Lord Shani: ఈ ఏడాది శని జయంతి ఎప్పుడు? ఎలాంటి పనులు చేయాలి? పూజా విధానం ఇదే!
- Author : Vamsi Chowdary Korata
Date : 15-05-2026 - 2:34 IST
Published By : Hashtagu Telugu Desk
సూర్యనారాయణ, ఛాయాదేవి దంపతుల కుమారుడైన శనీశ్వరుడి గురించి మనందరికీ తెలిసిందే. శని దేవుడిని న్యాయదేవుడిగా కూడా పిలుస్తూ ఉంటారు. శనీశ్వరుడు వైశాఖమాసం అమావాస్య రోజున జన్మించాడు. ఇక ఆయన జయంతి రోజున ఆయనను ప్రత్యేకంగా పూజించి ఆరాధించడం వల్ల ప్రత్యేక ఫలితాలు కలుగుతాయని చెబుతున్నారు. ఆయన అనుగ్రహం కలిగితే అప్పులు, రకరకాల వ్యాధులు, అనేక సమస్యల నుంచి కూడా బయటపడవచ్చట. శని జయంతి ఎప్పుడన్న విషయానికి వస్తే…
వైశాఖ మాసంలోని అమావాస్య తిథి మే 16న ప్రారంభమవుతుందట. ఈ రోజున ఉదయం స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి. తర్వాత శనీశ్వరుడిని నల్లటి వస్త్రంపై ప్రతిష్టించాలి. ఆ తర్వాత దేవుడి ముందు ఆవనూనె దీపం వెలిగించాలి. పంచగవ్యం, పంచామృతం మొదలైన వాటితో అభిషేకం చేసిన తర్వాత కుంకుమ పెట్టాలి. తరువాత పువ్వులు సమర్పించి, నూనెతో చేసిన స్వీట్లను ప్రసాదంగా సమర్పించాలి.
తరువాత జపమాల తీసుకుని శని మంత్రాన్ని జపించడం మంచిది. “ఓం ప్రమ్ ప్రీం ప్రౌం సః శనైశ్చరాయ నమః” అనే పంచోపచార మంత్రాన్ని జపించాలని చెబుతున్నారు. దీని తరువాత శని చాలీసా పారాయణం చేసి, శని దేవుడికి హారతి ఇవ్వాలట. చివరగా పూజ సమయంలో తెలిసి తెలియక చేసిన తప్పులకు క్షమాపణ అడగాలట. ఈరోజు మీకు కుదిరితే, మీకు చేతనైనంత వరకు, మీకు స్తోమత ఉన్నంతవరకు దానధర్మాలు చేయడం మంచిది. ముఖ్యంగా కుక్కలకు అలాగే కాకులకు ఆహారాన్ని పెట్టడం మంచిది. అవసరం ఉన్నవారికి, పేదవారికి దానధర్మాలు చేయడం మంచిదని చెబుతున్నారు.