Active Internet Users: 75.9 కోట్ల యాక్టివ్ ఇంటర్నెట్ యూజర్స్
తొలిసారిగా మన దేశ జనాభాలో సగం కంటే ఎక్కువ మంది (75.9 కోట్ల మంది) యాక్టివ్ ఇంటర్నెట్ (Internet) వినియోగదారులు ఉన్నట్లు తేలింది.
- Author : Maheswara Rao Nadella
Date : 04-05-2023 - 8:45 IST
Published By : Hashtagu Telugu Desk
Active Internet Users : తొలిసారిగా మన దేశ జనాభాలో సగం కంటే ఎక్కువ మంది (75.9 కోట్ల మంది) యాక్టివ్ ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్నట్లు తేలింది. వీరంతా కనీసం నెలకు ఒకసారి ఇంటర్నెట్ను (Internet) యాక్సెస్ చేస్తున్నారని ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (IAMAI) , మార్కెట్ డేటా అనలిటిక్స్ సంస్థ కాంటార్ లు బుధవారం సంయుక్త నివేదికను విడుదల చేశాయి. దీని ప్రకారం.. భారతదేశంలో క్రియాశీల ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 2025 సంవత్సరం నాటికి 90 కోట్లకు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతమున్న 75.9 కోట్ల మంది యాక్టివ్ ఇంటర్నెట్ వినియోగదారులలో 39.9 కోట్ల మంది గ్రామీణ ప్రాంతాలవారు కాగా , 36 కోట్ల మంది పట్టణాల వారని తేలింది. గత ఏడాది వ్యవధిలో ఇంటర్నెట్ వినియోగం రూరల్ ప్రాంతాల్లో 14 శాతం పెరగగా.. పట్టణాల్లో 6 శాతమే వృద్ధిని సాధించింది.
బీహార్ జనాభాలో 32 శాతం మందే ఇంటర్నెట్ (Internet) వినియోగదారులు ఉండగా.. గోవా జనాభాలో అత్యధికంగా 70 శాతం మంది ప్రజలు ఇంటర్నెట్ వాడుతున్నారు. మొత్తం ఇంటర్నెట్ యూజర్స్ లో 54 శాతం మంది పురుషులే ఉన్నారు. అయితే 2022లో కొత్తగా ఇంటర్నెట్ వినియోగం ప్రారంభించిన వారిలో 57 శాతం మంది మహిళలే ఉండటం గమనార్హం. 2025 నాటికి మొత్తం కొత్త వినియోగదారులలో 65 శాతం మంది మహిళలే ఉంటారని అంచనా. ఇక డిజిటల్ చెల్లింపులు చేసే వారి సంఖ్య 2021లో 13 శాతం పెరిగి 33.8 కోట్లకు పెరిగింది. వారిలో 36 శాతం మంది గ్రామీణులే. డిజిటల్ చెల్లింపులు చేసే మొత్తం వినియోగదారులలో 99 శాతం మంది UPI వినియోగదారులేనని నివేదిక స్పష్టం చేసింది.
Also Read: Karnataka Elections: కర్ణాటకలో ఆ పార్టీ తరపున ప్రచారం చేస్తున్న బ్రహ్మానందం.. ఫొటోస్ వైరల్?