Buddha Jayanti : బుద్ధ జయంతి.. ప్రపంచాన్ని మేల్కొల్పిన బుద్ధుడి బోధనలివీ
ప్రపంచాన్ని పరివర్తన దిశగా నడిపేందుకు బుద్ధుడు(Buddha Jayanti) నాలుగు సత్యాలను బోధించారు. వాటిని ఆర్యసత్యాలు అంటారు.
- Author : Pasha
Date : 12-05-2025 - 1:10 IST
Published By : Hashtagu Telugu Desk
Buddha Jayanti : ఇవాళ (మే 12) వైశాఖ శుద్ధ పూర్ణిమ. బుద్ధుడు జన్మించింది, నిర్యాణం చెందింది, జ్ఞానోదయం పొందింది కూడా వైశాఖ శుద్ధ పూర్ణిమ రోజే. అందుకే ఈరోజున మనం బుద్ధ జయంతిగా, బుద్ధ పూర్ణిమగా జరుపుకుంటాం. జ్ఞానోదయం పొందిన తర్వాత బుద్ధుడు 45 సంవత్సరాల పాటు ప్రజలకు బోధనలు చేశారు. జీవితం విలువ గురించి అందరికీ తెలియజేశారు. రాజ కుటుంబంలో జన్మించిన బుద్ధుడు.. సన్యాసిగా మారి అందరికీ ఆదర్శంగా నిలిచారు. సుఖ సంతోషాలు అనేవి రాజభోగాల్లో దాగి లేవని బుద్ధుడు చెప్పేవారు.
Also Read :Taliban Vs Chess : చెస్పై బ్యాన్.. తాలిబన్ల సంచలన నిర్ణయం.. ఎందుకు ?
ప్రపంచాన్ని మేల్కొల్పిన బుద్ధుడి బోధనలు
- ప్రపంచాన్ని పరివర్తన దిశగా నడిపేందుకు బుద్ధుడు(Buddha Jayanti) నాలుగు సత్యాలను బోధించారు. వాటిని ఆర్యసత్యాలు అంటారు.
- మనం వ్యక్తులు, వస్తువులపై అనురాగాన్ని పెంచుకుంటాం. వాటితో ఎడబాటు కలిగితే దుఃఖానికి గురవుతాం. జననమరణాలు ఎలా అనివార్యమో దుఃఖమూ అలాగే అనివార్యం అని బుద్ధుడు చెప్పారు. ఆయన చెప్పిన మొదటి ఆర్య సత్యం ఇదే.
- దుఃఖం మూలాల్ని సరిగ్గా వెతికి పట్టుకోవడం ద్వారా దాన్ని నివారించుకోవచ్చని బుద్ధడు చెప్పాడు. మనుషుల్లో కోరిక సహజం. అదే సకల సమస్యలకు కారణం. కోరికలు పుడుతూనే ఉంటాయి. కోరికల్ని నియంత్రించుకోవచ్చు అని బుద్ధుడు చెప్పారు.
- దుఃఖ నివారణకు బుద్ధుడు అష్టాంగ మార్గాల్ని బోధించాడు. సరైన దృష్టి, సరైన ఆలోచన, సరైన వాక్కు, సరైన చర్య, సరైన జీవనం, సరైన వ్యాయామం, సరైన స్మృతి, సరైన సమాధితో దుఃఖ నివారణ సాధ్యమవుతుందని బుద్ధుడు చెప్పారు. ఈ పనులన్నీ చేయడానికి కావాల్సిన ఏకాగ్రతే సమాధి.
- దుఃఖానికి దూరంగా ఉండాలన్నా, కోరికల్ని జయించాలన్నా, దుఃఖ నివారణకు ఉన్న ఉపాయాన్ని సాధన చేయాలన్నా అష్టాంగ మార్గమే శరణ్యం అని బుద్ధుడు బోధించారు.
Also Read :Virat Kohli : విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం.. టెస్టులకు గుడ్బై
బౌద్ధ మతంలోకి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 1956 అక్టోబర్ 14న మహారాష్ట్రలోని నాగ్పూర్లో లక్షల మంది అనుచరులతో కలిసి బౌద్ధ మతాన్ని స్వీకరించారు. హిందూ మతం నుంచి బౌద్ధ మతంలోకి మారుతున్న సందర్భంలో అంబేడ్కర్ చేసిన 22 ప్రతిజ్ఞలు ఇప్పటికీ చర్చలో ఉన్నాయి. ‘‘బౌద్ధ మతాన్ని స్వీకరించిన తర్వాత ప్రజలు మునపటి భావజాలంలోకి తిరిగి వెళ్లేందుకు బాబా సాహెబ్ ఒప్పుకోలేదు. అందుకే, ఈ 22 ప్రతిజ్ఞలు చేశారు. భిన్నమైన జీవన విధానాన్ని ఎంపిక చేసుకున్నామని ఆయన ప్రజలకు తెలియజేయాలనుకున్నారు.’’ అని రచయిత, సోషల్ యాక్టివిస్ట్, దళిత్ పాంథర్ కో ఫౌండర్ అర్జున్ డాంగ్లే చెప్పారు.