Jammu Kashmir : ఆరేళ్ల తర్వాత తొలి సెషన్.. రసాభాసగా కశ్మీర్ అసెంబ్లీ సమావేశం
జమ్మూకశ్మీరు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సమయంలో.. ఆర్టికల్ 370ని పునరుద్ధరించాలని నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అగ్రనేత ఒమర్ అబ్దుల్లా(Jammu Kashmir) డిమాండ్ చేశారు.
- Author : Pasha
Date : 04-11-2024 - 1:12 IST
Published By : Hashtagu Telugu Desk
Jammu Kashmir : ఎట్టకేలకు ఆరేళ్ల సుదీర్ఘ గ్యాప్ తర్వాత జమ్మూకశ్మీర్ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభమ య్యాయి. అయితే సెషన్ ప్రారంభం కాగానే అలజడి మొదలైంది. పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ(పీడీపీ) ఎమ్మెల్యే వహీద్ పర్రా ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తూ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అయితే దీనిపై బీజేపీ ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై అధికార నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ నేత, అసెంబ్లీ స్పీకర్ రహీమ్ రాథర్ స్పందిస్తూ.. తాను ఆ తీర్మానాన్ని ఇంకా అంగీకరించలేదని వెల్లడించారు. దీంతో అసెంబ్లీలో అధికార, విపక్షాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. జమ్మూకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని కేంద్రప్రభుత్వం 2019లో రద్దు చేసింది. దీంతో జమ్మూకశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని కోల్పోయింది. అది రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడిపోయింది. ఈ రద్దును వ్యతిరేకిస్తూ పీడీపీ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది.
Also Read :Bus Accident : లోయలో పడిపోయిన బస్సు.. 20 మంది మృతి.. 20 మందికి గాయాలు
జమ్మూకశ్మీరు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సమయంలో.. ఆర్టికల్ 370ని పునరుద్ధరించాలని నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అగ్రనేత ఒమర్ అబ్దుల్లా(Jammu Kashmir) డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు ఆయన ఆర్టికల్ 370 గురించి మాట్లాడటం లేదు. అందుకే వ్యూహాత్మకంగా వ్యవహరించిన ప్రతిపక్ష పార్టీ పీడీపీ.. ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తూ తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఒకవేళ ఈ తీర్మానాన్ని ప్రభుత్వం ఆమోదించకుంటే.. ఆ అంశాన్ని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లో తీసుకెళ్లే ప్లాన్తో పీడీపీ ఉంది.
Also Read :Rafael Nadal Academy : రాకెట్ పవర్.. ‘అనంత’లోని నాదల్ టెన్నిస్ స్కూల్ విశేషాలివీ..
మరోవైపు సీఎం ఒమర్ అబ్దుల్లా జమ్మూకశ్మీర్కు రాష్ట్ర హోదాను సాధించడంపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఇటీవలే ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్షాలతో భేటీలో ఈ అంశాన్నే ప్రధానంగా ప్రస్తావించారు. కశ్మీరుకు రాష్ట్ర హోదాను కల్పించాలని కోరుతూ మంత్రివర్గం చేసిన తీర్మానాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఇప్పటికే ఆమోదించారు. త్వరలోనే కశ్మీరుకు రాష్ట్ర హోదాను ప్రకటించే ఛాన్స్ ఉంది. అయితే ఆర్టికల్ 370 పునరుద్ధరణ జరిగేే అవకాశం ఉండకపోవడంతో.. దానిపై ఒమర్ అబ్దుల్లా సర్కారు మౌనం వహిస్తోంది.