ALPA India : ఏఐ 171 విమాన ప్రమాదంపై పైలట్లను నిందించొద్దు.. పైలట్ల సంఘం ఆందోళన
ALPA India : ఎయిర్లైన్ పైలట్స్ అసోసియేషన్ (ఎఎల్పీఏ - ఇండియా) శనివారం ఎయిర్ ఇండియా AI-171 ప్రమాదంపై విమర్శలు గుప్పించింది.
- By Kavya Krishna Published Date - 06:56 PM, Sat - 12 July 25

ALPA India : ఎయిర్లైన్ పైలట్స్ అసోసియేషన్ (ఎఎల్పీఏ – ఇండియా) శనివారం ఎయిర్ ఇండియా AI-171 ప్రమాదంపై విమర్శలు గుప్పించింది. ఈ దుర్ఘటనపై విమాన ప్రమాదాల దర్యాప్తు సంస్థ (AAIB) విడుదల చేసిన ప్రాథమిక నివేదికలో పైలట్లను నేరుగా నిందించడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ALPA అధ్యక్షుడు కెప్టెన్ శామ్ థామస్ మాట్లాడుతూ, దర్యాప్తును పారదర్శకంగా కొనసాగించాలంటే తమను కూడా దర్యాప్తులో భాగస్వాములను చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కనీసం పరిశీలకులుగా అయినా తమను ఈ విచారణలో చేర్చాలని విజ్ఞప్తి చేశారు.
జూన్ 12న అహ్మదాబాద్ నుంచి టేక్ ఆఫ్ అయిన వెంటనే ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ విమానం కుప్పకూలిన ఘటనలో విమానంలోని 241 మంది ప్రయాణికులు సహా మొత్తం 260 మంది మరణించారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన AAIB ఇటీవల ప్రాథమిక నివేదిక విడుదల చేసింది. అయితే ఈ నివేదికపై ALPA తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేసింది. “ఈ దర్యాప్తు ముందే పైలట్లను నిందించే కోణంలో సాగుతోందనిపిస్తోంది. దీన్ని మేము ఖండిస్తాము,” అని కెప్టెన్ శామ్ థామస్ వ్యాఖ్యానించారు. పైలట్లను ముందుగానే నిందించడాన్ని వారు అన్యాయంగా భావిస్తున్నారు.
TATA Cars Life Time service : టాటా ఎలక్ట్రిక్ కార్లు.. ఈ మోడల్స్పై జీవితకాలం బ్యాటరీ ప్యాక్ వారంటీ!
అలాగే విచారణ గోప్యతతో కొనసాగుతోందని, పైలట్లు ఏ విషయమూ తెలియని పరిస్థితి లోపల నడుస్తోందని ఆక్షేపించారు. పైగా అధికారిక సంతకాలు లేని పత్రాలను మీడియాకు విడుదల చేయడాన్ని అసహనంగా పరిగణించారు. “ఇంత ముఖ్యమైన నివేదికను అధికారిక సంతకాలు లేకుండా బయటకు పంపడమేంటన్న ఆశ్చర్యం కలుగుతోంది. విచారణకు పారదర్శకత ఉండాలంటే మాకూ దానిలో స్థానం ఇవ్వాలి,” అని ALPA అభిప్రాయపడింది.
ప్రాథమిక నివేదిక ప్రకారం, విమానం ఇంజిన్లకు ఇంధనం సరఫరా చేసే రెండు ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్లు వేగంగా ఆఫ్ చేయడం వల్ల ఇంజిన్లు నిలిచిపోయాయని పేర్కొంది. కాక్పిట్ వాయిస్ రికార్డర్లో ఒక పైలట్, మరో పైలట్ను “నీవే ఫ్యూయల్ ఆఫ్ చేశావా?” అని అడిగినట్లు ఉంది. అందుకు “నేను చేయలేదు” అనే సమాధానం వచ్చిందని నివేదికలో పేర్కొన్నారు. మరోవైపు ప్రముఖ విమానయాన నిపుణుడు మార్క్ మార్టిన్ మాట్లాడుతూ, టేకాఫ్ సమయంలో పైలట్లు నడిపే ప్యానెల్కు దూరంగా ఉన్న స్విచ్లను గమనించకుండా ఇలా చేయడం చాలా అసాధ్యమని అన్నారు.
“ఒక పైలట్ కూడా ఈ దశలో పిచ్చివాడిలా వ్యవహరించరు. టేకాఫ్ సమయంలో దృష్టంతా ముందు ఉండే ఇన్స్ట్రుమెంట్స్పైనే ఉంటుంది. వెనుక భాగంలో ఉన్న స్విచ్లతో ఆడుకోవడం కష్టమే,” అని స్పష్టం చేశారు. “పూర్తి, సమగ్ర విచారణ నివేదిక వచ్చేంతవరకూ, ఎవ్వరినీ నిందించకూడదు,” అని ఆయన సూచించారు.
Srikalahasti : పీఏ హత్య కేసు..జనసేన నేత వినుత కోటా అరెస్టు, వేటు వేసిన పార్టీ!