Dhanurmasam : ధనుర్మాసం అంటే ఏమిటి? ధనుర్మాసం ప్రత్యేకత ఏంటి?
ధనుర్మాసం విష్ణుమూర్తికి (Lord Vishnu) ప్రీతికరమైన మాసం కావడం వల్ల వైష్ణవులు ధనుర్మాస వ్రతం ఆచరిస్తారు.
- By Vamsi Chowdary Korata Published Date - 04:30 AM, Fri - 16 December 22
కార్తీక మాసం, మాఘ మాసం, శ్రావణ మాసం.. ఇలా ఈ నెలలకు మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఉందని చాలా మంది భావిస్తారు. కానీ.. ధనుర్మాసం (Dhanurmasam) కూడా చాలా ఆధ్యాత్మిక ప్రయోజనాలు కలిగిన నెల అని చాలా మందికి తెలియదు. ఈ నెలకు కూడా చాలా ప్రత్యేకత ఉంది. ధనుర్మాసమంతా.. ఉదయం, సాయంత్రం ఇల్లు శుభ్రం చేసి.. దీపారాధన చేయడం వల్ల మహాలక్షి కరుణా, కటాక్షాలు సిద్ధిస్తాయి.
ధనుర్మాసం (Dhanurmasam) విష్ణువుకి చాలా ప్రత్యేకమైనది. తిరుమలలో ధనుర్మాసం నెల రోజులు.. సుప్రభాతం బదులు తిరుప్పావై గానం చేస్తారు. విష్ణు ఆలయాలల్లో ఉదయం అర్చనలు చేసి నివేదనలు చేసి వాటిని పిల్లలకు పంచుతారు. ఇలా చేయడాన్ని బాలభోగం అంటారు. అలాగే ధనుర్మాసం దేవతలకి బ్రాహ్మీ ముహూర్తం లాంటిది. ఈ మకర కర్కాటక సంక్రాంతులలో స్నాన, దాన, హోమ, వ్రత పూజలు చేయడం చాలా మంచిది.
ధనుర్మాసానికి ఎందుకంత విశిష్టత?
ధనుర్మాసం వచ్చిందంటే.. ఆలయాల్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. విష్ణుమూర్తికి (Lord Vishnu) ప్రీతికరమైన మాసం కావడం వల్ల వైష్ణవులు ధనుర్మాస వ్రతం ఆచరిస్తారు. గోదాదేవి ధనుర్మాసం అంతా విష్ణు వ్రతం చేపట్టి, స్వామిని కీర్తించింది. సూర్య ఆలయాలు, విష్ణు ఆలయాలు, సందర్శించడం చాలా మంచిది.
ధనుర్మాసం అంటే దివ్య ప్రార్థనకు అనువైన మాసమని అర్థం. ధనుర్మాసం తెలుగు సంస్కృతిలో ఒక భాగం. దేవాలయాల్లో ఆండాళమ్మ పూజ, తిరుప్పావై పఠనం, గోదాకళ్యాణం ప్రసాదాలు మొదలైనవి ధనుర్మాసంలోనే నిర్వహిస్తారు. తిరుమలలో ధనుర్మాసం నెల రోజులు, సుప్రభాతం బదులు తిరుప్పావై గానం, సహస్రనామార్చనలో తులసీదళాలకు బదులు బిల్వ పత్రాలను ఉపయోగిస్తారు.
ధనుర్మాసంలో ఉదయం, సాయంత్రం దీపారాధన చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు, దరిద్రం దూరమవుతుంది. ఈ నెలలో ప్రతి రోజు బ్రహ్మ ముహూర్తంలో పారాయణం చేసిన వారు దైవానుగ్రహానికి పాత్రులవుతారని ప్రతీతి. ఆ భూదేవి, అవతారమైన ఆండాళ్ రచించిన దివ్య ప్రబంధమే తిరుప్పావై. ద్రవిడ భాషలో తిరు అంటే పవిత్రమైన, పావై అంటే వ్రతం అని అర్థం.
ధనుర్మాసంలో విష్ణువును మధుసూధనుడు అనే పేరుతో పూజించి, మొదటి పదిహేను రోజులు చక్కెర పొంగలి లేదా పులగం స్వామికి నైవేద్యంగా సమర్పించాలి. తర్వాత పదిహేను రోజులు దద్యోజనం అర్పించాలి. పెళ్లికాని అమ్మాయిలు ఇంటి ముందు ముగ్గులు, గొబ్బిళ్లతో పూజలు చేయటం వల్ల తాము కోరిన వరుడు లభిస్తాడు. గోదాదేవి మార్గళి వ్రతం పేరుతో విష్ణువును ధనుర్మాసమంతా పూజించింది.
శ్రీకృష్ణుని ధనుర్మాసం నెల రోజులూ తులసీ మాల సమర్పించే యువతులకు, నచ్చిన వరునితో వివాహం జరుగుతుంది. ధనుర్మాస వ్రతం దీని గురించి మొదట బ్రహ్మదేవుడు నారద మహర్షికి వివరించినట్లు పురాణ కథనం. ధనుర్మాస వ్రతం గురించి బ్రహ్మాండ, ఆదిత్య పురాణాల్లో, భాగవతంలో, నారాయణ సంహితలో కనిపిస్తాయి.
ఈ వ్రతం ఆచరించాలనుకునే వాళ్లు తమ స్థోమతను బట్టి విష్ణు ప్రతిమని చేయించి పూజించాలి. ప్రతిరోజూ సూర్యోదయానికి ముందే స్నానాలు పూర్తిచేయాలి. పంచామృతాలతో మహావిష్ణువును అభిషేకించి.. తర్వాత తులసీ దళాలు, పూలతో అష్టోత్తర సహస్రనామాలతో స్వామిని పూజించి నైవేద్యం సమర్పించాలి.
నెల రోజులూ చేయలేని వాళ్లు 15 రోజులు, 8 రోజులు లేదా ఒక్క రోజైనా చేయవచ్చు. ధనుర్మాస వ్రతం చేయడం వల్ల ఇహలోక సుఖాలు, పరలోక మోక్షం పొందుతారు. ఆత్మ పరమాత్మను చేరడానికి ఉపకరించేదే ధనుర్మాస వ్రతం. ప్రాచీన కాలం నుంచి భారతీయులందరూ ఈ వత్రాన్ని ఆచరిస్తున్నారు.
Also Read: Sri Khand Mahadev : మరో అమర్నాధ్ శ్రీ ఖండ్ మహాదేవ్ యాత్ర
Related News
Zomato: ఆ సర్వీసులను నిలిపివేసిన జొమాటో.. కారణం ఏంటంటే..?
ప్రసిద్ధ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో ఇప్పుడు తన కస్టమర్లకు సమీపంలోని నగరాల నుండి మాత్రమే కాకుండా ఇతర నగరాలు, రాష్ట్రాల నుండి కూడా ఆహారాన్ని ఆర్డర్ చేసే సదుపాయాన్ని కల్పిస్తోంది.