Cyber Crime: సైబర్ కేసు దర్యాప్తు.. వెరీ కాస్ట్లీ గురూ!!
మన హైదరాబాద్ పరిధిలో సైబర్ నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తెలిసో.. తెలియకో.. చేసిన పొరపాటుకు ఎంతోమంది అమాయకులు సైబర్ నేరగాళ్ల వలకు చిక్కి... జేబులకు చిల్లులు పెట్టించుకుంటున్నారు.
- By Hashtag U Published Date - 01:00 PM, Mon - 25 April 22
మన హైదరాబాద్ పరిధిలో సైబర్ నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తెలిసో.. తెలియకో.. చేసిన పొరపాటుకు ఎంతోమంది అమాయకులు సైబర్ నేరగాళ్ల వలకు చిక్కి… జేబులకు చిల్లులు పెట్టించుకుంటున్నారు. లబోదిబోమని గుండెలు బాదుకుంటూ సైబర్ క్రైమ్ కేసులు పెడుతున్నారు. ఆ తర్వాతే అసలు సీన్ మొదలవుతోంది. ఇటువంటి సైబర్ నేరాల విచారణ కు పోలీసులు భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది. చాలా కేసులలో సైబర్ క్రైమ్ వల్ల బాధితుడు కోల్పోయిన నగదు మొత్తం కంటే ఎక్కువ డబ్బును .. కేసు దర్యాప్తుకు పోలీసుశాఖ వెచ్చించాల్సి వస్తోంది. ఇలా ఎందుకు జరుగుతోంది ? అంత ఖర్చు ఏముంటుంది ? అనేది తెలుసుకోవాలంటే మొత్తం కథనం చదవాల్సిందే.
ఖర్చుల చిట్టా ఇదీ..
సైబర్ నేరాలు చేసేవాళ్ళు బాధితులకు సమీపంలో ఉండరు. ప్రధానంగా ఢిల్లీ, చండీగఢ్, పశ్చిమ బెంగాల్, బీహార్, మధ్య ప్రదేశ్, ఝార్ఖండ్ లలోని కొన్ని ప్రాంతాల నుంచి ఇటువంటి సైబర్ నేరాలు జరుగుతున్నాయి. ఐపీ అడ్రస్, లొకేషన్ , ఇతరత్రా సాంకేతిక సమాచారం ఆధారంగా సైబర్ నేరగాడి ఆచూకీని గుర్తించడం పెద్ద సవాల్ తో కూడుకున్న విషయం. ఒక్కోసారి ఇందుకోసం పోలీసులు బయటి సాంకేతిక నిపుణుల సహకారాన్ని కూడా తీసుకుంటారు. ఈ సహాయం చేసినందుకు ప్రతిగా ఆ సాంకేతిక నిపుణుడికి పోలీసుశాఖ మంచి పారితోషికమే ఇవ్వాల్సి ఉంటుంది. ఈ సమాచారం తీసుకొని.. సైబర్ నేరగాడు ఉన్న రాష్ట్రానికి ఒక పోలీస్ టీమ్ నుం పంపించాలి. ఇందులో ఒక ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్, ఇద్దరు లేదా ముగ్గురు కానిస్టేబుళ్లు ఉంటారు. నేరగాడి లొకేషన్ కు చేరుకోవడానికి రైళ్లు, విమానాలు, బసుల్లో ప్రయాణించడానికి డబ్బు ఖర్చవుతుంది. ఆ లొకేషన్ కు చేరుకున్నాక.. నేరగాడు దొరక్కపోతే కొన్నాళ్ళు అక్కడే ఉండి పూర్తి వివరాలు సేకరించాల్సి ఉంటుంది. అక్కడ లాడ్జీల్లో ఉండటానికి , భోజనాలకు మళ్లీ ఖర్చులు వేరు. తీరా.. నేరగాన్ని పట్టుకున్నాక అతడి ప్రయాణ ఖర్చులు కూడా అదనంగా వచ్చిపడతాయి. చాలా కేసుల్లో కేవలం 2 లక్షల నుంచి 5 లక్షల దాకా వెచ్చిస్తే సైబర్ దొంగలు దొరికిపోతుంటారు. కానీ కొన్ని ప్రత్యేక కేసుల్లో ఇంకా ఎక్కువగా ఖర్చు పెట్టాల్సి ఉంటుందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.
ఈ కేసుల దర్యాప్తు వ్యయం లక్షల్లో..
– హైదరాబాద్ పోలీసులు కొన్ని సైబర్ కేసులను చేదించడానికి భారీగా డబ్బు వెచ్చించారు. ఈజాబితాలో మొదటి స్థానంలోకి వచ్చేది ‘ మహేష్ బ్యాంక్ ఈ – ఫ్రాడ్ కేసు’. దీని దర్యాప్తు కోసం ఏకంగా రూ.57 లక్షలు ఖర్చు చేశారు. దీని విచారణకు 100 మంది పోలీసులతో టీమ్ ఏర్పాటు చేశారు. వాళ్ళందరూ దేశంలోని దాదాపు 15 రాష్ట్రాలకు వెళ్లి వివరాలు సేకరించారు. ఈక్రమంలో
సుదూరంలోని ఈశాన్య రాష్ట్రాలకు కూడా వెళ్లాల్సి వచ్చింది. ఇప్పటివరకు హైదరాబాద్ పరిధిలో ఒక సైబర్ క్రైమ్ దర్యాప్తుకు అయిన అతిపెద్ద వ్యయం ఇదేనని అంటారు.
– చైనీస్ లోన్ యాప్ కేసులోనూ హైదరాబాద్ సైబర్ పోలీసులు దర్యాప్తుకు రూ.20 లక్షల దాకా ఖర్చు పెట్టారు. ఇందులోనూ దేశవ్యాప్తంగా దర్యాప్తు బృందాలను పంపాల్సి వచ్చింది.
Related News
Mulugu: ములుగు జిల్లాలో అంగన్వాడీ టీచర్ అనుమానాస్పద మృతి
ములుగు జిల్లాలో ఓ అంగన్వాడీ టీచర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన దారుణ ఘటన చోటుచేసుకుంది . ఈ ఘటన ములుగు జిల్లా ఏటూరునాగారంలో బుధవారం వెలుగు చూసింది. మృతురాలు సుజాత(48) మండల కేంద్రంలో అంగన్వాడీ టీచర్గా పని చేసింది.