంది
- Author : Sudheer
Date : 14-05-2025 - 7:48 IST
Published By : Hashtagu Telugu Desk
సొంతంగా వ్యాపారం చేయాలనుకునే యువత, మహిళలకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి ముద్రా యోజన (PMMY) మంచి మార్గం. 2015లో ప్రారంభమైన ఈ పథకం ద్వారా వ్యవసాయేతర రంగాల్లో వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారికి ఎలాంటి హామీ లేకుండా రూ.50,000 నుండి రూ.20 లక్షల వరకు రుణం లభిస్తుంది. ఈ పథకం కింద ముద్రా కార్డు కూడా జారీ చేస్తారు, దీని ద్వారా అవసరమైనప్పుడు డబ్బు తీసుకోవచ్చు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 53 కోట్ల మందికి పైగా ప్రజలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందగా, వారిలో 70 శాతం మంది మహిళలే ఉన్నారు.
Guava Leaves: ముఖంపై మొటిమలు, మచ్చలు ఉండకూడదు అనుకుంటే జామ ఆకులతో ఏం చేయాలో మీకు తెలుసా?
ఈ పథకం కింద “శిశు”, “కిశోర”, “తరుణ్” అనే మూడు రకాల రుణాలు ఉన్నాయి. శిశు రుణం కింద రూ. 50,000 వరకు, కిశోర రుణం కింద రూ. 5 లక్షల వరకు, తరుణ్ రుణం కింద రూ. 10 లక్షల వరకు, అలాగే తరుణ్ ప్లస్ కింద రూ. 20 లక్షల వరకు లోన్లు మంజూరవుతాయి. వ్యాపారాన్ని ప్రారంభించాలన్నా, విస్తరించాలన్నా ఈ రుణాలు ఉపయోగపడతాయి. వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, NBFCలు, మైక్రో ఫైనాన్స్ సంస్థలు ఈ రుణాలను అందిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం 90 శాతం నిధులను అందించగా, లబ్ధిదారులు 10 శాతం మూలధనం సమకూర్చాలి.
ముద్రా రుణం కోసం దరఖాస్తు చేయాలంటే దరఖాస్తుదారుడు భారతీయ పౌరుడై ఉండాలి. వయస్సు 18 నుంచి 65 సంవత్సరాల మధ్య ఉండాలి. బ్యాంకు మోసాలకు సంబంధించి పేరుండకూడదు. అవసరమైన డాక్యుమెంట్లతో పాటు, వ్యాపార ప్రాజెక్ట్ రిపోర్ట్ సమర్పించాలి. ఆన్లైన్లో udyamimitra.in పోర్టల్ ద్వారా లేదా దగ్గర్లోని బ్యాంక్లో వెళ్లి దరఖాస్తు చేయవచ్చు. ఈ పథకం ద్వారా యువత తన కలల వ్యాపారాన్ని ప్రారంభించి, ఇతరులకు ఉద్యోగాలు కల్పించే స్థాయికి చేరుకోవచ్చు.