Bus Falls Off Flyover : ఫ్లైఓవర్ నుంచి పడిపోయిన బస్సు.. ఐదుగురి మృతి, 40 మందికి గాయాలు
Bus Falls Off Flyover : ఘోర ప్రమాదం జరిగింది. డ్రైవర్ బస్సుపై నియంత్రణ కోల్పోయాడు.
- Author : Pasha
Date : 16-04-2024 - 8:11 IST
Published By : Hashtagu Telugu Desk
Bus Falls Off Flyover : ఘోర ప్రమాదం జరిగింది. డ్రైవర్ బస్సుపై నియంత్రణ కోల్పోయాడు. దీంతో అది అదుపుతప్పి వంతెనపై నుంచి పడిపోయింది. దీంతో అందులోని ప్రయాణికుల్లో ఐదుగురు చనిపోయారు. మిగతా 35 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ విషాద ఘటన సోమవారం రాత్రి ఒడిశాలోని జాజ్పుర్ జిల్లాలో(Bus Falls Off Flyover) చోటుచేసుకుంది.
We’re now on WhatsApp. Click to Join
ఈ బస్సు సోమవారం మధ్యాహ్నం 47మంది ప్రయాణికులతో ఒడిశాలోని పూరీ నుంచి బెంగాల్ వైపుగా బయలుదేరింది. రాత్రి 9 గంటల టైంలో జాజ్పుర్లోని 16వ నంబర్ జాతీయ రహదారిపై నుంచి బస్సు వెళ్తుండగా.. బారాబతి వద్ద ఫ్లైఓవర్ దాటుతుండగా అకస్మాత్తుగా ఏదో జరిగింది. బస్సుపై డ్రైవర్ నియంత్రణను కోల్పోయాడు. ఆ వెంటనే ఫ్లైఓవర్ పైనుంచి బస్సు రోడ్డుపై పడిపోయింది. ప్రయాణికులు అందరూ గాఢ నిద్రలో ఉండటంతో అసలేం జరుగుతోందో ఎవరికీ ఏమీ అర్థం కాలేదు. నిద్రమత్తులో ఉండగానే అందరికీ తీవ్ర గాయాలయ్యాయి. చనిపోయిన ఐదుగురిలో ఒక మహిళ, నలుగురు పురుషులు ఉన్నారు. గాయపడిన 35 మందిని వెంటనే కటక్లోని ఆస్పత్రికి తరలించారు.
Also Read :Israel Vs Iran : యుద్ధానికి సై.. ఇజ్రాయెల్ ఆర్మీ వర్సెస్ ఇరాన్ ఆర్మీ .. ఎవరి బలం ఎంత?
గాయపడిన వారికి మెరుగైన చికిత్స కోసం ప్రత్యేక వైద్యుల బృందాన్ని ఏర్పాటు చేశామని రవాణా కమిషనర్ అమితవ్ ఠాకూర్ చెప్పారు. ‘‘ఈ యాక్సిడెంట్లో గాయపడిన వారిని 16 అంబులెన్స్ల సాయంతో కటక్ ఆస్పత్రికి తరలించాం. గ్యాస్ కట్టర్లను ఉపయోగించి బస్సు రాడ్డులను కత్తిరించి ప్రయాణికులను రక్షించాం. అనంతరం బస్సును క్రేన్ సహాయంతో పైకి తీశాం. ప్రయాణికుల్లో ఎక్కువ మంది బెంగాల్ రాష్ట్రానికి చెందినవారే ఉన్నారు’’ అని అమితవ్ తెలిపారు. ఈ ఘటనపై ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.3లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు.