Pahalgam Terror Attack : పహల్గామ్ ఉగ్రదాడిలో మరో ఆసక్తికర ఘటన వెలుగులోకి
Pahalgam Terror Attack : అందుబాటులో గుర్రాలు లేక 28 మంది అక్కడే ఉండిపోవడం, మరోవైపు కేరళ నుంచి వచ్చిన ఓ కుటుంబం రెస్టారెంట్లో ఫుడ్లో ఉప్పు ఎక్కువగా ఉండడంతో ఆగిపోవడం ప్రాణాలను కాపాడింది
- Author : Sudheer
Date : 25-04-2025 - 11:43 IST
Published By : Hashtagu Telugu Desk
జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ బైసరన్ వ్యాలీలో జరిగిన ఉగ్రదాడి(Pahalgam Terror Attack)లో మరో ఆసక్తికర ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ ప్రాంతంలో ప్రయాణించేందుకు సిద్ధమైన 39 మంది అనుకోని ఆలస్యం కారణంగా దాడికి గురయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. అందుబాటులో గుర్రాలు లేక 28 మంది అక్కడే ఉండిపోవడం, మరోవైపు కేరళ నుంచి వచ్చిన ఓ కుటుంబం రెస్టారెంట్లో ఫుడ్లో ఉప్పు ఎక్కువగా ఉండడంతో ఆగిపోవడం ప్రాణాలను కాపాడింది. అదే సమయంలో ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులకు దిగిన సంఘటన చోటుచేసుకుంది.
AIMIM wins : ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం గెలుపు
ఇంకొక ఘటనలో భేల్పూరి తినేందుకు స్నాక్ బ్రేక్ తీసుకున్న ఓ జంట కూడా ఈ దాడి సమయంలో బయటపడింది. ఈ విధంగా అనుకోని ఆలస్యాలు పలువురి ప్రాణాలను రక్షించాయి. ఇక లష్కరే తోయిబాతో సంబంధం ఉన్న “ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF)” ఈ దాడికి బాధ్యత వహించగా, దాడిలో 25 మంది భారతీయ పర్యాటకులు, ఒక నేపాలీ పౌరుడు మరణించారు. ఈ ఘోర ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆవేదనకు గురిచేసింది.
ఇదిలా ఉండగా కాశ్మీర్లో భద్రతా దళాలు ఉగ్రవాదులపై కొనసాగుతున్న ఆపరేషన్లో బందిపోరా జిల్లాలో ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. నిఘా వర్గాల సమాచారం మేరకు బజిపోరా ప్రాంతంలో దాచుకున్న ఉగ్రవాదుల కోసం తనిఖీలు చేపట్టిన భద్రతా బలగాలు, ఈ ఎన్కౌంటర్లో లష్కరే తోయిబా టాప్ కమాండర్ అల్తాఫ్ లల్లిని మట్టుబెట్టాయి. ఈ ఆపరేషన్లు ఉగ్రవాదులపై కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కఠిన వైఖరిలో భాగంగా జరుగుతున్నాయి.