Gautam Adani : 2 లక్షల కోట్ల పెట్టుబడి పెడతాం.. 1 లక్ష ఉద్యోగాలిస్తాం : అదానీ
Gautam Adani : వచ్చే ఐదేళ్లలో గుజరాత్లో తమ కంపెనీ రూ.2 లక్షల కోట్లకుపైగా పెట్టుబడి పెడుతుందని అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ వెల్లడించారు.
- Author : Pasha
Date : 10-01-2024 - 12:09 IST
Published By : Hashtagu Telugu Desk
Gautam Adani : వచ్చే ఐదేళ్లలో గుజరాత్లో తమ కంపెనీ రూ.2 లక్షల కోట్లకుపైగా పెట్టుబడి పెడుతుందని అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ వెల్లడించారు. 2025 సంవత్సరం వరకు గుజరాత్లో తమ పెట్టుబడులు రూ. 55వేల కోట్లకు చేరుతాయని చెప్పారు. బుధవారం గుజరాత్లోని గాంధీనగర్లో ప్రారంభమైన వైబ్రంట్ గుజరాత్ సదస్సు వేదికగా అదానీ ఈవివరాలను ప్రకటించారు. గుజరాత్లోని కచ్లో ఉన్న ఖవ్దాలో 725 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఎనర్జీ పార్క్ను నిర్మించనున్నట్లు తెలిపారు. ఆత్మనిర్భర్ భారత్కు అవసరమైన గ్రీన్ సప్లై చైన్ను విస్తరిస్తున్నట్లు వెల్లడించారు. భారత్లో అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ పునరుత్పాదక ఇంధన పర్యావరణ వ్యవస్థను రూపొందిస్తున్నామని ఆయన చెప్పారు. ఇందులో సోలార్ ప్యానెల్లు, విండ్ టర్బైన్లు, హైడ్రోజన్ ఎలక్ట్రోలైజర్లు, గ్రీన్ అమ్మోనియా, పీవీసీ, కాపర్, సిమెంట్ ఉత్పత్తులు ఉంటాయన్నారు. అదానీ గ్రూప్ యొక్క భారీ పెట్టుబడి గుజరాత్ రాష్ట్రంలో 1 లక్ష ఉద్యోగాలను సృష్టిస్తుందని అదానీ(Gautam Adani) వివరించారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, పలువురు కేంద్రమంత్రులు కూడా హాజరయ్యారు.
We’re now on WhatsApp. Click to Join.
ఈసందర్భంగా ప్రధాని మోడీని ఉద్దేశించి అదానీ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘మిస్టర్ ప్రైమ్ మినిస్టర్.. మీరు భారతదేశ భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్న తీరు అమోఘం. మీ నాయకత్వంలో భారతదేశం 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరిస్తుంది. మీరు భారతదేశాన్ని ఒక ప్రధాన శక్తిగా ప్రపంచ పటంలో ఉంచారు. భారతావనిని ఆత్మనిర్భర్గా చేస్తున్నారు’’ అని అదానీ కొనియాడారు. “గత దశాబ్ద కాలంలో భారతదేశ వికాసపు గణాంకాలు విశేషమైనవి. భారతదేశపు GDP 185% పెరిగింది. తలసరి ఆదాయం 165% పెరిగింది. ఈ విజయం అసమానమైనది. ఈ దశాబ్దపు భౌగోళిక రాజకీయ వైరుధ్యాలు, కరోనా మహమ్మారి సవాళ్లను ఎదుర్కొని దేశాన్ని మీరు బలంగా ఉంచారు’’ అని అదానీ కొనియాడారు.
Also Read: Golden Doors : అయోధ్య రామయ్య గర్భగుడికి గోల్డెన్ డోర్స్
అదానీ గ్రూప్ గత కొన్నేళ్లలో అనేక సిమెంట్ కంపెనీలను వ్యూహాత్మకంగా కొనుగోలు చేసింది. ఏసీసీ సిమెంట్స్, అంబుజా సిమెంట్స్, సంఘీ సిమెంట్స్ తర్వాత ఏషియన్ కాంక్రీట్స్ అండ్ సిమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్(ACCCPL)పై కంపెనీ కన్ను పడింది. అదానీ సిమెంట్స్ తన ఉత్పాదకతను పెంచుకోవటంతో భారత నిర్మాణ రంగంలో భాగస్వామిగా మారాలని చూస్తోంది. కంపెనీలో 55 శాతం అదనపు వాటాను విజయవంతంగా కొనుగోలు చేసినట్లు అదానీకి చెందిన సిమెంట్ కంపెనీ ఏసీసీ లిమిటెడ్ ప్రకటించింది. దీంతో కంపెనీలో పూర్తి యాజమాన్యం ప్రస్తుతం అదానీ గ్రూప్ చేతికి చిక్కింది. ఈవిధంగా వ్యాపార విస్తరణపై అదానీ గ్రూప్ ఫోకస్ పెట్టింది.