Earthquake: మణిపూర్లో భూకంపం.. భయాందోళనలో స్థానికులు
మణిపూర్ (Manipur)లోని నోనీలో మంగళవారం తెల్లవారుజామున భూకంపం (Earthquake) సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) ప్రకారం.. ఈ ప్రకంపనలు మంగళవారం తెల్లవారుజామున 2.46 గంటలకు సంభవించాయి.
- Author : Gopichand
Date : 28-02-2023 - 6:17 IST
Published By : Hashtagu Telugu Desk
మణిపూర్ (Manipur)లోని నోనీలో మంగళవారం తెల్లవారుజామున భూకంపం (Earthquake) సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) ప్రకారం.. ఈ ప్రకంపనలు మంగళవారం తెల్లవారుజామున 2.46 గంటలకు సంభవించాయి. దాని కేంద్రం భూమి ఉపరితలం నుండి 25 కి.మీ లోతులో ఉంది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.2గా నమోదైంది. భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ధృవీకరించలేదు.
అంతకుముందు ఫిబ్రవరి 19న ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణంలో భూకంపం వచ్చింది. ఆదివారం ఉదయం 7.13 గంటల ప్రాంతంలో 3.4 సెకన్ల పాటు ప్రకంపనలు సంభవించాయి. భయాందోళనకు గురైన స్థానికులు ఇళ్ల నుంచి బయటకు వచ్చి వీధుల్లోకి వచ్చారు. అదే రోజు మధ్యప్రదేశ్లో కూడా రిక్టర్ స్కేలుపై 3.0 తీవ్రతతో భూకంపం వచ్చింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం.. ఇండోర్కు నైరుతి దిశలో 151 కి.మీ దూరంలో ఉన్న ధార్లో మధ్యాహ్నం 1 గంటల సమయంలో భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం భూ ఉపరితలానికి 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు భూకంప సంస్థ వెల్లడించింది.
Also Read: Modi: కర్ణాటకలో మోడీ పర్యటన… ఎన్నికల వేళ కాంగ్రెస్పై సెటైర్లు!
సోమవారం గుజరాత్లోని కచ్, అమ్రేలి జిల్లాల్లో వరుసగా 3.8, 3.3 తీవ్రతతో రెండు ప్రకంపనలు సంభవించాయి. అయితే రెండు చోట్లా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. గత వారంలో అమ్రేలిలో 3.1, 3.4 తీవ్రత మధ్య ఐదు ప్రకంపనలు సంభవించాయి. గత రెండేళ్లలో ఇక్కడ దాదాపు 400 తేలికపాటి ప్రకంపనలు నమోదయ్యాయి. కాగా, జనవరి 2001లో కచ్ జిల్లాలో విధ్వంసకర భూకంపం సంభవించింది.