K’tka Congress: కాంగ్రెస్ పార్టీ హిందుత్వ బాట.. బీజేపీ వల్ల కాని ఆ పనిని చేయబోతోందా?
బాధపడితే కాని బోధపడదు అంటారు. మిగిలిన విషయాల్లో దీని సంగతి ఏమో కాని.. రాజకీయాల్లో మాత్రం ఇలా జరిగితే.. నష్టం అంతా ఇంతా కాదు. ఏకంగా తరాలు పాటు ఆ భారాన్ని మోయాల్సి వస్తుంది. ఆ నష్టాన్ని భరించాల్సి వస్తుంది.
- By Hashtag U Published Date - 10:58 AM, Mon - 11 April 22
బాధపడితే కాని బోధపడదు అంటారు. మిగిలిన విషయాల్లో దీని సంగతి ఏమో కాని.. రాజకీయాల్లో మాత్రం ఇలా జరిగితే.. నష్టం అంతా ఇంతా కాదు. ఏకంగా తరాలు పాటు ఆ భారాన్ని మోయాల్సి వస్తుంది. ఆ నష్టాన్ని భరించాల్సి వస్తుంది. దేశంలో హిందుత్వ కార్డు వల్ల దక్కే ప్రయోజనాలను నాడు అధికారంలో ఉన్నప్పుడు విస్మరించడం వల్ల కలిగిన నష్టమేంటో హస్తం పెద్దలకు తెలిసివస్తోంది. అందుకే ఇప్పుడు మళ్లీ హిందుత్వ బాట పట్టింది.
నిజానికి గతంలో కర్ణాటక ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ.. అక్కడి మఠాధిపతులను కలుసుకున్నారు. గుళ్లు, గోపురాలను సందర్శించారు. అయినా అవన్నీ పార్టీకి అనుకున్నంత మెజార్టీని ఇవ్వలేకపోయాయి. తరువాత అప్పుడప్పుడు ఆ మార్గంలోనే ఉన్నా.. ఇప్పుడు మాత్రం పూర్తిస్థాయిలో హిందుత్వ బాట పట్టడానికి కాంగ్రెస్ పార్టీ డిసైడ్ అయినట్టు కనిపిస్తోంది. దానికి ప్రయోగశాలగా ఛత్తీస్ గఢ్ ను ఎంచుకుంది.
ఛత్తీస్ గఢ్ లో వచ్చే ఏడాదే శాసనసభకు ఎన్నికలు జరగబోతున్నాయి. అందుకే అక్కడ మరోసారి పవర్ లోకి రావడానికి… హిందుత్వ ఓటుబ్యాంకును సంఘటితం చేయడానికి… హిందుత్వ ఓటు కార్డును తమ పరం చేసుకోవడానికి పెద్ద వ్యూహంతోనే సిద్ధమైంది. దానికోసమే రామాయణ సర్క్యూట్ ప్రాజెక్టుతో ముందుకొచ్చింది. శ్రీరాముడు.. వనవాసం సమయంలో ఛత్తీస్ గఢ్ లోని గడిపిన దాదాపు 9 ప్రాంతాలను ఎంపిక చేసింది. వాటిని ఈ ప్రాజెక్టులో భాగంగా సుందరీకరించనుంది. భక్తులకు త్వరలోనే వాటిని అందుబాటులోకి తీసుకురానుంది.
బీజేపీ ఇప్పటికే కర్ణాటకలో హిందుత్వ కార్డును ప్రయోగిస్తోంది. అక్కడి హిందూ ఓటుబ్యాంకును సంఘటితం చేయడానికి నానా తంటాలు పడుతోంది. ఇప్పటికే అక్కడ ఓ చోట ప్రయోగం కూడా చేసింది. దీంతో ఓట్లు, సీట్లూ ఇబ్బడిముబ్బడిగా వచ్చాయి. అందుకే కర్ణాటక వ్యాప్తంగా దానిని అమలు చేసి ఎన్నికల్లో లబ్దిపొందేలా వ్యూహం రచించింది. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే బాట పట్టింది. కాకపోతే వివాదాలకు బదులు.. వారికి నచ్చే పనులు చేసి ఓట్లు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తోంది. మరి ఈ ప్లాన్ హస్తవాసిని మారుస్తుందో లేదో చూడాలి.
Related News
Rahul Gandhi : దేశంలో ఉన్న ధనికుల కోసం బిజెపి పనిచేస్తుంది – రాహుల్ గాంధీ
ఇప్పటివరకూ సంపన్నులు బ్యాంకుల నుంచి తీసుకున్న 16 లక్షల కోట్ల రూపాయల రుణాలను బీజేపీ మాఫీ చేసిందని దుయ్యబట్టారు