Farmers Protest : రైతుల ఉద్యమానికి శుభంకార్డు
ఏడాదిన్నరగా జరుగుతోన్న రైతు ఉద్యమానికి శుభం కార్డు పడనుంది. వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో పాటు పార్లమెంట్లో బిల్లును వెనక్కు తీసుకుంటోన్న క్రమంలో రైతులు ఉద్యమాన్ని విరమించనున్నారు.
- By Hashtag U Published Date - 03:39 PM, Thu - 9 December 21

ఏడాదిన్నరగా జరుగుతోన్న రైతు ఉద్యమానికి శుభం కార్డు పడనుంది. వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో పాటు పార్లమెంట్లో బిల్లును వెనక్కు తీసుకుంటోన్న క్రమంలో రైతులు ఉద్యమాన్ని విరమించనున్నారు. కనీస మద్ధతు ధరకు చట్టపరమైన హామీ, వ్యవసాయ చట్టాలపై రద్దుకు క్లారిటీ రావడంతో రైతన్న వెనక్కు తగ్గాడు. ఉద్యమ సమయంలో రైతులపై నమోదైన కేసులను కూడా రద్దు చేసుకోవడానికి కేంద్ర హోంశాఖ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. దీంతో డిసెంబర్ 11న ఉద్యమాన్ని ముగిస్తున్నారు.వ్యవసాయ చట్టాలు, కనీస మద్దతు ధర (MSP) సహా ఇతర సమస్యలపై 15 నెలలుగా రైతులు పోరాటం చేస్తున్నారు. కేంద్రం నుంచి హామీల నేపథ్యంలో డిసెంబర్ 11న ఉద్యమాన్ని విరమిస్తున్నట్టు రైతుల సంఘాల నేతలు ప్రకటించారు. గురువారం సాయంత్రం 5:30 గంటలకు ఫతే అర్దాస్ (విజయ ప్రార్ధన) నిర్వహించాలని వాళ్ల ఇళ్లకు సమాచారం అందించారు. డిసెంబరు 11న ఉదయం 9 గంటలకు ఢిల్లీ సరిహద్దుల్లోని సింఘు, తిక్రీ నిరసన ప్రదేశాలలో ఫతే మార్చ్ (విజయ యాత్ర) కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నారు. డిసెంబర్ 13న అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్లో పూజలు చేసేందుకు పంజాబ్ వ్యవసాయ నేతలు ప్లాన్ చేస్తున్నారు. సంయుక్త కిసాన్ మోర్చా( SKM) డిసెంబర్ 15న ఢిల్లీలో మరో సమావేశాన్ని నిర్వహించనుంది.
ఆరు డిమాండ్లతో నవంబర్ 21న SKM ప్రధాని మోదీకి రాసిన లేఖను విషయం విదితమే. ఆ లేఖను అనుసరించి ఐదుగురు సభ్యుల కమిటీకి రాతపూర్వక ముసాయిదా ప్రతిపాదనను కేంద్రం పంపింది. చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించిన తర్వాత ఉద్యమాన్ని వదిలివేయడానికి నిరాకరించిన రైతులు కేంద్రంపై కొన్ని షరతులు పెట్టారు.గత వారం, హోం మంత్రి అమిత్ షా తమతో ఫోన్ కాల్ ద్వారా అపరిష్కృత సమస్యలపై చర్చించారు. నిరసనలో ఉన్న రైతులు ప్రభుత్వ ఉద్దేశంపై అనుమానం వ్యక్తం చేశారు. నిరసనల సందర్భంగా నమోదైన అన్ని కేసులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్ల కోసం 2016లో జరిగిన జాట్ల ఆందోళనను ప్రస్తావిస్తూ.. హామీ ఇచ్చినా న్యాయపరమైన కేసులను ఉపసంహరించుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని గుర్తు చేశారు. కేంద్రం నుంచి వచ్చిన హామీలపై ఢిల్లీ-హర్యానా సరిహద్దులోని సింగ్లో సంయుక్త కిసాన్ మోర్చాకు చెందిన రైతు నేతల సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. MSP సమస్యను నిర్ణయించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయనుంది. ఈ కమిటీలో ప్రభుత్వ అధికారులు, వ్యవసాయ నిపుణులు, నిరసనకు నాయకత్వం వహించిన రైతు సంఘాల సంయుక్త కిసాన్ మోర్చా ప్రతినిధులు ఉంటారు.