Cow Urine Scheme : చత్తీస్ గడ్ లో ‘గోమూత్ర’ పథకం
- By CS Rao Published Date - 03:42 PM, Thu - 31 March 22
బీజేపీ పాలిత రాష్ట్రాలను తలదన్నేలా చత్తీస్ గడ్ లోని కాంగ్రెస్ ప్రభుత్వం `గో సంరక్షణ` వైపు వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే గోధన్ న్యాయ్ యోజన పథకం కింద ఆవు పేడను కిలో రూ. 1.50 చొప్పున కొనుగోలు చేస్తోంది. ఆ పథకాన్ని మరింత విస్తరింప చేయడానికి ఆవు మూత్రాన్ని కొనుగోలు చేయడానికి సిద్ధం అవుతోంది. గోధన్ న్యాయ్ యోజన పథకాన్ని చత్తీస్ గడ్ లోని కాంగ్రెస్ సర్కార్ 2020 జూలైలో ప్రారంభించింది. రైతులకు లాభదాయంగా ఉండడంతో పాటు బీజేపీ హిందూభావజాలంలోని గో సంరక్షణ నినాదాన్ని కాంగ్రెస్ అధిగమించింది. ఫలితంగా ఆవు మూత్రాన్ని కొనుగోలు చేయడానికి సిద్ధం అయింది. అందుకోసం ఆ రాష్ట్ర సీఎం భూపేష్ బఘేల్ బుధవారం అధికారులతో సమావేశం నిర్వహించాడు. ఆవు మూత్ర కొనుగోలుపై అధ్యయనం చేయడానికి ఒక సాంకేతిక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించాడు.
ఆవు మూత్రం సేకరణ, నాణ్యతా పరీక్షలు, వినియోగించే ఉత్పత్తులపై 15 రోజుల్లో నివేదిక సమర్పించాలని ఇందిరా గాంధీ అగ్రికల్చర్ యూనివర్శిటీ, కామధేను యూనివర్శిటీ ఫ్యాకల్టీతో కూడిన సాంకేతిక కమిటీ కోరింది. మహాత్మా గాంధీ రూరల్ ఇండస్ట్రియల్ పార్క్లో ఉపయోగించగల స్థానిక ముడి పదార్థాల లభ్యతను మ్యాప్ చేయనుంది. గోమూత్రం నుండి బయో-ఎరువులు మరియు బయో-ఎంజైమ్లను తయారు చేయడంపై సుదీర్ఘంగా చత్తీస్ గడ్ సీఎం భూపేష్ బఘేల్ చర్చించాడు. ఆవు పేడను సేకరించిన పద్ధతిలోనే పశువుల మూత్రాన్ని కూడా సేకరించాలని సీఎం భూపేష్ బఘేల్ అధికారులను ఆదేశించాడు. గ్రామ్ గౌతన్ (పశువుల షెడ్) సమితి ద్వారా పశువుల మూత్రాన్ని సేకరించాలని సూచించాడు. పేడ, మూత్ర సేకరణకు సహకరించిన పశువుల యజమానులు, రైతులకు వారానికి ఒకసారి చెల్లింపులు చేయడానికి ప్రణాళికను రూపొందించాలని ఆదేశించాడు. 2019లో జరిగిన 20వ పశుగణన ప్రకారం, ఛత్తీస్గఢ్లో 2,61,503 పశువులు ఉన్నాయి. ఆ సంఖ్య ఆధారంగా జూలై 2020లో, ఛత్తీస్గఢ్లోని కాంగ్రెస్ ప్రభుత్వం గోధన్ న్యాయ్ యోజనను ప్రారంభించింది.
చత్తీస్ గఢ్ బాటన మధ్యప్రదేశ్
చత్తీస్ గఢ్ ప్రభుత్వం ఆవు పేడ, మూత్రం కోసం అమలు చేస్తోన్న గోధన్ న్యాయ్ యోజన పథకాన్ని మధ్యప్రదేశ్ లోని బీజేపీ సర్కార్ అమలు చేయాలని భావిస్తోంది. గత వారం, ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గోవుల పెంపకాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని, ఆవు పేడతో సహా దాని ఉత్పత్తుల ఆర్థిక సామర్థ్యాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని పిలుపునిచ్చాడు. పచ్మర్హిలో జరిగిన ఎంపీ క్యాబినెట్లోని రెండు రోజుల మేధోమథన సెషన్లో తొలి రోజు, గో శాలలను స్వయం సమృద్ధిగా మార్చడానికి చర్యలు తీసుకునే అంశంపై చర్చించాడు. మధ్యప్రదేశ్లోని వివిధ నగరాల్లో ‘గోబర్ధన్’ ప్రాజెక్టులను ప్రారంభించడానికి ఆదేశాలు జారీ చేశాడు.
గుజరాత్తో సహా ఇతర రాష్ట్రాల్లో గోవుల సంరక్షణ, రక్షణ ప్రయోగాలను అధ్యయనం చేసి మధ్యప్రదేశ్లో కొత్త పథకాలను ప్రారంభించడానికి చౌహాన్ సర్కార్ కసరత్తు చేస్తోంది. ఆవు పేడ, మూత్రం ద్వారా ఆదాయం ఉంటే సాధారణ పౌరులు ఆవుల పెంపకం వైపు ప్రేరేపించబడతారు. ‘గౌశల’ (గోవుల ఆశ్రయాలు) కూడా స్వయం సమృద్ధిగా ఉండేలా కృషి చేస్తామని చౌహాన్ అభిప్రాయపడ్డాడు. ఇండోర్లో బయో-సిఎన్జి ప్లాంట్ విజయవంతంగా నిర్వహించబడిన తరువాత, గోబర్ధన్ పథకాన్ని రాష్ట్రంలోని ఇతర నగరాల్లో కూడా అమలు చేయడానికి చౌహాన్ సర్కార్ సిద్దం అవుతోంది.
Tags
Related News
Japan Rocket Experiment: జపాన్ లో ఆవు పేడతో రాకెట్ తయారీ
సంప్రదాయ రాకెట్ ఇంజన్లతో పోల్చితే లిక్విడ్ బయో మిథేన్ ఆధారిత ఇంజన్ల ఖర్చు చాలా తక్కువని జపాన్ స్పేస్ బలంగా నమ్మింది. ఈ నేపథ్యంలోనే అక్కడి ఇంజనీర్లు తమ రాకెట్లను ఆవు పేడతో తయారు చేసి అద్భుతం చేశారు.