Varalakshmi Vratam: రేపే వరలక్ష్మి వ్రతం.. పూజా విధానం ఇదే!
ఆ తర్వాత కలశం వద్ద ఉన్న అమ్మవారిని షోడశోపచారాలతో పూజించాలి. అమ్మవారికి అష్టోత్తర శతనామావళి, లక్ష్మీ స్తోత్రాలు పఠించాలి.
- Author : Gopichand
Date : 07-08-2025 - 3:47 IST
Published By : Hashtagu Telugu Desk
Varalakshmi Vratam: శ్రావణ మాసం అంటేనే వ్రతాలకు, పూజలకు, పండుగలకు నెలవు. ఈ మాసంలో వచ్చే శుక్రవారాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు జరుపుకునే వరలక్ష్మీ వ్రతం (Varalakshmi Vratam) అత్యంత విశేషమైనది. సాక్షాత్తు లక్ష్మీదేవిని పూజించడం ద్వారా అష్టలక్ష్ముల ఆశీస్సులు లభిస్తాయని భక్తులు నమ్ముతారు. వివాహిత స్త్రీలు తమ కుటుంబ సౌభాగ్యం, భర్త, పిల్లల ఆరోగ్య, ఐశ్వర్యాల కోసం ఈ వ్రతాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో ఆచరిస్తారు. ఈ సంవత్సరం వరలక్ష్మీ వ్రతం రేపే (ఆగస్టు 8, శుక్రవారం) జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా వ్రత ప్రాముఖ్యత, పూజా విధానం గురించి వివరంగా తెలుసుకుందాం.
వరలక్ష్మీ వ్రతం ప్రాముఖ్యత
శ్రావణ మాసంలో లక్ష్మీదేవికి చేసే ఈ పూజ వల్ల అష్టైశ్వర్యాలైన సంపద, ధాన్యం, ధైర్యం, విద్యా, సంతానం, విజయం, కీర్తి, సుఖం వంటివి లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ వ్రతాన్ని ఆచరిస్తే కేవలం ఒక్క పూజతో అష్టలక్ష్ములను పూజించినంత ఫలితం దక్కుతుందని భక్తుల విశ్వాసం. స్కాంద పురాణంలో పరమశివుడు పార్వతీదేవికి ఈ వ్రత ప్రాముఖ్యతను వివరించినట్లుగా పేర్కొనబడింది. దీని వెనుక చారుమతి అనే మహిళ కథ ఉంది. ఆమె తన భక్తి, నిష్ఠతో ఈ వ్రతాన్ని ఆచరించి సకల సౌభాగ్యాలను పొందినట్లు కథనం.
Also Read: IMD : తెలంగాణలో మూడురోజులు భారీ వర్షాలు.. ఎల్లో అలెర్ట్ జారీ
వరలక్ష్మీ వ్రతం పూజా విధానం
కలశ స్థాపన, మండప ఏర్పాటు
- వ్రతం చేసే రోజు ఉదయాన్నే తలస్నానం చేసి, ఇల్లు, పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి.
- పూజా మందిరంలో ఒక మండపాన్ని ఏర్పాటు చేసి, బియ్యపు పిండితో అందమైన ముగ్గు వేయాలి.
- ఒక కలశాన్ని (కొత్త పాత్రను) తీసుకుని దానిపై పసుపు, కుంకుమ, గంధం బొట్లు పెట్టాలి. కలశంలో నీరు, కొంచెం బియ్యం, నాణేలు, పసుపు, కుంకుమ, పూలు వేసి మామిడి ఆకులు అమర్చాలి.
- కలశంపైన ఒక కొబ్బరికాయను ఉంచి దానిపై లక్ష్మీదేవి ముఖాన్ని లేదా విగ్రహాన్ని ఉంచాలి.
- ఈ కలశాన్ని ముగ్గు వేసిన పీఠంపై ఉంచి, పూజకు సిద్ధం చేయాలి.
తోరణాలను తయారు చేసుకోవడం
- పూజకు ముందు, తెల్లటి దారాన్ని ఐదు లేదా తొమ్మిది పోగులుగా తీసుకుని దానికి పసుపు రాయాలి.
- ఆ దారానికి ఐదు లేదా తొమ్మిది పూలతో ముడి వేసి తోరణాలు తయారు చేసుకోవాలి.
- ఈ తోరణాలను పళ్ళెంలో ఉంచి పసుపు, కుంకుమ, అక్షింతలతో పూజించాలి. పూజ తర్వాత వీటిలో ఒక తోరాన్ని చేతికి కట్టుకోవాలి.
పూజా క్రమం
- ముందుగా పసుపు గణపతిని పూజించి, పూజకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా చూడమని ప్రార్థించాలి.
- ఆ తర్వాత కలశం వద్ద ఉన్న అమ్మవారిని షోడశోపచారాలతో పూజించాలి. అమ్మవారికి అష్టోత్తర శతనామావళి, లక్ష్మీ స్తోత్రాలు పఠించాలి.
- వ్రత కథను చదువుకుని, కుటుంబ సభ్యులతో కలిసి వినాలి.
- లక్ష్మీదేవికి ఇష్టమైన నైవేద్యాలు (పాయసం, వడపప్పు, పులిహోర, పానకం, అట్లు మొదలైనవి) సమర్పించాలి.
- చివరగా దీపారాధన చేసి, హారతి ఇవ్వాలి. పూజానంతరం తోరాలను చేతికి కట్టుకుని, పెద్దల ఆశీర్వాదాలు తీసుకోవాలి.
- వాయినాలు ఇచ్చి పుచ్చుకోవడం ఈ వ్రతంలో ముఖ్యమైన ఆచారం. ముత్తైదువులకు పసుపు, కుంకుమ, తాంబూలం, రవికల బట్టలు, ఇతర కానుకలను ఇవ్వడం ద్వారా అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు.
వరలక్ష్మీ వ్రత ముహూర్తాలు
ఈ సంవత్సరం వరలక్ష్మీ వ్రతం ఆగస్టు 8న జరగనుంది. ఈ రోజున పూజకు అనుకూలమైన ముహూర్తాలు.
- సింహ లగ్న పూజ: ఉదయం 6:54 నుండి 9:02 వరకు.
- వృశ్చిక లగ్న పూజ: మధ్యాహ్నం 1:19 నుండి 3:33 వరకు.
- కుంభ లగ్న పూజ: సాయంత్రం 7:29 నుండి రాత్రి 9:06 వరకు.
- వృషభ లగ్న పూజ: అర్ధరాత్రి 12:25 నుండి 2:25 వరకు.