Ayodhya Ram Temple : ప్రధాని చేతుల మీదుగా వైభవంగా ధ్వజారోహణం!
- By Vamsi Chowdary Korata Published Date - 02:42 PM, Tue - 25 November 25
అయోధ్యలో రామమందిర నిర్మాణం పనులు ముగిశాయి. దీనికి సంకేతంగా అయోధ్యంలో ధ్వజారోహణ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. అయోధ్య ఘట్టంలో ఈ వేడుక ఓ మైలురాయిగా నిలవనుంది. ఈ చారిత్రక వేడుక కోసం 100 టన్నుల పుష్పాలతో సర్వాంగ సుందరంగా ఆలయం, పరిసరాలను అలంకరించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ధ్వజారోహణం ఎగురువేశారు. సరిగ్గా అభిజిత్ లగ్నంలో ఈ వేడుక జరిగింది. మొత్తం 7 వేల మంది అతిథులు ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు వచ్చారు.
ఉత్తర్ ప్రదేశ్లోఅయోధ్యలోని రామమందిరంలో మంగళవారం అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. అంగరంగ వైభవంగా ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. రామ్లల్లా గర్భగుడిపై ధర్మ ధ్వజాన్ని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ఆవిష్కరించారు. అభిజిత్ లగ్నంలో సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు కాషాయ జెండాను మోదీ ఎగురవేశారు. దీనికి ముందు గర్భగుడిలోని బాలరాముడికి ప్రధాని మోదీ హారతి ఇచ్చి ప్రత్యేక పూజలు చేశారు.
ఎన్నో ఏళ్లుగా జరుగుతున్నరామమందిర నిర్మాణం పూర్తయ్యిందనే దానికి సంకేతంగా ధ్వజారోహణవేడుకగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సాధువులు, శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ సభ్యులు సహా దాదాపు 7వేల మంది ప్రత్యక్షంగా తిలకించారు. రాముడు జన్మస్థలం అయోధ్యంలో భవ్యమైన మందిరం నిర్మాణం జరిగి.. గతేడాది జనవరి 22న బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసిన విషయం తెలిసిందే.
ఆలయ మొదటి అంతస్తులోని గోపురంపై 42 అడుగుల ఎత్తులో ఈ ధ్వజాన్ని మోదీ ఎగురవేశారు. కాషాయ రంగులో 22 అడుగుల పొడవు, 11 అడుగుల వెడల్పుతో లంబకోణ త్రిభుజాకారంలో ఉన్న ఈ ధ్వజంపై రాముడి తేజస్సు, శౌర్యాన్ని సూచించేలా సూర్యుడు, కోవిదార చెట్టు, ఓంకారం చిహ్నాలను బంగారు దారంతో ఎంబ్రాయిడరీ చేయించారు. ఐక్యత, సాంస్కృతిక వారసత్వం, రామరాజ్య ఆదర్శాలను ఇది ప్రతిబింబిస్తుంది. వాల్మీకి విరచిత రామాయణం ప్రకారం.. మందార, పారిజాత మొక్కలను కశ్యప మహార్షి అంటుకట్టడం ద్వారా ఈ కోవిదార చెట్టు ఆవిర్భవించినట్లు చెబుతారు. ప్రాచీన కాలంలోనే మొక్కల అంటుకట్టే విధానం ఉందనేది దీన్ని బట్టి తెలుస్తోంది.
మార్గశిర పంచమిని వివాహ పంచమిగా పిలుస్తారు. ఈ తిథినాడే సీతారాముల కళ్యాణం జరిగిందని, అభజిత్ లగ్నంలో శ్రీరాముడు కౌసల్య గర్భాన జన్మించినట్టు పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ విశిష్టమైన రోజున అదే అభిజిత్ లగ్నంలో ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. అహ్మదాబాద్లోని పారాచ్యూట్ తయారీ సంస్థ ఈ ధ్వజాన్ని తయారుచేసింది. చాలాకాలం పాటు మన్నేలా పారాచ్యూట్ గ్రేడ్ వస్త్రం, పట్టుదారాలతో 25 రోజుల పాటు శ్రమించి తయారుచేశారు.
ధ్వజారోహణం అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యం భారతీయ డీఎన్ఏలోనే ఉందని అన్నారు. అంతేకాదు, అయోధ్యలో భవ్యమైన రామమందిర నిర్మించాలనే హిందువుల 500 ఏళ్ల నాటి కల నెరవేరిందని పేర్కొన్నారు. ‘‘అయోధ్య తన చరిత్రలో మరో యుగ ఘట్టాన్ని చూస్తోంది… దేశంతో పాటు భూగోళం మొత్తం రాముని భక్తిలో మునిగిపోయింది’’ అని వ్యాఖ్యానించారు. ప్రముఖ స్వామీజీ గణేశ్వర్ శాస్త్రి ఆధ్వర్యంలో అయోధ్య, కాశీ, దక్షిణ భారతదేశానికి చెందిన 100 మంది పండితులు చేతులు మీదుగా ఈ కార్యక్రమం సాగింది.