Doctors Safety : దేశంలో వైద్య సిబ్బంది భద్రతపై కేంద్రం కీలక నిర్ణయం
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో ఆగస్టు 8న రాత్రి జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటనను కేంద్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది.
- Author : Pasha
Date : 17-08-2024 - 3:01 IST
Published By : Hashtagu Telugu Desk
Doctors Safety : పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో ఆగస్టు 8న రాత్రి జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటనను కేంద్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఆస్పత్రుల్లో వైద్యుల భద్రతపై వైద్యసంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రస్తుత తరుణంలో మోడీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. డాక్టర్ల భద్రత కోసం ఓ కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. కోల్కతా ఘటనను నిరసిస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) పిలుపుమేరకు ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు దేశవ్యాప్తంగా వైద్యసేవలను నిలిపివేశారు. అందుకే కేంద్రం స్పందించి వైద్యులకు భరోసా ఇచ్చేలా ఈ నిర్ణయం తీసుకుంది.
We’re now on WhatsApp. Click to Join
దేశంలో వైద్యుల భద్రతకు మరిన్ని కఠినమైన చట్టాలు కావాలని వైద్యసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దీనిపై చర్చించేందుకు ఇవాళ ఉదయం కేంద్ర వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ అధికారులతో రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఫెడరేషన్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రతినిధులు భేటీ అయ్యారు. అందుకే డాక్టర్ల భద్రత కోసం ఓ కమిటీని ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది.
Also Read :CM Siddaramaiah : ముడా స్కాంలో సీఎం సిద్ధరామయ్య విచారణ.. గవర్నర్ సంచలన ఆదేశాలు
వైద్యసంఘాల ప్రతినిధులతో జరిగిన భేటీపై కేంద్ర ఆరోగ్యశాఖ(Doctors Safety) కూడా ఇవాళ ఓ ప్రకటన విడుదల చేసింది. వైద్యుల భద్రత విషయంలో తాము రాజీపడే ప్రసక్తే లేదని వారికి తేల్చి చెప్పామని వెల్లడించింది. ఇందుకోసం ఓ కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. వైద్య వృత్తిలో ఉన్న వాళ్ల భద్రత కోసం ఎలాంటి ప్రమాణాలను పాటించాలనే దానిపై ఈ కమిటీ కేంద్ర ఆరోగ్యశాఖకు సిఫారసులు చేస్తుందని పేర్కొంది. ఇప్పటికే దేశంలోని 26 రాష్ట్రాలు వైద్య సిబ్బంది రక్షణ కోసం చట్టాల్ని రూపొందించాయని ఆరోగ్యశాఖ గుర్తు చేసింది.