Sankranti: సంక్రాంతి రోజు సూర్య భగవానుడికి అర్ఘ్యం ఎలా సమర్పించాలి.. పూజా విధానం ఇదే?
రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఏడాదిలో జరుపుకునే మొట్టమొదటి పండుగ సంక్రాంతి. సంక్రాంతి పండుగను కొందరు మూడు రోజులు మరికొందరు నాలుగు రోజులు పా
- Author : Anshu
Date : 09-01-2024 - 9:00 IST
Published By : Hashtagu Telugu Desk
రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఏడాదిలో జరుపుకునే మొట్టమొదటి పండుగ సంక్రాంతి. సంక్రాంతి పండుగను కొందరు మూడు రోజులు మరికొందరు నాలుగు రోజులు పాటు ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. కొత్త అల్లుళ్లు, పిండి వంటలు, కోడిపందాలు, ముగ్గుల పోటీలతో ఈ సంక్రాంతి పండుగ అంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఉంటారు. కాగా హిందువులు జరుపుకునే అతి పెద్ద పండగలలో ఒకటి సంక్రాంతి. తెలుగు రాష్ట్రాలతో పాటు అనేక ప్రాంతాల్లో మకర సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంటారు. మూడు రోజుల పాటు జరుపుకునే ఈ పండగలో రెండో రోజు మకర సంక్రాంతి. ఈ రోజు ప్రత్యక్ష దైవం సూర్యనారాయణుడు తన తనయుడు శనిస్వరుడు అధిపతి అయిన మకరరాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ కారణంగా మకర సంక్రాంతి పండుగకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.
ఈ రోజున ప్రధానంగా సూర్య భగవానుని పూజిస్తారు. ఈ పండుగ సూర్య భగవానుడికి అంకితం చేయబడింది. ఈ రోజున సూర్యుడిని ఆరాధించడం వలన సుఖ సంపదలు కలుగుతాయని విశ్వాసం. ఈ రోజున సూర్య భగవానుడిని భక్తితో పూజించి.. అర్ఘ్యం సమర్పిస్తే త్వరలోనే సూర్యుడు వారి కోరికలన్నీ తీరుస్తాడని నమ్మకం. సంక్రాంతి పండుగ రోజు సూర్య భగవానుడుని ఎలా పూజించాలి అన్న విషయానికి వస్తే.. ఈ ఏడాది అనగా 2024 జనవరి 15న మకర సంక్రాంతి పండుగ వచ్చింది. ఈ రోజున సూర్య భగవానుడుని, విష్ణువును ఆరాధించడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు. కాబట్టి ఈ రోజు తెల్లవారుజామున నిద్రలేచి సూర్యభగవానుని ఆరాధించి పవిత్ర నదిలో స్నానం చేయాలి. నది స్నానం చేయడానికి వీలు కాకపోతే స్నానం చేసే నీటిలో గంగాజలం కలపాలి.
స్నానం చేసిన తర్వాత రాగి పాత్రను తీసుకుని అందులో నీరు పోసి ఎరుపు పువ్వులు, అక్షతలను కలపాలి. అనంతరం ఆ నీటిని సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి. సూర్య భగవానుడికి సంబంధించిన మంత్రాలను పఠిస్తే శుభం కలుగుతుంది. ఈ రోజున సూర్యభగవానుడు మకరరాశిలోకి ప్రవేశిస్తాడని మకరరాశిలోకి ప్రవేశించిన వెంటనే వాతావరణంలో మార్పు వస్తుందని నమ్ముతారు. సూర్య భగవానుడిని శివుని మూడు కన్నులలో ఒకటైన త్రినేత్రంతో పోలుస్తారు. మకర సంక్రాంతి రోజున సూర్య భగవానుడు ప్రత్యక్ష దైవంగా పూజలను అందుకుంటాడు. సూర్య భగవానుని పూజించడానికి మకర సంక్రాంతి రోజు అత్యంత పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుంది.
కాబట్టి ఈ రోజు తప్పకుండా సూర్యుని పూజించడం మంచిది. అలాగే ఎవరి జీవితంలోనైనా సుఖ సంతోషాలు, శాంతి, ఐశ్వర్యం కలగాలంటే మకర సంక్రాంతి రోజున తెల్లవారు జామునే బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి ముందుగా స్నానం చేసి స్నానపు నీటిలో గంగాజలం కలిపి, గంగాజలం అందుబాటులో లేకపోతే తులసి ఆకులను కూడా వేసుకోవచ్చు. స్నానం చేసిన తరువాత, శుభ్రమైన లేదా కొత్త బట్టలు ధరించి, సూర్య భగవానుడిని ధ్యానం చేయాలి. సూర్య నమోస్తు శ్లోకాన్ని 21 సార్లు జపించాలి. దీని తరువాత సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించడానికి స్వచ్ఛమైన నీటితో ఒక రాగి పాత్రను నింపాలి. ఇంటి బాల్కనీ లేదా టెర్రస్కు చెప్పులు లేకుండా వెళ్లి,సూర్య భగవానుని 12 పేర్లను జపించి, ఆ తర్వాత సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి.
సూర్యునికి అర్ఘ్య సమర్పణ చేసేటప్పుడు ఓం సూర్యాయ నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం నమో భాస్కరాయ నమః అని మంత్రాలను పఠించాలి. అర్ఘ్య సమర్పయామి అంటూ ఈ మంత్రాన్ని జపించాలి. సూర్యునికి అర్ఘ్యం సమర్పించిన తర్వాత అదే స్థలంలో మూడుసార్లు ప్రదక్షిణ చేయాలి. ఇలా చేయడం సూర్య భగవానుడికి ప్రదక్షిణ చేయడంతో సమానం. మకర సంక్రాంతి రోజున సూర్య చాలీసా పఠించడం కూడా చాలా మంచిది. అంతేకాదు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించవచ్చు. ఉజ్వల భవిష్యత్తు కోసం సూర్య భగవానుని ప్రార్థించవచ్చు. మకర సంక్రాంతి రోజున సూర్యభగవానుని ముందు ఆహారం, నీరు, బట్టలు మొదలైన వాటిని ఉంచ వాటిని అవసరమైన వారికి దానం చేస్తే, సూర్య భగవానుడు సంతోషిస్తాడని నమ్ముతారు.