Peter Navarro: భారత్-అమెరికా వాణిజ్య వివాదంపై ట్రంప్ సలహాదారు సంచలన వ్యాఖ్యలు!
అమెరికా టారిఫ్లు పెంచిన తర్వాత ఇరు దేశాల సంబంధాలలో ఉద్రిక్తతలు పెరిగాయి. అయితే ట్రంప్ ప్రధానమంత్రి మోదీని 'గొప్ప ప్రధాని' అని ప్రశంసించడంతో కొంత సానుకూల వాతావరణం ఏర్పడింది.
- Author : Gopichand
Date : 15-09-2025 - 7:36 IST
Published By : Hashtagu Telugu Desk
Peter Navarro: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో (Peter Navarro) మరోసారి భారతదేశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్, అమెరికా మధ్య మంగళవారం వాణిజ్య చర్చలు ప్రారంభం కానున్న నేపథ్యంలో నవారో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “భారత్ చర్చల టేబుల్ వద్దకు వస్తోంది” అని అన్నారు. రాయిటర్స్ వార్తా సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. గతంలో ఆయన మాట్లాడుతూ, భారత్ చర్చలకు రాకపోతే పరిస్థితులు భారత్కు అనుకూలంగా ఉండవని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు వాణిజ్య చర్చలకు ముందు ఉద్రిక్తతను పెంచాయి.
మరో 25% టారిఫ్లు విధించనున్న అమెరికా
అమెరికా భారతీయ ఉత్పత్తులపై అదనంగా 25% టారిఫ్లు విధించాలని యోచిస్తున్న తరుణంలో ఈ చర్చలు జరుగుతున్నాయి. ఆగస్టులో భారత్ ఎగుమతులు గత తొమ్మిది నెలల్లో కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. ఇప్పటికే అమెరికా భారత్ నుంచి దిగుమతి చేసుకునే ఉత్పత్తులపై టారిఫ్లను 50%కి పెంచింది. ఈ నేపథ్యంలో, ఆగస్టులో వాయిదా పడిన ఇరు దేశాల మధ్య ఆరో దశ చర్చలు మంగళవారం జరగనున్నాయి. ఈ చర్చల కోసం అమెరికా సీనియర్ అధికారి బ్రెండన్ లించ్ ఢిల్లీకి చేరుకున్నారు.
Also Read: AP Liquor Case: ఏపీ లిక్కర్ కేసులో సిట్ మెమో.. ఏసీబీ కోర్టులో విచారణకు రంగం సిద్ధం
నవారో తీవ్ర ఆరోపణలు
పీటర్ నవారో గతంలో కూడా భారతదేశంపై అనేక తీవ్ర ఆరోపణలు చేశారు. అమెరికా మార్కెట్పై భారత్ అధిక టారిఫ్లు విధించి, అన్యాయంగా లబ్ధి పొందుతోందని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా రష్యా నుంచి చమురు కొనుగోలు చేసి భారత్ యుద్ధాన్ని ప్రోత్సహిస్తోందని ఆయన వాదించారు. భారత్ను ‘టారిఫ్ల మహారాజా’ అని సంబోధించి, రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ‘మోదీ యుద్ధం’ అని వ్యాఖ్యానించి వివాదాస్పదంగా మారారు.
సంబంధాలలో ఒడిదుడుకులు
అమెరికా టారిఫ్లు పెంచిన తర్వాత ఇరు దేశాల సంబంధాలలో ఉద్రిక్తతలు పెరిగాయి. అయితే ట్రంప్ ప్రధానమంత్రి మోదీని ‘గొప్ప ప్రధాని’ అని ప్రశంసించడంతో కొంత సానుకూల వాతావరణం ఏర్పడింది. దీనిపై మోదీ స్పందిస్తూ ట్రంప్ భావనను అభినందించారు. అమెరికాతో స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించడానికి తాము సిద్ధంగా ఉన్నామని సందేశం ఇచ్చారు. ఈ వివాదం ఇప్పుడు జరుగుతున్న చర్చలతో ఏ మలుపు తీసుకుంటుందో చూడాలి.