Air India : ఎయిర్ ఇండియాకు ఉగ్రవాది పన్నూ సంచలన వార్నింగ్
గతేడాది నవంబరులోనూ పన్నూ(Air India) ఇదే విధమైన వార్నింగ్ ఇచ్చాడు.
- By Pasha Published Date - 11:50 AM, Mon - 21 October 24

Air India : అమెరికా కేంద్రంగా ఖలిస్తానీ ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. న్యూయార్క్లో నివసించే ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ మరోసారి బరితెగించాడు. తాజాగా భారత్కు ఇంకో హెచ్చరికను జారీ చేశాడు. నవంబర్ 1 నుంచి 19 వరకు ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించొద్దని భారతీయులకు పన్నూ వార్నింగ్ ఇచ్చాడు. సిక్కులపై భారత్లో మారణహోమం జరిగి 40 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఎయిర్ ఇండియా విమానాలపై దాడులు జరగొచ్చని అతడు తన వార్నింగ్ మెసేజ్లో పేర్కొన్నాడు. గతేడాది నవంబరులోనూ పన్నూ(Air India) ఇదే విధమైన వార్నింగ్ ఇచ్చాడు. కానీ భారత విమానాశ్రయాల్లో కానీ.. విమానాల్లో కానీ ఎలాంటి దుర్ఘటనలు జరగలేదు. భారీ బందోబస్తు నడుమ విమాన సర్వీసులను విజయవంతంగా నడిపారు.
Also Read :Police Commemoration Day : పోలీసు అమరులకు జై.. అలుపెరుగని యోధులకు సెల్యూట్
గత వారం రోజుల వ్యవధిలో భారత్లోని అన్ని ప్రధాన విమానయాన సంస్థలకు 100కుపైగా బెదిరింపు మెసేజ్లు వచ్చాయి. ఇప్పుడు ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ నుంచి బెదిరింపు మెసేజ్ వచ్చింది. దీంతో అంతకుముందు వచ్చిన బెదిరింపు మెసేజ్లన్నీ కూడా ఖలిస్తానీ ఉగ్రవాదులు పంపినవేనా అనే సందేహం రేకెత్తుతోంది. భారత విమానయాన రంగాన్ని దెబ్బతీసి.. టూరిస్టుల రాకపోకలను తగ్గించాలనే కుట్రతో ఖలిస్తానీ ఉగ్రమూకలు ఇలాంటి దుష్ట ప్రణాళికలను అమలు చేస్తున్నారనే అంచనాలు వెలువడుతున్నాయి.
గురుపత్వంత్ సింగ్ పన్నూకు కెనడా పౌరసత్వంతో పాటు అమెరికా పౌరసత్వం కూడా ఉంది. అతడు సిఖ్స్ ఫర్ జస్టిస్ (SFJ) అనే ఉగ్ర సంస్థను నడుపుతున్నాడు. ఈ సంస్థను భారత్ బ్యాన్ చేసింది. పన్నూను వాంటెడ్ ఉగ్రవాదుల జాబితాలో భారత్ చేర్చింది. అయినా ఇలాంటి ఉగ్రవాదులకు అమెరికా, కెనడా దేశాలు షెల్టర్ ఇస్తున్నాయి. ఇక ఇదే సమయంలో ఇలాంటి ఉగ్రవాదులను చైనా, రష్యా లాంటి దేశాలు ఉపేక్షించడం లేదు. వారికి కనీసం ఆశ్రయం కల్పించడం లేదు.