Tamil Nadu Protest: తమిళనాడు గవర్నర్ పై కాంగ్రెస్ ఆగ్రహం
- Author : Vamsi Chowdary Korata
Date : 07-05-2026 - 4:45 IST
Published By : Hashtagu Telugu Desk
తమిళనాడు రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడంలో జాప్యం జరుగుతోందని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు పిలుపునిచ్చింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, గవర్నర్ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని నిరసిస్తూ రేపు (మే 8వ తేదీన) చెన్నైలో భారీ ధర్నా నిర్వహించనున్నట్లు ప్రకటించింది.
తమిళనాడు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీఎన్పీసీసీ) అధ్యక్షుడు కె. సెల్వపెరుంతగై నాయకత్వంలో ఈ నిరసన కార్యక్రమం జరగనుంది. శుక్రవారం ఉదయం 11 గంటలకు చెన్నైలోని అన్నాసాలై, తారాపూర్ టవర్ సమీపంలో ఈ ధర్నా చేపట్టనున్నట్లు పార్టీ మీడియా విభాగం ఇన్చార్జి ఎ. గోపన్న ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్రం చేతిలో గవర్నర్ కీలుబొమ్మగా మారి, ప్రజా తీర్పును అగౌరవపరుస్తున్నారని కాంగ్రెస్ ఆరోపించింది.
ఈ నిరసన కార్యక్రమంలో పార్టీ మాజీ అధ్యక్షులు, మాజీ కేంద్ర మంత్రులు, ఏఐసీసీ కార్యదర్శులు, ప్రస్తుత, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు పార్టీకి చెందిన అన్ని స్థాయిల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొంటారని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది.