Ramdev Baba : యాడ్స్ వివాదం..రామ్దేవ్ బాబాకు సుప్రీంకోర్టులో ఊరట
దీన్ని పరిగణనలోకి తీసుకున్న సర్వోన్నత న్యాయస్థానం.. వారిపై ధిక్కరణ కేసును మూసివేసింది.
- Author : Latha Suma
Date : 13-08-2024 - 2:45 IST
Published By : Hashtagu Telugu Desk
Ramdev Baba:సుప్రీంకోర్టు(Supreme Court)లో తప్పుదోవ పట్టించే ప్రకటనల(Patanjali Misleeading Ads) వివాదంలో రామ్దేవ్ బాబాకు భారీ ఊరట లభించింది. ఈ ప్రకటనలకు సంబంధించిన యోగా గరువు, సంస్థ వ్యవస్థాపకులు రామ్దేవ్బాబా, పతంజలి ఆయుర్వేద్ ఎండీ ఆచార్య బాలకృష్ణ ప్రజలకు బహిరంగ క్షమాపణలు తెలిపిన విషయం తెలిసిందే. ఇక మీదట అలాంటి యాడ్స్ ఇవ్వబోమని కోర్టుకు విన్నవించారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న సర్వోన్నత న్యాయస్థానం.. వారిపై ధిక్కరణ కేసును మూసివేసింది. అయితే, తమ ఆదేశాలను ఉల్లంఘిస్తే తీవ్ర చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ధర్మాసనం హెచ్చరించింది.
We’re now on WhatsApp. Click to Join.
ఆధునిక వైద్యవిధానాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ పతంజలి పై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం గతేడాది నవంబర్లో ఆ సంస్థను మందలించింది. దీంతో ఎలాంటి ఉల్లంఘనలూ జరగవంటూ అప్పట్లో సంస్థ తరఫున న్యాయవాది కోర్టుకు హామీ ఇచ్చారు. కానీ, వాటిని ఉల్లంఘించడంతో కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే వారిపై ధిక్కరణ చర్యలు చేపట్టింది.
దీంతో రామ్దేవ్ బాబా , బాలకృష్ణ పలుమార్లు కోర్టుకు హాజరై బేషరతుగా క్షమాపణలు చెప్పారు. వాటిని అంగీకరించని అత్యున్నత న్యాయస్థాం.. బహిరంగ క్షమాపణలు చెప్పాలని ఆదేశించింది. ఈ క్రమంలోనే రెండు సార్లు వార్తా పత్రికల్లో ఈ సంస్థ క్షమాపణల ప్రకటనలు ఇచ్చింది. భవిష్యత్తులో ఇలా తప్పుదోవ పట్టించే యాడ్స్ చేయబోమని తెలిపింది.